గో‘దారులు’ కావివి.. రహదారులే.. | Heavy Rain In East Godavari | Sakshi
Sakshi News home page

గో‘దారులు’ కావివి.. రహదారులే..

Sep 27 2018 2:03 PM | Updated on Sep 27 2018 2:03 PM

Heavy Rain In East Godavari - Sakshi

బుధవారం మధ్యాహ్నం కురిసిన భారీ వర్షానికి జలమయమైన కంబాల చెరువు కూడలి

సాక్షి, రాజమహేంద్రవరం: ఏడాదంతా నగరం పక్కన గోదారమ్మను చూస్తున్న రాజమహేంద్రవరంవాసులు వర్షం వచ్చినప్పడల్లా నగరంలోనే గోదావరిని చూస్తున్నారు. వరదల సమయంలో గోదావరి ప్రవాహాన్ని తిలకిస్తున్న ప్రజలు వరుణుడు వచ్చిన ప్రతిసారీ తమ ఇళ్ల ముందు రోడ్లపైనే గోదావరి నది ప్రవాహంలా సాగుతున్న వర్షపు నీటిని చూసి ఇదేమి నగర పాలక సంస్థంటూ మండిపడుతున్నారు. అరగంట వర్షం పడితేనే ఉభయగోదావరి జిల్లాల వాణిజ్య రాజధాని రాజమహేంద్రవరం ముంపునకు గురవుతుండడమేమిటని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్ర సాంస్కృతిక రాజధానిగా పేరుగాంచిన పురాతన నగరంలో శతాబ్ధాల నాటి డ్రైనేజీలే దిక్కు కావడంతో వర్షం వచ్చిన ప్రతిసారీ ప్రజలకు తిప్పలు తప్పడంలేదు. ప్రజావసరాలకు అనుగుణంగా డ్రైనేజీల పునర్నిర్మాణం చేపట్టకపోవడంతో నగరంలోని ముంపు ప్రాంతాలు జలమయమవుతున్నాయి.

 

వాగులను తలపిస్తున్న రహదారులు..
రాజమహేంద్రవరం నగరంలో బుధవారం ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు వేసవిని తలపించేలా భానుడు తన ప్రతాపం చూపించాడు. మధ్యాహ్నం మూడు గంటలకు ఒక్కసారి ఆకాశం మేఘావృతమై భారీ వర్షం కురిసింది. దాదాపు 45 నిమిషాలపాటు కురిసిన వర్షంతో నగరంలోని రైల్వే స్టేషన్‌ రోడ్డు, శ్యామలా సెంటర్, ఆర్యాపురం, తుమ్మలోవ, పేపర్‌మిల్లు రోడ్డులోని వీరభద్రాపురం, లలితానగర్, సీతమ్మపేట, కోరుకొండ రోడ్డులోని సుభాష్‌నగర్, మార్కెట్‌ ఏరియా వెనుక ప్రాంతం, కంబాల చెరువు ప్రాంతాలు జలమయమయ్యాయి. కంబాల చెరువు హైటెక్‌ బస్‌స్టాండ్‌ ప్రాంతంలో నడుములోతు నీరు నిలిచింది. పక్కనే ఉన్న ప్రధాన కాలువ ఉధృతంగా ప్రవహించింది. బస్‌స్టాండ్‌ ప్రయాణికులు అక్కడే చిక్కుకున్నారు. రైల్వే స్టేషన్‌ రోడ్డులో మోకాలు లోతు నీరు చేరడంతో నగరపాలక సంస్థ అధికారులు మూడు మోటార్ల ద్వారా నీటిని తోడుతున్నారు. శ్యామలా సెంటర్‌లో జలమయమైంది. పేపర్‌మిల్లు రోడ్డులోని వీరభద్రాపురం రోడ్డులో డ్రైనేజీ పొంగిపొర్లింది. పేపర్‌మిల్లు రోడ్డు నుంచి వచ్చే వర్షపు నీరు ఆదెమ్మదిబ్బ, సీతమ్మపేట ప్రాంతం వైపు ఉధృతంగా ప్రవహించింది. వర్షం తెరపిచ్చినా దాదాపు రెండుమూడు గంటల సేపు వరద నీరు ప్రవహించింది. మోకాలు లోతు నీటిలోనే వాహనదారులు, పాదచారులు ప్రయాణించేందుకు అవస్థలు పడ్డారు.

మృత్యుకుహరాలుగా మ్యాన్‌హోల్స్‌...
వర్షం పడిన ప్రతిసారీ డ్రైనేజీలు పొంగిపొర్లుతున్నాయి. నగరంలో 625 కిలోమీటర్ల మేర డ్రైనేజీ వ్యవస్థ ఉంది. ఇందులో ప్రధాన డ్రైనేజీ 14 కిలోమీటర్లు, 213 కిలోమీటర్లు మేర మూడు అడుగుల డ్రైనేజీలు ఉండగా మిగతా 398 కిలోమీటర్లు డివిజన్లలో అంతర్గత డ్రైనేజీ వ్యవస్థ ఉంది. సాధారణ నిధులతోపాటు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి వచ్చే నిధులతో ప్రతి ఏడాది కోట్ల రూపాయలతో డ్రైనేజీ ఆధునికీకరణకు నగరపాలక సంస్థ ప్రణాళికలు రచించి అమలు చేస్తోంది. అయితే నగర జనాభా పెరుగుతున్న మేరకు మౌలిక సదుపాయాలు కల్పన జరగకపోవడంతో ముంపు తప్పడంలేదు. డ్రైనేజీలు పొంగినప్పుడు ఆయా ప్రాంతాల్లోని మ్యాన్‌హోల్స్‌ మృత్యు కుహరాలుగా మారుతున్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement