పండుగ వేళ విషాదం | Father and son killed in road accident | Sakshi
Sakshi News home page

పండుగ వేళ విషాదం

Nov 4 2013 2:45 AM | Updated on Sep 2 2017 12:15 AM

మరికొద్ది సేపట్లో దీపావళి పండుగ జరుపుకొందామనుకుంటుండగా లారీ ప్రమాదం వారి కుటుంబంలో విషాదాన్ని నింపింది.

అనకాపల్లి రూరల్, న్యూస్‌లైన్: మరికొద్ది సేపట్లో దీపావళి పండుగ జరుపుకొందామనుకుంటుండగా లారీ ప్రమాదం వారి కుటుంబంలో విషాదాన్ని నింపింది. మండలంలోని రేబాక గ్రామం వద్ద మోటార్ సైకిల్‌ను అతి వేగంగా వస్తున్న లారీ ఢీకొనడంతో తండ్రి, కొడుకు అక్కడికక్కడే మృతి చెందారు. పొక్లెయిన్ ఆపరేటర్‌గా పనిచేస్తున్న చినమాకవరానికి చెందిన బోయిన అంజి (25) పండుగ జరుపుకొనేందుకు సిహెచ్.ఎన్.అగ్రహారంలోని అత్తవారి ఇంటికి వచ్చాడు.

బంధువులందరూ పండుగ ఏర్పాట్లలో ఉండగా అంజి తన రెండేళ్ల కొడుకు వర్థన్ ను తీసుకుని మోటార్ సైకిల్‌పై సమీపంలోని సబ్బవరం మార్గంలోని పెట్రోల్ బంకుకు వచ్చాడు. పెట్రోల్ పోయించుకొని తిరిగి వస్తుండగా మార్గమధ్యలో లారీ ఢీకొనడంతో తండ్రి, కొడుకులు అక్కడికక్కడే మృతి చెందారు. మృతుని భార్య పార్వతి గర్భవతి. మరికొద్ది రోజుల్లో మరొక బిడ్డకు జన్మనివ్వనుంది.

భర్త, కొడుకు మృతి చెందారన్న విషాధ వార్త తెలియగానే అపస్మారక స్థితికి చేరుకుంది. వెంటనే ఆమెను బంధువులు అనకాపల్లి ఎన్టీఆర్ ఆస్పత్రికి తరలించారు. కొడుకు వర్థన్ చావులోను విడిచిపోనంటూ తండ్రి కాలును పట్టుకుని కన్నుమూసిన దృశ్యం అందర్నీ కంటతడిపెట్టించింది. రూరల్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
 

Advertisement
 
Advertisement
Advertisement