గ్రామీణ భారత చరిత్రలో కొత్త అధ్యాయం
సాక్షి, న్యూఢిల్లీ: దేశంలో అమలవుతున్న గ్రామీణ ఉపాధి పథకం రూపురేఖలు మారనున్నాయి ప్రస్తుతం అమల్లో ఉన్న మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం (నరేగా) స్థానంలో ‘వికసిత్ భారత్–గ్యారంటీ ఫర్ రోజ్గార్ అండ్ అజీవికా మిషన్ (గ్రామీణ)’(వీబీ జీ రామ్ జీ) చట్టం జూలై 1 నుంచి దేశవ్యాప్తంగా అమల్లోకి రానుంది. ఈ మేరకు కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ సోమవారం గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసింది.
నేరుగా ఖాతాల్లోకి వేతనాలు
వీబీ జీ రామ్ జీ చట్టం ప్రకారం గ్రామీణ ప్రాంతాల్లోని ప్రతి కుటుంబానికి ఏడాదికి 125 రోజులపాటు ఉపాధి కల్పించనున్నారు. ప్రస్తుతం ఉన్న 100 రోజుల ఉపాధి దినాల సంఖ్య మరో 25 రోజులకు పెరగనుంది. పని కోరిన వారికి నిరీ్ణత సమయంలో ఉపాధి కల్పించాల్సి ఉంటుంది. పని ఇవ్వకపోతే నిరుద్యోగ భృతి చెల్లించాల్సి ఉంటుందని చట్టం చెబుతోంది.
కూలీల వేతనాలను ప్రత్యక్ష నగదు బదిలీ ద్వారా నేరుగా బ్యాంకు, పోస్టాఫీస్ ఖాతాల్లో జమ చేస్తారు. మస్టర్ రోల్ ముగిసిన 15 రోజుల్లోపు వేతనాలు చెల్లించాలి. ఆలస్యమైతే అందుకు పరిహారం సైతం ఇవ్వాల్సి ఉంటుంది. ఇప్పటికే జీ రామ్ జీ కోసం 2026–27 ఆర్థిక సంవత్సరంలో కేంద్ర ప్రభుత్వం రూ.95,692.31 కోట్లను కేటాయించింది. గ్రామీణ ఉపాధి పథకాల చరిత్రలో ఇదే అత్యధిక బడ్జెట్ కేటాయింపు అని ప్రభుత్వం పేర్కొంది. రాష్ట్రాల వాటా కలిపి మొత్తం వ్యయం రూ.1.51 లక్షల కోట్లకు మించనుందని వివరణ ఇచ్చింది.
పాత పనులకు ఆటంకం లేదు
ఇప్పటికే చేపట్టిన నరేగా పనులు వచ్చే నెల జూన్ 30వ తేదీ వరకు యథావిధిగా కొనసాగుతాయని కేంద్రం స్పష్టం చేసింది. ప్రస్తుతం కొనసాగుతున్న పనులను కొత్త చట్టంలోకి మార్చనున్నారు. కార్మికులకు ఉపాధి, వేతనాల విషయంలో ఎలాంటి అంతరాయం ఉండదని కేంద్రం వివరణ ఇచ్చింది. ఇప్పటికే ఉన్న ఈ–కేవైసీ ధ్రువీకరించిన నరేగా జాబ్ కార్డులు కొత్త పథకంలో కూడా కొనసాగుతాయి. కొత్త గ్రామీణ రోజ్గార్ గ్యారంటీ కార్డులు జారీ చేసే వరకు వీటిని ఉపయోగించుకోవచ్చు. ఈ–కేవైసీ పెండింగ్లో ఉన్న కారణంగా ఎవరినీ ఉపాధి నుంచి నిరాకరించబోమని తెలిపింది.


