సీమాంధ్ర పెట్టుబడిదారులు కృత్రిమ ఉద్యమాన్ని సృష్టించి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును అడ్డుకునేందుకు కుట్ర పన్నుతున్నారని కేంద్ర మాజీ మంత్రి సీహెచ్ విద్యాసాగర్రావు ఆరోపించారు.
కరీంనగర్, న్యూస్లైన్: సీమాంధ్ర పెట్టుబడిదారులు కృత్రిమ ఉద్యమాన్ని సృష్టించి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును అడ్డుకునేందుకు కుట్ర పన్నుతున్నారని కేంద్ర మాజీ మంత్రి సీహెచ్ విద్యాసాగర్రావు ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వం వెంటనే జోక్యం చేసుకుని సమస్య పరిష్కరించాలని డిమాండ్ చేశారు. కరీంనగర్ జిల్లా కేంద్రంలో ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడారు.
రాష్ట్రంలో పాలన గాడి తప్పిందని, వెంటనే రాష్ట్రపతి పాలన విధించాలని డిమాండ్ చేశారు. ప్రజా సమస్యలు పట్టించుకోవడం లేదన్నారు. తెలంగాణలో వేలాది మంది ఆత్మబలిదానాలు చేశారని, తొమ్మిదేళ్ల తర్వాతైనా కాంగ్రెస్ తెలంగాణ రాష్ట్రం ప్రకటించడం సంతోషంగా ఉందన్నారు. వైఎస్ రాజశేఖరరెడ్డి ఉన్నప్పుడే అన్ని ప్రాంతాల ప్రజాప్రతినిధులు అందరూ తెలంగాణకు అనుకూలంగా తమ అభిప్రాయాలు వెల్లడించారని చెప్పారు.
పాలక, ప్రతిపక్షాలు తెలంగాణకు అనుకూలంగా ఉన్నాయని, పార్లమెంట్లో వెంటనే తెలంగాణ బిల్లుపెట్టాలని డిమాండ్ చేశారు. ప్రచార సాధనాలు చేస్తున్న హడావుడితో తెలంగాణ ప్రజల్లో ఆందోళనలు నెలకొనే ప్రమాదముందని, విపరీత ప్రచారాలు నిలిపివేయాలని కోరారు.