హడలెత్తించిన ఎక్సైజ్ అధికారులు | excise officers sudden attacks on white Liquor | Sakshi
Sakshi News home page

హడలెత్తించిన ఎక్సైజ్ అధికారులు

Jan 11 2014 2:05 AM | Updated on Sep 5 2018 8:43 PM

ఎక్సైజ్ అధికారులు శుక్రవారం హడలెత్తించారు. నిర్మల్ నియోజకవర్గంలోని నిర్మల్, సారంగాపూర్, లక్ష్మణచాంద మండలాల్లో తెల్ల కల్లు దుకాణాలపై ఆకస్మికంగా దాడులు నిర్వహించారు.

నిర్మల్ అర్బన్, న్యూస్‌లైన్ :  ఎక్సైజ్ అధికారులు శుక్రవారం హడలెత్తించారు. నిర్మల్ నియోజకవర్గంలోని నిర్మల్, సారంగాపూర్, లక్ష్మణచాంద మండలాల్లో తెల్ల కల్లు దుకాణాలపై ఆకస్మికంగా దాడులు నిర్వహించారు. 13కిలోల క్లోరోఫాం, రెండు కిలో డైజోఫాం స్వాధీనం చేసుకున్నారు. 35మందిపై కేసు నమోదు చేశారు. 21మందిని అరెస్టు చేశారు. రెండు వ్యాన్లు, ఒక బైక్ సీజ్ చేశారు. వివరాలను నిర్మల్ ఎక్సైజ్ సీఐ బాబురావు వెల్లడించారు.

 కల్తీ కల్లు విక్రయాలు సాగుతున్నాయన్న ఫిర్యాదు మేరకు నిజామాబాద్‌కు చెందిన ఎన్‌ఫోర్స్‌మెంటు, ఎక్సైజ్ సభ్యులు మూడు బృందాలుగా ఏర్పడి దాడులు నిర్వహించారు. నిర్మల్ మండలం సోఫినగర్‌లోని కల్లు దుకాణంలో నిజామాబాద్ అసిస్టెంట్ ఎక్సైజ్ ఇన్‌చార్జి సూపరింటెండెంట్ పీర్‌సింగ్, ఎన్‌ఫోర్స్‌మెంట్ ఎస్సై బల్తార్ రాజు దాడి చేసి ఐదు కిలోల క్లోరోఫాం, కిలో డైజోఫాం స్వాధీనం చేసుకున్నారు. వ్యాన్ సీజ్ చేశారు. 10 మందిపై కేసు నమోదు చేశారు. ఇందులో 9 మంది పరారీలో ఉండగా, ఒకరిని అరెస్టు చేశారు.

లక్ష్మణచాందలోని దుకాణంపై నిజామాబాద్‌కు చెందిన అసిస్టెంట్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ ఆఫ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారి లకా్ష్మనాయక్, ఎక్సైజ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ ఎస్సైలు చంద్రశేఖర్, అబ్దుల్ అతిక్‌ల బృందం దాడి చేసింది. ఎనిమిది కిలోల క్లోరోహైడ్రైడ్, కిలో డైజోఫాం స్వాధీనం చేసుకున్నారు. ఒక బైక్ సీజ్ చేశారు. 9 మందిపై కేసు నమోదు చేశారు. ఇందులో నలుగురిని అరెస్టు చేశారు. సారంగాపూర్ మండలం చించోలి(బి), లక్ష్మీపూర్, గోపాల్‌పేట్ గ్రామాల్లోని కల్లు దుకాణాలపై నిజామాబాద్‌కు చెందిన అసిస్టెంట్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ నాగేందర్‌రెడ్డి, సీఐ మహేశ్ దాడి చేశారు. లక్ష్మీపూర్‌లో ఆరుగురిపై కేసు నమోదు చేసి అదుపులోకి తీసుకున్నారు. ఒక వాహనాన్ని సీజ్ చేశారు. చించోలి గ్రామంలో ఇద్దరిపై, గోపాల్‌పేట్‌లో 8 మందిపై కేసు నమోదు చేసి అరెస్టు చేశారు. ఆయా ప్రాంతాల్లో తెల్లకల్లు నమూనాలు సేకరించి పరీక్షలకు పంపారు.

 అధికారులతో వాగ్వాదం...
 సోఫినగర్ వద్ద ఎక్సైజ్ అధికారుల దాడిని అడ్డుకునే ప్రయత్నం చేశారు. పలువురిని అరెస్టు చేయడంపై కొందరు నాయకులు ఎక్సైజ్ కార్యాలయంలో అధికారులతో వాగ్వాదానికి దిగారు. అమాయకులను అరెస్టు చేశారని ఆరోపించారు. కల్తీకల్లు విక్రయాలు రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నాయని, అన్ని దుకాణాలపై దాడులు నిర్వహించాలని డిమాండ్ చేశారు. ఇందులో టీఆర్‌ఎస్ నిర్మల్ నియోజకవర్గ ఇన్‌చార్జి శ్రీహరిరావు, పలువురు గౌడ సంఘాల నాయకులు, కులస్తులు పాల్గొన్నారు.
 

Advertisement
 
Advertisement
Advertisement