ప్రభుత్వ ఉచిత ఇసుక పాలసీని ప్రకటించినా.. విధివిధానాలు ఖరారు చేయకపోవడంతో పోలీసులు పట్టుకున్న ఇసుక లారీలను విడిచి పెట్టాలా?
ఆమదాలవలస రూరల్: ప్రభుత్వ ఉచిత ఇసుక పాలసీని ప్రకటించినా.. విధివిధానాలు ఖరారు చేయకపోవడంతో పోలీసులు పట్టుకున్న ఇసుక లారీలను విడిచి పెట్టాలా? ఫైన్ వేయాలా? అన్న మీమాంసలో రెవెన్యూ అధికారులు తలలు పట్టుకుంటున్నారు. మండలంలోని ముద్దాడపేట నాగావళి నదీతీరం అనధికార ఇసుక ర్యాంపుపై శనివారం అర్ధరాత్రి పోలీసులు దాడులు చేసి ఏడు లారీలు, ఒక పొక్లెయిన్ను పట్టుకున్న సంగతి తెలిసిందే.
వాటిని సోమవారం మండల తహశీల్దార్ కార్యాలయానికి అప్పగించడంతో వారు ఏం చేయాలో తెలియని స్థితిలో పడ్డారు. ఉచిత ఇసుక విధానం ప్రభుత్వం అందుబాటులోకి తీసుకురావడంతో అక్రమంగా నిర్వహిస్తున్న ఇసుక రవాణాపై విధివిధానాలపై ప్రభుత్వం ఎలాంటి జీవో విడుదల చేయకపోవడంతో అధికారులకు పెద్ద సవాల్గా మారింది. ప్రభుత్వం నిర్ణయించిన ఇసుక ర్యాంపుల వద్దనే ఉచిత ఇసుక తీసుకుపోవాలని, యంత్రాల ద్వారా ఇసుక లోడింగ్ చేయరాదని ఈ నిబంధనలను అతిక్రమిస్తే చర్యలు తీసుకోవాలని ఆదేశాలు వచ్చాయి.
కానీ వాహనాలను సీజ్ చేస్తే వాటికి ఎవరూ అపరాధ రుసుం విధించాలో ఆదేశాల్లో పేర్కొనకపోవడంతో రెవెన్యూ అధికారులు మల్లగుల్లాలు పడుతున్నారు. పట్టుకున్న లారీలను విడిచి పెట్టాలా.. లేక ఫైన్ వేయాలా అన్న సందేహంతో జిల్లా అధికారులతో సంప్రదింపులు కూడా చేస్తున్నారు. మరోవైపు లారీలను విడుదల చేయాలని అధికార పార్టీకి చెందిన నాయకుల నుంచి ఒత్తిళ్లు కూడా త్రీవతరమవుతున్నాయి. లారీలకు ఫైన్ వేస్తే ఏ శాఖ తరఫున చలానా తీయాలో తెలియక అధికారులు తికమకపడుతున్నారు. ఉచిత ఇసుక విధానం సామాన్యులకు కొంత ఊరట కల్పించినా ప్రస్తుతానికి అధికారులకు పెద్ద సమస్యలు తెచ్చిపెడుతున్నాయి.