రాష్ట్రాన్ని సింగపూర్లా మార్చడానికి ముందు భవన నిర్మాణానికి అవసరమయ్యే ఇసుక ఇవ్వాలని భవన నిర్మాణ కార్మిక సంఘం జిల్లా నాయకులు కోరారు.
భవన నిర్మాణ కార్మికుల సంఘం డిమాండ్
నరసాపురం : రాష్ట్రాన్ని సింగపూర్లా మార్చడానికి ముందు భవన నిర్మాణానికి అవసరమయ్యే ఇసుక ఇవ్వాలని భవన నిర్మాణ కార్మిక సంఘం జిల్లా నాయకులు కోరారు. పట్టణంలో భవన నిర్మాణ కార్మికుల సంఘం ఆధ్వర్యంలో ఆరు రోజులుగా నిర్వహిస్తున్న రిలే దీక్షలకు జిల్లా సంఘ నాయకులు మంగళవారం మద్దతు పలికారు. జిల్లా నలుమూలల నుంచి భవన నిర్మాణ కార్మికులు దీక్షా శిభిరం వద్దకు తరలివచ్చారు. జిల్లా నాయకుడు మేడిది జేమ్స్ మాట్లాడుతూ రాష్ట్రాన్ని సింగపూర్గా మారుస్తానంటున్న ముఖ్యమంత్రి ఇసుక లేకుండా చేస్తున్నారని విమర్శించారు.
రాష్ట్రాన్ని సింగపూర్గా మార్చాలన్నా ఇసుక కావాలని గుర్తుచేశారు. ఇసుక సరఫరా చేసి జీవనాధారం కల్పించాలని కోరారు. ప్రభుత్వం మొద్దునిద్రలో ఉందని, నిద్రలేచి కార్మికులను ఆదుకోవాలని ఎద్దేవ చేశారు. మరో నాయకుడు పాలూరి లక్ష్మణరావు మాట్లాడుతూ భవన నిర్మాణ కార్మికులపై ముఖ్యమంత్రి కక్షకట్టినట్ట్లగా వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయన పరిపాలనలో కార్మికులు పస్తులుండాల్సిన దౌర్భాగ్యం ఏర్పడిందని ఆవేదన చెందారు. గతంలో ఎన్నడూ లేనివిధంగా ఇసుక సరఫరాను నిలిపివేశారని మండిపడ్డారు. సీఐటీయూ డివిజన్ కార్యదర్శి తెలగంశెట్టి సత్యనారాయణ, పట్టణ సంఘ నాయకులు పిండి ఆదినారాయణ, సుంకర ఆదినారాయణ, ఉంగరాల కృష్ణమూర్తి మాట్లాడారు.