మండల, జిల్లా పరిషత్ ఎన్నికల విధులు నిర్వహించడానికి వచ్చిన ఓ ఎంపీడీవో మూడు లక్షలు మింగేసిన సంగతి సోమవారం వెలుగులోకొచ్చింది.
ఎంపీటీసీ అభ్యర్థుల డిపాజిట్టు, సిబ్బందికి ఇవ్వాల్సిన నగదు స్వాహా
కార్యాలయంలోని టీవీ మాయం
ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసిన ప్రస్తుతం ఎంపీడీవో
పలమనేరు: మండల, జిల్లా పరిషత్ ఎన్నికల విధులు నిర్వహించడానికి వచ్చిన ఓ ఎంపీడీవో మూడు లక్షలు మింగేసిన సంగతి సోమవారం వెలుగులోకొచ్చింది. వైఎస్ఆర్ జిల్లా ఎర్రగుంట్లకు చెందిన ఎంపీడీవో జయసింహ ఎన్నికల విధుల కోసం పలమనేరు ఎంపీడీవోగా మార్చి 4వ తేది ఇక్కడికొచ్చారు. అప్పట్లో ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల ప్రక్రియ ఈయన ఆధ్వర్యంలో మొదలైంది. అనంతరం ఎన్నికలు పూర్తయ్యాక బదిలీల్లో భాగంగా మే 28న తిరిగి సొంత జిల్లాకు వెళ్లారు. ఆయన విధులు నిర్వహించిన సందర్భంలో పలు అక్రమాలకు పాల్పడినట్లు ఆయన తర్వాత బాధ్యతలు నిర్వహించిన ఎంపీడీవో మంజుల గుర్తించారు. ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో పోటీచేసిన అభ్యర్థులకు సంబంధించిన నామినేషన్ రుసుం సుమారు రూ.60వేలను ఆయన తస్కరించినట్లు బయటపడింది. ఎంపీడీవో గదిలోని రూ.10వేలకు పైగా విలువజేసే ఓ టీవీ మాయమైంది. ఎన్నికల్లో విధులు నిర్వహించిన సిబ్బందికి అందాల్సిన రూ.2.60 లక్షల డబ్బును కూడా తీసుకెళ్లినట్లు గుర్తించారు. మొత్తం మీద రూ.3 లక్షలకు పైగా ఈయన స్వాహా చేసినట్లు తేలింది. ఆమేరకు ఆమె ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. ఆ తర్వాత ప్రస్తుతం ఎంపీడీవోగా ఉన్న విద్యాసాగర్ను విచారణకు ఆదేశించారు. ఆమేరకు విద్యాసాగర్ పూర్తిస్థాయి నివేదికను జిల్లా కలెక్టర్తో పాటు జెడ్పీ సీఈవోలకు ఈ మధ్యనే అందజేసినట్లు తెలిసింది. ఈ విషయమై ప్రస్తుత ఎంపీడీవో విద్యాసాగర్ను వివరణ కోరగా ఎన్నికల విధులకు ఇక్కడికొచ్చిన జయసింహ అక్రమాలకు పాల్పడిన మాట వాస్తవమేనన్నారు. దీనిపై తాము ఉన్నతాధికారులకు నివేదిక సమర్పించామన్నారు.