బోధనపై ప్రత్యేక దృష్టి

Focus on Government Schools Education Visakhapatnam - Sakshi

విద్యా వలంటీర్లనియామకానికి చర్యలు

జిల్లాలో 998 పోస్టుల భర్తీకి ప్రతిపాదనలు

జీవీఎంసీ పాఠశాలల్లో 162 పోస్టులు

ఉన్నతాధికారులకు నివేదించిన జిల్లా యంత్రాంగం

సాక్షి, విశాఖపట్నం: రాష్ట్ర ప్రభుత్వం పాఠశాలల్లో విద్యా బోధనపై ప్రత్యేక దృష్టి సారించింది. ఉపాధ్యాయుల ఖాళీల స్థానంలో అకడమిక్‌ ఇన్‌స్ట్రక్టర్లను (విద్యా వలంటీర్లు) తాత్కాలిక ప్రాతిపదికన నియమించనుంది. కోర్టు కేసుల నేపథ్యంలో డీఎస్సీ–2018 నియామకాలు ఆలస్యం కావడం, ఉద్యోగ విరమణ పొందిన ఉపాధ్యాయుల పోస్టులు ఖాళీలతో పాటు నెలవారీ పదోన్నతులతో జిల్లాలో పోస్టులు చాలా వరకు ఖాళీలు ఏర్పడ్డాయి. దీంతో ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయుల కొరత తీవ్రంగా ఉంది. అలాగే విద్యా శాఖలో ప్రభుత్వం తీసుకుంటున్న నూతన సంస్కరణలు, అమ్మఒడి పథకం అమలుతో ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య జిల్లాలో గరిష్టంగా పెరిగింది. దీంతో జిల్లాలో ఉపాధ్యాయుల ఖాళీల సంఖ్య పెరుగుతూనే ఉంది. ఈ లోటును భర్తీ తీర్చడానికి విద్యా వలంటీర్లను నియమించేందుకు ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చింది. ఈ ప్రక్రియ పూర్తయితే జిల్లాలో ఉపాధ్యాయుల కొరత తీరనుంది.

పోస్టులకు ప్రతిపాదనలు
ఉపాధ్యాయులు, విద్యార్థుల నిష్పత్తి ప్రకారం జిల్లాలో 998 మంది విద్యా వలంటీర్లు అవసరమని జిల్లా విద్యాశాఖ పాఠశాల విద్యాశాఖ కమిషనర్‌కు ప్రతిపాదనలు నివేదించింది. ప్రాథమిక పాఠశాలల్లో 291, ప్రాథమికోన్నత పాఠశాలల్లో 369, ఉన్నత పాఠశాలల్లో 338 వలంటీర్లు అవసరమని ప్రతిపాదనల్లో పేర్కొన్నారు. ఈ మేరకు ప్రతిపాదించిన వలంటీర్లను తాత్కాలిక ప్రాతిపదికన నియమించేందుకుప్రభుత్వం నుంచి అనుమతి కోసం జిల్లా విద్యాశాఖ ఎదురు చూస్తోంది. సెకండరీ గ్రేడ్‌ టీచర్‌ కేడర్‌లో నియమితులైన వారికి నెలకు రూ.5 వేలు, స్కూల్‌ అసిస్టెంట్‌లకు రూ.7 వేలు చొప్పున గౌరవ వేతనాన్ని చెల్లించనున్నారు. ఇలా ఎంపికైన విద్యా వలంటీర్లు ప్రస్తుత విద్యాసంవత్సరం ముగిసే వరకూ లేదా డీఎస్సీ–2018 నియామకాలు చేపట్టే వరకూ కొనసాగించే అవకాశం ఉందని జిల్లా అధికారులు తెలిపారు.

టీడీపీ నిర్వాకం వల్లే డీఎస్సీ ఆలస్యం
2018 డీఎస్సీ నియామకాలు గత ప్రభుత్వ నిర్వాకమే అని ఉపాధ్యాయ అభ్యర్థులు చెందుతున్నారు. గత ప్రభుత్వ హయాంలో మూడేళ్ల తర్వాత ఎన్నికల ముందు నిరుద్యోగులను ప్రలోభ పెట్టేందుకు నిర్వహించిన డీఎస్సీ–2018లో లోపాల కారణంగా అభ్యర్థులు కోర్టు మెట్లు ఎక్కాల్సిన పరిస్థితి వచ్చిందని ఉపాధ్యాయ సంఘాల నేతలు చెబుతున్నారు. 2018 డీఎస్సీ ఆన్‌లైన్‌ పరీక్షా విధానంలో విడతల వారీగా నిర్వహించి నార్మలైజేషన్‌ ప్రకటించకుండా ఫలితాలు విడుదల చేయడంతో అభ్యర్థుల మధ్య విభేదాలకు దారితీసింది. ఆన్‌లైన్‌ విధానంలో ఒకే అర్హత ఉన్న అభ్యర్థులకు వేర్వేరు పేపర్లలో పరీక్షలు నిర్వహించారు. దీంతో సులువుగా ఉన్న పేపర్‌ అభ్యర్థులకు ఎక్కువ మార్కులు రావడంతో, మిగిలిన పేపర్‌ అభ్యర్థులు అసంతృప్తి వ్యక్తం చేశారు. దీంతో జాతీయ స్థాయి ఆన్‌లైన్‌ పరీక్షల్లో అమలు చేసే నార్మలైజేషన్‌ డీఎస్సీ ఫలితాల్లో అమలు చేయాలని వారంతా కోర్టుకు వెళ్లడంతో డీఎస్సీ–2018 ఆలస్యం అయ్యింది. ఈ కోర్టు కేసు తేలితేనే ప్రభుత్వానికి కొత్త డీఎస్సీ ప్రకటించేందుకు అవకాశం ఉన్నట్లు విద్యావేత్తలు చెబుతున్నారు. 2018 డీఎస్సీలో 626 పోస్టులు భర్తీ చెయ్యాల్సి ఉన్నా.. కోర్టు కేసుల కారణంగా కేవలం 144 పోస్టులు మాత్రమే భర్తీ అయ్యాయి. మిగి లిన 482 పోస్టులు ఇంకా ఖాళీలుగానే చూపిస్తున్నాయి.

ప్రభుత్వానికి నివేదిక పంపించాం
జిల్లాలో ఇటీవల ఏర్పడిన ఉపాధ్యాయుల ఖాళీల దృష్ట్యా విద్యాబోధనకు ఆటంకం కలగకుండా సమీప పాఠశాల నుంచి ఉపా«ధ్యాయులను సర్దుబాటు చేశాం. విద్యార్థులు, ఉపాధ్యాయుల నిష్పతికి అనుగుణంగా జిల్లాలో ఆయా పాఠశాలలకు అకడమిక్‌ ఇన్‌స్ట్రక్టర్లు అవసరమని అనుమతుల కోసం ప్రభుత్వానికి నివేదించాం.– రామలింగేశ్వరరెడ్డి,జిల్లా విద్యాశాఖాధికారి

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top