తీరని అధికార దాహం!

Grama Volunteer Merit List Released After Pandemonium - Sakshi

బెదిరింపులకు పాల్పడిన బలరాం

ఎట్టకేలకు తుది జాబితా మీడియాకు విడుదల

శిక్షణ మాత్రం వాయిదా

సాక్షి, చీరాల: తాము చెప్పిందే జరగాలని టీడీపీ ఎమ్మెల్యే బలరాం, ఆపార్టీ నేతలు ప్రభుత్వ కార్యాలయాల్లో హల్‌చల్‌ చేస్తున్నారు. వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ నేతలను టార్గెట్‌ చేస్తున్నారు. ప్రతిపక్షంలో ఉన్నప్పటికీ అధికార దర్పం చూపించాలని ఉవ్విళ్లు ఊరుతున్నారు. ఇప్పటికే నియోజకవర్గంలోని ప్రభత్వ కార్యాలయాల్లో ఔట్‌సోర్సింగ్, కాంట్రాక్టు సిబ్బంది గత ప్రభుత్వ హయాంలో నియమించిన వారంతా టీడీపీ నాయకులకు వత్తాసు పలుకుతున్నారు. ఇదిలా ఉంటే ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న గ్రామ వలంటీర్ల నియామకం, శిక్షణ తరగతుల్లో టీడీపీ నేతలు, నాయకుల ప్రోద్బలంతో మంగళవారం జరగాల్సిన శిక్షణ బుధవారానికి వాయిదా వేశారు. మండల పరిషత్‌ కార్యాలయంలో పనిచేస్తున్న ఇన్‌చార్జి అధికారి టీడీపీ నేతల ఒత్తిళ్లు, సిఫార్సులకు దాసోహం అన్నట్లు వ్యవహరించడంతోనే చీరాల మండలంలో గ్రామ వలంటీర్ల వ్యవహారం గందరగోళంగా మారింది.

ప్రభుత్వం చీరాల మండలానికి కేటాయించిన 446 వలంటీర్‌లు పోస్టులకు గాను మండలంలోని 15 గ్రామ పంచాయతీల్లో 1789 మంది దరఖాస్తులు అందించారు. మండలంలో వలంటీర్‌ ఉద్యోగాలకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు గతనెల 11 నుంచి 25 వరకు ఇంటర్వ్యూలు నిర్వహించారు. వలంటీర్ల పోస్టులకు దరఖాస్తు చేసుకున్నవారిని ప్రభుత్వ నిబంధనల మేరకు ఇంటర్వ్యూలు నిర్వహించి అర్హత ఉన్నవారిని ఎంపిక చేసి ఈపాటికే ఉన్నతాధికారులకు, ప్రభుత్వానికి నివేదించారు. వలంటీర్ల ప్రక్రియ పూర్తయి మంగళవారం నుంచి శిక్షణ అందించాల్సి ఉండగా టీడీపీ నాయకులు రాద్ధాంతంతో శిక్షణను మండల పరిషత్‌ అధికారులు బుధవారానికి వాయిదా వేశారు. శిక్షణను ప్రారంభించకపోవడానికి ముఖ్య కారణం మండల« స్థాయి అధికారే అని అంతా ఆరోపిస్తున్నారు.

అర్ధరాత్రి వరకు..
గ్రామ వలంటీర్ల పోస్టుల్లో తమవారిని నియమించాలని మండల అధికారిపై టీడీపీ ఎమ్మెల్యే, అతని అనుచరులు కొందరు మండల కార్యాలయంలో తిష్టవేసుకుని హల్‌చల్‌ చేస్తున్నారు. మండలానికి ఇన్‌చార్జిగా వ్యవహరిస్తున్న ఆ అధికారి కూడా టీడీపీ నాయకులతో ములాఖత్‌ అయి వారు చెప్పిన వారినే వలంటీర్లుగా నియామకం చేయాలని వత్తాసు పలుకుతున్నారంటే ఆ అధికారులు టీడీపీ నేతల సేవలో నిమగ్నమవుతున్నారనే విమర్శలు గుప్పిస్తున్నాయి. సోమవారం ఉదయం నుంచి అనకశరాత్రి వరకు ఎంపీడీవో కార్యాలయంలో కంప్యూటర్‌ ఆపరేటర్లను మె ఆ అధికారి సాయంతో వలంటీర్ల తుదిజాబితాలో మార్పులు చేసి.. టీడీపీ నాయకులు చెప్పిన వారిని చేర్చి ఆ జాబితా ఆమోదం కోసం అధికారి జిల్లా కేంద్రానికి వెళ్లాడనే ప్రచారం జరుగుతోంది. జాబితాలను మార్చాలని మంతనాలు చేయడంతో ఎంపికైన అభ్యర్థులు ఆందోళన చెందుతున్నారు. కనీసం వలంటీర్లుగా ఉద్యోగం చేసుకోబోతున్న తరుణంలో టీడీపీ నాయకులు చేస్తున్న రాజకీయంతో తాము ఇబ్బందులు పడుతావేమోనని ఆందోళన చెందుతున్నారు.

