
భూమి లీజు కథ కంచికే !
వేసవి విడిది కేంద్రం హార్సిలీహిల్స్లో జిల్లాకు చెందిన ఓ ప్రయివేటు సంస్థకు 3 ఎకరాల భూమిని లీజుకు ఇచ్చే కథ కంచికి ...
హార్సిలీహిల్స్లో అడ్వంచర్స్ కాంప్లెక్స్ ఏర్పాటుకు బ్రేక్
జిల్లా పర్యాటక కమిటీ సమావేశంలో కలెక్టర్ నిర్ణయం
బి.కొత్తకోట: వేసవి విడిది కేంద్రం హార్సిలీహిల్స్లో జిల్లాకు చెందిన ఓ ప్రయివేటు సంస్థకు 3 ఎకరాల భూమిని లీజుకు ఇచ్చే కథ కంచికి చేరింది. 33 ఏళ్లపాటు లీజుకు 5శాతం పన్ను చెల్లింపు ప్రాతిపదికన అప్పగించేందుకు సిద్ధమైన చర్యలను నిలిపివేస్తూ ఇటీవల కలెక్టర్ అధ్యక్షతన నిర్వహించిన జిల్లా పర్యాటక శాఖ కమిటీ సమావేశం నిర్ణయం తీసుకున్నట్టు అధికార వర్గాలు వెల్లడించాయి.చిత్తూరుకు చెందిన ఓ ప్రయివేటు సంస్థ 2005లో కొండపై సాహస విన్యాసాల ప్రాంగణ (అడ్వంచర్ కాంప్లెక్స్) నిర్వహణకు అప్పటి ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ఆ సంస్థకు మూడెకరాల భూమిని 33 ఏళ్లపాటు లీజు ప్రాతిపదికన అప్పగించేందుకు ప్రభుత్వం అంగీకారం తెలిపింది. అయితే ఈ భూమిని స్వాధీనం చేసుకునేందుకు ఆ సంస్థ తొలుత ఆసక్తి చూపలేదు.
తరువాత 2011లో అదే సంస్థ యాజమాన్యం ఆ భూమిని స్వీకరించేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టింది. అప్పటి కలెక్టర్ సాల్మన్ ఆరోగ్యరాజ్ ఈ వ్యవహారంలో ప్రభుత్వ నిర్ణయాన్ని కీలకంగా చేశారు. పలుమార్లు లేఖలు రాయడమేకాక పర్యాటకశాఖ కమిటీ సమావేశాలు నిర్వహించారు. చివరకు లీజుకు ఇచ్చే భూమి విలువ ఆధారంగా 5శాతం పన్ను ప్రభుత్వానికి చెల్లించేలా తీర్మానం చేశారు. ఈ విషయాన్ని ప్రభుత్వానికి నివేదించారు. తర్వాత ఆరోగ్యరాజ్ బదిలీ కావడంతో ఆయన స్థానంలో వచ్చిన కలెక్టర్ రాంగోపాల్ ఈ ఫైల్ను శరవేగంగా ముందుకు తీసుకొచ్చారు.
తక్షణమే భూమి అప్పగించేందుకు చర్యలు తీసుకోవాలనీ బి.కొత్తకోట తహశీల్దార్ను ఆదేశించారు. దీనిపై హర్సిలీహిల్స్లో సర్వే నంబర్ 592-1లో మూడెకరాల భూమిని గుర్తించి హద్దులు నిర్ణయించారు. ఆ భూమి విలువ ఎకరా రూ.40లక్షలుగా నిర్ణయించి నివేదించారు. ఈ విలువలో 5 శాతం విలువను ఫీజుగా ప్రయివేటు సంస్థ ప్రభుత్వానికి చెల్లించాలని నిర్ణయించారు. రెవెన్యూశాఖ ఆ భూమిని పర్యాటక శాఖకు అధికారికంగా అప్పగించింది. పర్యాటకశాఖ అధికారికంగా ప్రయివేటు సంస్థకు అప్పగించేందుకు సిద్ధమైన తరుణంలో రాష్ట్రంలో టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి రావడంతో ఈ చర్యల వేగం తగ్గింది. అధికారుల బదిలీ పరిస్థితుల అనుగుణంగా చర్యలు తీసుకునేందుకు వేచిచూశారు. ఈ పరిస్థితుల్లో కలెక్టర్గా సిద్ధార్థ్జైన్ రావడంతో భూమి అప్పగింత మరుగునపడింది.
ఇటీవల నిర్వహించిన పర్యాటకశాఖ సమావేశంలో ఈ అంశం చర్చకు వచ్చింది. అధికారులు ఈ వ్యవ హారం గురించి వివరించారు. ప్రయివేటు కార్యకలాపాలకు కొండపై అవకాశమిస్తే ఇబ్బందులు వస్తాయని భావించి లీజు భూమిని ప్రయివేటు సంస్థకు అప్పగించబోమని చెబుతూ తీర్మానం చేసినట్టు అధికార వర్గాలు వెల్లడించాయి.