అనంతపురం జిల్లా కదిరి వేరుశనగ పరిశోధన స్థానంలో కనుగొన్న వేరుశనగ రకాలకు దేశవ్యాప్తంగా డిమాండ్ ఉందని ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం పరిశోధన సంచాలకులు రాజారెడ్డి అన్నారు.
ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వ విద్యాలయం పరిశోధన సంచాలకులు
కదిరి: అనంతపురం జిల్లా కదిరి వేరుశనగ పరిశోధన స్థానంలో కనుగొన్న వేరుశనగ రకాలకు దేశవ్యాప్తంగా డిమాండ్ ఉందని ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం పరిశోధన సంచాలకులు రాజారెడ్డి అన్నారు. ఇక్కడి వేరుశనగ రకాలు బెట్టను తట్టుకోవడంతో పాటు అధిక దిగుబడులు ఇస్తాయన్నారు. 60 రోజులు వర్షం రాకపోయినా ఇవి తట్టుకోగలవని తెలిపారు. సోమవారం ఆయన కదిరి పరిశోధన కేంద్రాన్ని సందర్శించిన అనంతరం మీడియాతో మాట్లాడారు. ఇక్కడి వేరుశనగ రకాలను రాష్ట్రంలోని 13 జిల్లాలతో పాటు ఇతర రాష్ట్రాలకు కూడా సరఫరా చేయాలని నిర్ణయించినట్టు తెలిపారు. అందుకు విత్తనోత్పత్తిపై దృష్టి సారించామని, ఇందుకోసం ఎన్పీ కుంట మండలంలో ప్రభుత్వం 400 ఎకరాల భూమిని కేటాయించిందని చెప్పారు.
అందులో ఇప్పటికే 80 ఎకరాల్లో వేరుశనగ సాగు చేశామని, మిగిలిన భూమిని చదును చేసే పనిలో ఉన్నట్లు వెల్లడించారు. ఇందుకోసం కృషి విజ్ఞాన కేంద్రం ద్వారా రూ.60 లక్షలు మంజూరు అయిందని, నాబార్డు ద్వారా మరో రూ. కోటి మంజూరుకు ప్రయత్నిస్తామన్నారు. వేరుశనగ ద్వారా తయారు చేసే తిను బండారాలకు కూడా ఇటీవల మంచి డిమాండ్ ఉందని, మహిళా సంఘాలకు వీటి తయారీలో శిక్షణ ఇప్పించి, కుటీర పరిశ్రమల స్థాపనకు వారికి తగిన ప్రోత్సాహకాలు ఇచ్చేలా కృషి చేస్తామన్నారు. అదే విధంగా 8 లక్షల హెక్టార్లకు పైగా వేరుశనగ సాగు చేసే జిల్లా ఒక్క అనంతపురమేనని, అందుకే వ్యవసాయానికి అనుబంధంగా ఉన్న పలు కళాశాలల స్థాపన ఈ జిల్లాలోనే జరిగితే బాగుంటుందన్నారు. కార్యక్రమంలో స్థానిక వ్యవసాయ ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ కేఎస్ఎస్ నాయక్, శాస్త్రవేత్తలు డాక్టర్ రాజాప్రసన్న, డాక్టర్. వేమన, డాక్టర్.చండ్రాయుడు, డాక్టర్.ప్రత్యూష పాల్గొన్నారు.