
2014 సెప్టెంబర్ నుంచి బకాయిలను కూడా చెల్లించాలని
సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి హైకోర్టులో చుక్కెదురైంది. అకారణంగా పెన్షన్ జాబితా నుంచి తీసివేసిన 490 మందికి పెన్షన్ ఇవ్వాలని కోర్టు ఏపీ ప్రభుత్వాన్ని ఆదేశించింది. ప్రతిపక్ష వైఎస్సార్ సీపీకి చెందిన పలువురి పెన్షన్లను ప్రభుత్వం రద్దు చేసిన సంగతి తెలిసిందే. దీంతో శ్రీకాకుళం జిల్లా పొందూరు ఎంపీపీ సువ్వారి గాంధీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై విచారణ చేపట్టిన కోర్టు శుక్రవారం తీర్పు వెలువరించింది.
పెన్షన్ జాబితా నుంచి తీసివేసిన 490 మందికి.. 2014 సెప్టెంబర్ నుంచి బకాయిలను కూడా చెల్లించాలని కోర్టు ఆదేశాల్లో పేర్కొంది. అందుకోసం ఒక్కో వ్యక్తికి 49 వేల రూపాయలు చెల్లించాలని తెలిపింది. మూడు వారాల్లో ఈ మొత్తాన్ని వారికి చెల్లించాల్సిందిగా ఏపీ ప్రభుత్వాన్ని ఆదేశించింది.