ముఖ్యమంత్రి కిరణ్కుమార్రెడ్డి ఉత్తి పోషయ్యే అని తేలిపోయిందని టీఆర్ఎస్ శాసనసభాపక్ష నేత ఈటెల రాజేందర్ ఎద్దేవా చేశారు.
సాక్షి, హైదరాబాద్: ముఖ్యమంత్రి కిరణ్కుమార్రెడ్డి ఉత్తి పోషయ్యే అని తేలిపోయిందని టీఆర్ఎస్ శాసనసభాపక్ష నేత ఈటెల రాజేందర్ ఎద్దేవా చేశారు. గురువారం అసెంబ్లీ ఆవరణలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ సీఎం అబద్ధాలకోరుగా చరిత్రలో మిగిలిపోతున్నారన్నారు. జీవోఎంకు ఇచ్చిన 89 పేజీల నివేదికలో పచ్చి అబద్దాలు, అవాస్తవాలను పేర్కొన్నారని ఈటెల విమర్శించారు. తెలంగాణను ఆపి తీరుతానని మూడు నెలలుగా చెబుతూ ఉంటే తెలంగాణ ప్రజలే కాదు, సీమాంధ్ర ప్రజలు కూడా ముఖ్యమంత్రి కిరణ్ను చేతకాని పోషయ్య అని అసహ్యించుకుంటున్నారని చెప్పారు. తెలంగాణ ప్రాంత మంత్రులకు, ఎమ్మెల్యేలకు కిరణ్కుమార్రెడ్డిపై విశ్వాసమే లేదని, అలాంటి వ్యక్తికి ముఖ్యమంత్రి పదవిలో కొనసాగే నైతిక అర్హతలేదని అన్నారు.
టీఆర్ఎస్ నేతలతో అమెరికా ప్రతినిధుల భేటీ
రాష్ట్రం విడిపోయిన తర్వాత వివిధ అంశాలపై తెలంగాణ ప్రభుత్వ విధివిధానాలను తెలుసుకునేందుకు అమెరికా రాయబార కార్యాలయ అధికారులు తమను కలిశారని టీఆర్ఎస్ ఎమ్మెల్యే కేటీఆర్ తెలిపారు. అమెరికా దౌత్య కార్యాలయ ప్రతినిధులు స్ట్రావెస్ సోవరీ, మరియా గురువారం కేటీఆర్, శ్రవణ్తో భేటీ అయ్యారు.