అక్రమంగా పట్టాదారు పాస్ పుస్తకాలు జారీచేసిన వీఆర్వో, సహకరించిన రెవెన్యూ సిబ్బందిపై క్రిమినల్ కేసు పెట్టాలని సబ్ కలెక్టర్ కేవీఎన్ చక్రధర్బాబు రెడ్డిగూడెం తహశీల్దార్ ఎం.పద్మకుమారిని ఆదేశించారు.
నూజివీడు : అక్రమంగా పట్టాదారు పాస్ పుస్తకాలు జారీచేసిన వీఆర్వో, సహకరించిన రెవెన్యూ సిబ్బందిపై క్రిమినల్ కేసు పెట్టాలని సబ్ కలెక్టర్ కేవీఎన్ చక్రధర్బాబు రెడ్డిగూడెం తహశీల్దార్ ఎం.పద్మకుమారిని ఆదేశించారు. క్రిమినల్ కేసు పెట్టిన తర్వాత ఎఫ్ఐఆర్ కాపీని తన కార్యాలయానికి పంపాలని సూచించారు. నూజివీడుకు చెందిన పత్తిపాటి మున్నీ ఉపాధి హామీ పథకం చాట్రాయి ఏపీవోగా పనిచేస్తున్నారు. రెండు నెలల క్రితం వరకు ఆమె రెడ్డిగూడెంలో పనిచేశారు.
మున్నీకి రెడ్డిగూడెం మండలం అన్నేరావుపేటలోని సర్వే నంబరు 290లో నాలుగు ఎకరాల పొలం ఉంది. పాస్ పుస్తకం, టైటిల్ డీడ్ కూడా ఆమె పేరునే ఉన్నాయి. ఇదే భూమికి సంబంధించి వీఆర్వో గతంలో అన్నేరావుపేటకే చెందిన నక్కబోయిన జమలయ్య అనే వ్యక్తి పేరు మీద పాస్ పుస్తకం జారీ చేయడంతోపాటు అడంగల్లో పేరు మార్చారు.
ఈ విషయం ఇటీవల వెలుగుచూడటంతో మున్నీ రెడ్డిగూడెం తహశీల్దారుకు ఫిర్యాదు చేశారు. ఈ వ్యవహారంపై గత రెండు రోజులుగా ‘సాక్షి’ దినపత్రికలో కథనాలు రావడంతోపాటు అటవీ భూములకు కూడా పాస్ పుస్తకాలు ఇచ్చారనే వార్తలు వస్తుండటంతో సబ్ కలెక్టర్ దృష్టిసారించారు. అక్రమాలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని తహశీల్దార్ను ఆదేశించారు.
వెలుగుచూసింది ఇలా....
లంచం ఇచ్చి అక్రమంగా వీఆర్వో ద్వారా నాలుగు ఎకరాలకు పాస్ పుస్తకాలు పొందిన జమలయ్య ఏడాది కిందట రెడ్డిగూడెంలో బంగారు తాకట్టు వ్యాపారం చేసే ఒక వ్యక్తికి ఈ భూమిని తనఖా రిజిస్ట్రేషన్ చేసి రూ.5లక్షలు అప్పు తీసుకున్నాడు. అప్పు చెల్లించాలని వ్యాపారి కోరడంతో భూముల ధరలు పెరిగినందున మరో రూ.20లక్షలు ఇస్తే పూర్తిగా రిజిస్ట్రేషన్ చేస్తానని జమలయ్య బేరానికి పెట్టాడు. దీంతో ఆ వ్యాపారి రిజిస్ట్రార్ కార్యాలయానికి వెళ్లి ఈసీ తీసుకున్నారు. తహశీల్దారు కార్యాలయానికి వెళ్లి ఆ భూమి గురించి ఆరా తీయగా రికార్డుల్లో వేరే పేరు ఉంది. దీంతో తాను ఇచ్చిన మొత్తాన్ని చెల్లించాలని జమలయ్యపై వ్యాపారి ఒత్తిడి తీసుకురావడంతో విషయం బయటపడింది. భూయజమాని మున్నీకి తెలియడంతో ఆమె రెడ్డిగూడెం తహశీల్దార్కు ఫిర్యాదు చేశారు.