ప్రభుత్వానికి.. ప్రజలకు మధ్య వారధులే వలంటీర్లు
చీరాల: ప్రభుత్వానికి, ప్రజలకు మధ్య వలంటీర్లు వారధులుగా పనిచేయాలని మున్సిపల్‌ కమిషనర్‌ కె.రామచంద్రారెడ్డి అన్నారు. పట్టణంలోని 33 వార్డులకు సంబంధించిన వలంటీర్లుకు శిక్షణ కార్యక్రమాన్ని మంగళవారం పేరాలలోని ఆంధ్రరత్న మున్సిపల్‌ హైస్కూల్‌లో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వార్డుల్లో పేదలకు ప్రభుత్వ పథకాలను అందించేందుకు వలంటీర్లు కృషి చేయాలన్నారు. ప్రతి ఇంటికి వెళ్లి వారికి ఏమి కావాలో తెలుసుకుని వారికి ప్రభుత్వం నుంచి వచ్చే సంక్షేమ పథకాలను అందేలా చూడాలన్నారు. నిరుద్యోగులకు ఉపాధి కల్పిస్తూ ప్రభుత్వ కార్యక్రమాల్లో పాలుపంచుకునే విధంగా వలంటీర్ల వ్యవస్థను ఏర్పాటు చేశామన్నారు. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించిన నవరత్నాల పథకాలను అమలు చేయాల్సిన బాధ్యత వలంటీర్లపై ఉందన్నారు. వలంటీర్‌ ప్రభుత్వ సంక్షేమ పథకాలపై అవగాహన కలిగి ఉండాలని, ప్రభుత్వ సంక్షేమ పథకాలకు  వలంటీర్‌ ప్రభుత్వ నిబంధనల మేరకు నడుచుకోవాలన్నారు.

తొలి నుంచి టీడీపీకి నమ్మినబంటే..?
చీరాల మండల పరిషత్‌ కార్యాలయంలో ఇన్‌చార్జి అధికారిగా విధులు నిర్వహిస్తున్న అధికారి టీడీపీ నాయకులంటే ఆది నుంచి వల్లమాలిన అభిమానం. మండల స్థాయి టీడీపీ నేతలు వచ్చి ఏ పని అడిగినా తక్షణమే చేసి తన భక్తిని చాటుకుంటుండాడు ఆ అధికారి. గత మండల పరిషత్‌ పాలకవర్గంలో పనిచేసిన సభ్యుల్లో టీడీపీకి చెందిన వారికే అధికంగా నిధుల కేటాయింపులు, పనులు చేస్తుండేవాడనే పేరుంది. కానీ వైఎస్సార్‌ సీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా టీడీపీ నాయకుల సేవలో ఆ అధికారి తలమునకలవ్వడం పట్ల కార్యాలయం ఉద్యోగులు, సిబ్బంది కూడా విస్మయం చెందుతున్నారు. టీడీపీ నాయకులను దగ్గర కూర్చోబెట్టుకుని మరీ గతంలో రుణాలు, పథకాలు అందించిన ఆ అధికారి ప్రస్తుతం వలంటీర్ల జాబితాను కూడా టీడీపీ నాయకులన దగ్గర ఉంచుకుని వారు సూచించిన వారినే వలంటీర్లుగా జాబితాలో నిక్షిప్తం చేశాడంటే ఆయన తీరు అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. ఆ అధికారిని చీరాల నుంచి పంపించి వివక్షత లేకుండా పథకాలు అందించే అధికారిని నియమించాలని గ్రామాల ప్రజలు ప్రభుత్వాన్ని కోరుతున్నారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top