జన్మభూమిలో రాక్షస మూకలు

Giant Mounds In Janmabhumi - Sakshi

రాజ్యాంగ స్ఫూర్తిని నడివీధిలో నిలబెట్టి హత్య చేశారు. ప్రజాస్వామ్యం అనే పదాన్ని జనం సాక్షిగా వెక్కిరించారు. సంక్షేమం ప్రజలకు అందకుండా సొంత మనుషులతో అడ్డుగోడ కట్టారు. ఆ గోడకు జన్మభూమి కమిటీ అని పేరు పెట్టారు. అసలు ఈ కమిటీకి ఉన్న అధికారం ఏమిటి..? జనాల అర్హతను నిర్ణయించే హక్కు వీరికి ఎవరు ఇచ్చారు..? జనం డబ్బు జనానికి చేరడంపై వీరి పెత్తనం ఏమిటి..? ఈ ప్రశ్నలకు రాష్ట్రంలో జవాబు కరువైంది. ఒకప్పుడు రహస్యంగా పనిచేసిన రాజకీయ రాక్షస మూకలకు కమిటీలని పేరు పెట్టి సాక్షాత్తు ప్రభుత్వమే జనంపైకి వదిలింది. అప్రజాస్వామ్యమని తెలిసినా సంక్షేమ పథకాల చేరికలో సర్వ హక్కులూ వారికే అప్పగించింది. ఫలితంగా ప్రజలు ఓటేసి గెలిపించిన సర్పంచ్‌లు, పరీక్షలు పాసై ప్రభుత్వ బాధ్యతలు నిర్వర్తిస్తున్న అధికారులు ఉత్సవ విగ్రహాలైపోయారు. నెత్తినెక్కి అధికారం చెలాయిస్తున్న కమిటీ సభ్యులను ప్రశ్నించలేక జనం బాధితులుగా మిగిలిపోయారు.  

సాక్షి నెట్‌వర్క్, శ్రీకాకుళం:
పరిహారం.. పరిహాసం

చిత్రంలో కనిపిస్తున్న వ్యక్తి పేరు బొడ్డు సింహాద్రి. పలాస మండలం బొడ్డపాడు గ్రామానికి చెందిన రైతు. తిత్లీ తుఫాన్‌లో సింహాద్రికి చెందిన నాలుగు ఎకరాల తొంభై సెంట్లలో జీడి, కొబ్బరి తోటలు ధ్వంసమయ్యా యి. ఆ మేరకు అధికారులకు ఆధారాలు చూపించారు. వారు కూడా జియో ట్యాగింగ్‌ అంటూ రాసుకుని వెళ్లా రు. పరిహారం జాబితా చూసేసరికి మూడెకరాల డబ్బై ఎనిమిది సెంట్లలోనే పంట నష్టపోయినట్టు వచ్చింది. నష్ట పరిహారం కూడా కేవలం రూ.15వేలు వచ్చింది. సాక్షాత్తు ముఖ్యమంత్రే సింహాద్రికి రూ.60వేల చెక్‌ అందించారు. కానీ బ్యాంక్‌ అధికారులు మాత్రం రూ.15వేలే ఇచ్చారు. ఈ తగ్గింపు వెనుక జన్మభూమి కమిటీ సభ్యులు ఉన్నారన్నది సింహాద్రి ప్రధాన ఆరోపణ. తనలాంటి వారిని మోసం చేసి వేల కొద్దీ డబ్బు దండుకున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చెక్‌లో ఒకలా పరిహారం చూపించి, ఖాతాలో మరోలా పరిహారం ఎందుకు వేశారో అర్థం కావడం లేదని, కేవలం ప్రచారం యావ, జన్మభూమి కమిటీ సభ్యులను పోషించడం కోసమే ఇలా దగా చేశారని మండిపడుతున్నారు.

చావులోనూ..

ఇక్కడ కనిపిస్తున్న వ్యక్తి పేరు బోర గోపాలు. ఇచ్ఛాపురం మున్సిపాలిటీ కార్జివీధిలో నివా సం ఉంటారు. ఈయన భార్య బోర సీతమ్మ(38) గత ఏడాది జూన్‌ 8న మృతి చెందారు. అప్పటికే బీమా కోసం ప్రీమియం చెల్లించి పేరు నమోదు చేసుకుని ఉండడంతో తక్షణ సాయం కింద రూ.5వేలు అందించారు. అలాగే బీమా నియమాల ప్రకారం ఈయనకు ఎస్‌ఆర్‌ఐ118785331 నంబర్‌ గల రూ.2 లక్షల పాలసీ ధ్రువీకరణ పత్రం కూ డా అందజేశారు. వీరిది చాలా పేద కుటుంబం. చిన్న పాన్‌షాప్‌ పెట్టుకుని కుటుంబాన్ని నడిపిస్తున్నారు. ఈ రూ.2 లక్షలు చేతికి వస్తే కుటుంబ పరిస్థితి కాసింతైనా∙మెరుగుపడుతుందదని గోపాలు ఆశించారు. కానీ ఆ ఆశలపై జన్మభూమి కమిటీ సభ్యులు నీళ్లు చల్లారు. సాయంలో తమ వాటా తమకు ఇవ్వాలని పట్టుబట్టారు. గోపాలు కట్టిన ప్రీమియం వల్లనే బీమా డబ్బులు వచ్చినా, అన్యాయంగా అందులో వాటా అడిగారు. ఇవ్వనని చెప్పినందుకు పది నెలలుగా ఆ సాయం అందకుండా అడ్డుపడుతున్నారు. సాయం అందకపోవడం వల్ల అప్పులు తీర్చలేకపోతున్నానని, తనలాంటి వారిపై ఇలా ప్రతాపం చూపడం తగదని ఆయన అంటున్నారు. 

గూడు చెదిరినా.. గుండె కరగలేదు..


ఈ చిత్రంలో కనిపిస్తున్న వృద్ధురాలి పేరు సావిత్రి సాహు. కవిటి మండలం మాణిక్యపురానికి చెందిన ఈమె ఇల్లు తిత్లీ తుఫాన్‌లో ధ్వంసమైపోయింది. అందరిలానే అధికారుల వద్దకు గ్రామంలో తుఫాన్‌ తర్వాత జరిగిన సర్వే చేసినప్పుడు ఆధార్‌ కార్డు, రేషన్‌ కార్డు, బ్యాంక్‌ ఖాతా నంబర్‌ ఇచ్చి పరిహారం కోసం పేరు నమోదు చేసుకున్నారు. తుఫాన్‌కు పడిపోయిన చెట్ల స్థానంలో చిగుళ్లు కూడా వచ్చాయి. కానీ ఈమెకు మాత్రం నష్ట పరి హారం రాలేదు. ఊరిలో ఉన్న పెద్దలందరి వద్దకూ కాళ్లు అరిగేలా తిరిగారు. ఎవ్వరూ సాయం చేయలేదు. ఓ యువకుడు చొరవ తీసుకుని నష్ట పరి హారాల జాబితా కోసం ఆన్‌లైన్‌లో వెతికాడు. ఆ జాబితాలో సావిత్రి పేరు లేదు. తుఫాన్‌కు దారుణంగా నష్టపోతే తన పేరు జాబితాలో లేకపోవడమేంటని సావిత్రి లబోదిబోమన్నారు. తీరా చూస్తే అది జన్మభూమి కమిటీ సభ్యుల నిర్వాకం. ప్రతి పల్లెలోనూ ప్రతి పథకంలోనూ వీరి జోక్యం మితి     మీరిన విషయం అందరికీ తెలిసిందే. పరిహారం పొందడానికి సావిత్రికి అన్ని అర్హతలు ఉన్నా కేవలం ఈ కమిటీ సభ్యుల అనుమతి లేకపోవడం వల్ల ఆమె సాయం అందుకోలేకపోయారు. సొంతవారంతా వలస వెళ్లిపోగా ఒం టరిగా మిగిలిన తనపై ఇంత కక్ష ఎందుకు పెంచుకున్నారో అర్థం కావడం లేదని, వృద్ధురాలినని కూడా చూడకుండా సాయానికి దూరం చేయడం సబబు కాదని ఆమె ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.  

దారుణాలు


ఈయన పేరు నీలాపు లింగరాజు. సంతబొమ్మాళి మండలం నౌపడ గ్రామానికి చెందిన యువకుడు. చిన్నపాటి టిఫిన్‌ దుకాణం పెట్టుకుని కుటుంబాన్ని పోషిస్తున్నారు. వ్యాపారాన్ని కొద్దిగానైనా అభివృద్ధి చేయాలని బీసీ కార్పొరేషన్‌ రుణం కోసం దరఖాస్తు చేసుకున్నారు. బ్యాంకు కూడా అన్ని అర్హతలు చూసి లింగరాజు రుణం పొందడానికి అర్హుడేనని నిర్ధారించింది. కానీ ఈ రుణం పొందాలంటే బ్యాంకుల కంటే జన్మభూమి కమిటీ సభ్యుల సంతకం అత్యంత ప్రధానం. ఇది అందరికీ తెలిసిన రహస్యం. లింగరాజు ఎంత బతిమలాడినా ఆ కమిటీ సభ్యులు సంతకం పెట్టలేదు. తమ వారికి రుణం ఇప్పించడానికి లింగరాజును దారుణంగా తొక్కేశారు. ఎంత ప్రాధేయపడినా ఆ కమిటీ సభ్యులు వినిపించుకోలేదని, కేవలం ఈ అప్రజాస్వామిక కమిటీ వల్లే తనకు రుణం రాకుండాపోయిందని లింగరాజు ఇప్పటికీ బాధ పడుతున్నారు. 

నిర్దాక్షిణ్యంగా..


ఈమె పేరు గుజ్జల చిన్నప్పమ్మ. గార మండలం ఆడవరం గ్రామం, అంపోలు పంచాయతీ. భర్త యల్లయ్య మరణించి దాదాపు రెండేళ్లయ్యింది. ఆధార్‌ ఆధారంగా పింఛను ఇస్తున్నారు. ఇప్పటికే వయసు 71 ఏళ్లు కావచ్చింది. దీనికితోడు భర్త మరణం ఆ కుటుంబాన్ని ఆర్థికంగా దెబ్బతీసింది. ఇదిలా ఉంచితే వైఎస్సార్‌ సీపీ అన్నా, దివంగత ముఖ్యమంత్రి రాజశేఖరరెడ్డి అన్నా ఇష్టమని ఈ వృద్ధురాలు గ్రామంలో చెబుతూ ఉంటుంది. అదే ఆమె చేసిన తప్పైపోయింది. అన్ని అర్హతలు ఉన్నా జన్మభూమి కమిటీ సభ్యులు ఆమె పింఛన్‌ను నిర్దాక్షిణ్యంగా నిలిపివేశారు. పింఛను కావాలని పలుమార్లు అధికారులు, టీడీపీ నాయకులను కలుస్తున్నా ప్రయోజనం లేకపోయింది. అర్హతలు ఉన్నాయని అధికారులకు తెలిసినా జన్మభూమి కమిటీలను కాదని వారేమీ చేయలేకపోతున్నారు. తాను తనువు చాలించేలోగా అయినా పింఛను ఇవ్వండని అధికారులను వేడుకుంటోంది.
 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top