ప్రమోషన్‌ టైమ్‌.. | Govt School Teachers Promotions In AP | Sakshi
Sakshi News home page

ప్రమోషన్‌ టైమ్‌..

Jun 25 2019 10:29 AM | Updated on Jun 25 2019 10:30 AM

Govt School Teachers Promotions In AP  - Sakshi

సాక్షి, శ్రీకాకుళం : పదోన్నతుల కోసం మూడేళ్లుగా ఎదురుచూస్తున్న ఉపాధ్యాయులకు ప్రభుత్వం తీపి కబురు అందించింది. విద్యాశాఖామాత్యులుగా ఆదిమూలపు సురేష్‌ బాధ్యతలు స్వీకరించిన వెంటనే పదోన్నతుల ఫైల్‌పైనే తొలి సంతకం చేశారు. ఈ ఉత్తర్వులు సోమవారం జిల్లా విద్యాశాఖకు అందాయి. దీంతో విద్యాశాఖ అధికారులు ఆఘమేఘాలపై సీనియారిటీ జాబితాలను సిద్ధం చేశారు. జిల్లాలో 440 హెచ్‌ఎం, స్కూల్‌ అసిస్టెంట్‌ పోస్టులు ఖాళీగా ఉన్నట్లు గుర్తించారు. జిల్లా పరిషత్, ప్రభుత్వ యాజమాన్యాల్లో ఈ ఖాళీలు ఉన్నాయి. 400 పోస్టులు జెడ్పీ, 40 ప్రభుత్వ యాజమాన్యం కేటగిరీల్లో ఉన్నాయి. సబ్జెక్టు వారీగా చూస్తే 59 గ్రేడ్‌ –2 హెచ్‌ఎం పోస్టులు జిల్లా పరిషత్‌ పాఠశాలలోనూ, 8 పోస్టులు ప్రభుత్వ పాఠశాలలో, 113 పోస్టులు ఎల్‌ఎఫ్‌ఎల్‌ ప్రధానోపాధ్యాయ పోస్టులు జిల్లా పరిషత్‌ పాఠశాలల్లో, 8 పోస్టులు ప్రభుత్వ పాఠశాలల్లో ఖాళీగా ఉన్నాయి. 

స్కూల్‌ అసిస్టెంట్‌ పోస్టుల విషయానికి వస్తే ఇంగ్లీష్‌ సబ్జెక్టులో–11, గణితం– 14, పీ ఎస్‌– 5, బయోలాజికల్‌ పోస్టులు– 17, ఎస్‌ ఎస్‌– 101, స్కూల్‌ అసిస్టెంట్‌ తెలుగు– 41, హిందీ –17, ఒరియా– 3 , పీడీ– 19 పోస్టులు జెడ్పీలో పదోన్నతులపై భర్తీకి ఖాళీలు ఉన్నాయి. ప్రభుత్వ యాజమాన్యంలో గణితం 2, పీఎస్‌–1, ఎస్‌ఎస్‌–6, తెలుగు –4, హిందీ–4, ఒరియా–2, పీడీ పోస్టులు 5 పదోన్నతులతో భర్తీ కానున్నాయి.దాదాపు మూడున్నరేళ్లుగా ప్రభుత్వ ఉపాధ్యాయులు ఈ ప్రమోషన్ల కోసం ఎదురుచూస్తున్నారు. గత ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా ఇది సాధ్యం కాలేదు.

ఉమ్మడి సర్వీస్‌ రూల్‌ను సాకుగా చూపించి తాత్సారం చేశారు. ఇది వరలా అడ్‌హక్‌ రూల్స్‌ రూపొందించి పదోన్నతులు కల్పించాలని ఉపాధ్యాయ సంఘాలు డిమాండ్‌ చేసినా అరణ్య రోదనగానే మిగిలింది. ఈ పోస్టులు భర్తీ కాకపోవడం వల్ల ఉన్నత, ప్రాథమికోన్నత పాఠశాలల్లో సబ్జెక్టు టీచర్ల కొరత ఏర్పడింది. ప్రస్తుతం ఈ పోస్టులు పదోన్నతుల ద్వారా భర్తీ అయితే అర్హత గల ఉపాధ్యాయులకు న్యాయం జరగటంతోపాటు, సబ్జెక్టు టీచర్ల కొరత కూడా తీరుతుంది. పదోన్నతులకు నోచుకోక వందలాది మంది ఉపాధ్యాయులు గత మూడున్నరేళ్లలో పదవీ వరమణ పొందారు.

వెబ్‌సైట్‌లో సీనియర్ల జాబితా
పదోన్నతులకు సంబంధించి రాష్ట్ర స్థాయిలో ఉత్తర్వులు వెలువడ్డాయి. సీనియారిటీ జాబితాను వెబ్‌సైట్‌లో పొందుపరిచాం. ఎలాంటి అభ్యంతరాలు ఉన్నా ఈ నెల 27 తేదీలోగా అప్పీల్‌ చేసుకోవాలి. త్వరలో పదోన్నతుల షెడ్యూల్‌ విడుదల చేస్తాం.
– ఎం.సాయిరాం, జిల్లా విద్యాశాఖ అధికారి

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement