'ప్రభుత్వ విధానాల వల్లే రైతు ఆత్మహత్యలు' | Sakshi
Sakshi News home page

'ప్రభుత్వ విధానాల వల్లే రైతు ఆత్మహత్యలు'

Published Tue, May 16 2017 5:24 PM

farmers commiting suicides because of government policies, says ys jagan mohan reddy

రాష్ట్రంలో ప్రభుత్వం పాటిస్తున్న అస్తవ్యస్త విధానాల వల్ల రైతులు బతికే పరిస్థితి లేకుండా పోయిందని, అందుకే వాళ్లు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని వైఎస్ఆర్‌సీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అన్నారు. గుంటూరు జిల్లా మాచర్ల నియోజకవర్గంలోని వెల్దుర్తి మండలం దావుపల్లిలో లాలు నాయక్ అనే మిర్చిరైతు ఇటీవల ఆత్మహత్య చేసుకున్నారు. ఆయన కుటుంబాన్ని వైఎస్ జగన్ మంగళవారం పరామర్శించారు. రెండెకరాల్లో పత్తి సాగు చేస్తే 70 వేల ఖర్చు వచ్చిందని, మొత్తం పది క్వింటాళ్ల పత్తి పండగా.. క్వింటాలుకు రూ. 4వేల చొప్పున మొత్తం రూ. 40 వేలు రాగా 30 వేల రూపాయల నష్టం మిగిలిందని ఆయన చెప్పారు.

ఇటీవలే అతడి భార్య తన బంగారం అమ్మి కూతురి పెళ్లి చేసిందని, ఆ సందర్భంలో కూతురికి పెట్టిన బంగారాన్ని మళ్లీ అల్లుడికి నచ్చజెప్పి తెచ్చుకుని దాన్ని బ్యాంకులో కుదువపెట్టి రూ. 40వేలు అప్పు తెచ్చారని జగన్ తెలిపారు. దాన్ని కూడా విడిపించే పరిస్థితి లేదని, పూర్తిగా అప్పుల్లో కూరుకుపోయారని అన్నారు. ఇక్కడ పక్కనే నాగార్జున సాగర్ ఉన్నా.. వెయ్యి అడుగుల లోతుకు వెళ్తే తప్ప బోర్లలో నీళ్లు పడవని చెప్పారు. ఇంత దారుణమైన పరిస్థితిలో ప్రజలున్నారని, అయినా చంద్రబాబు ప్రభుత్వం మాత్రం నిమ్మకు నీరెత్తినట్లు ఊరుకుందని అన్నారు. ముఖ్యమంత్రికి ఏమాత్రం బుద్ధి, జ్ఞానం ఉన్నా రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు.

Advertisement
Advertisement