సాక్షి, ఢిల్లీ: తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం చేతకానితనం వల్లే రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆరోపించారు రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు రామచందర్రావు. రైతుల జీవితాలతో ఆడుకోవద్దని హితవు పలికారు. అలాగే, బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్పై పోస్టర్ల విషయమై కీలక వ్యాఖ్యలు చేశారు.
తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు రామచందర్రావు ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ.. ‘తెలంగాణలో నెల రోజులు ఆలస్యంగా ధాన్యం కొనుగోలు ప్రారంభించారు. ప్రభుత్వ చేతకానితనం వల్లే ఇలా జరిగింది. రైతుల జీవితాలతో ఆడుకోవద్దు. బీజేపీ రాజేందర్పై పోస్టర్లు వేసిన వారిపై పోలీసులు చర్యలు తీసుకోవాలి. ఈ పోస్టర్లకు పార్టీ నేతలకు సంబంధం లేదు. బీజేపీ ఎదుగుదల ఓర్వలేక ఇలా పోస్టర్లు వేస్తున్నారు. దీనిపై డీజీపీ, కమిషనర్లకు ఫిర్యాదు చేశాం. ఢిల్లీ తెలంగాణ భవన్లో తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం నిర్వహిస్తున్నాం. ఈ వేడుకలకు బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబిన్ ముఖ్య అతిథిగా పాల్గొంటున్నారు’ అని చెప్పుకొచ్చారు.

కాగా, మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్ను విమర్శిస్తూ ఆయన ఇంటి వద్ద ఫ్లెక్సీ కలకలం రేపిన సంగతి తెలిసిందే. ‘నీ ఏడుపే బీజేపీకి శాపం.. బీజేపీ నీకు ఎన్నో అవకాశాలు ఇచ్చింది. బీజేపీకి నువ్ చేసిన ఒక్క మేలైనా చెప్పగలవా?’ అంటూ వెలిసిన ఫ్లెక్సీ రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఈ ఫ్లెక్సీలో ‘రాష్ట్ర అధ్యక్ష పదవి రాలేదని ఏడుపు, సీఎం అభ్యర్థిగా ప్రకటించలేదని ఏడుపు, కేంద్ర మంత్రి పదవి రాలేదని ఏడుపు’ అని విమర్శించారు.
అలాగే బీజేపీ ఈటలకు చేసిన మేలును తెలుపుతూ ‘ఓడిపోయినా మల్కాజిగిరి ఎంపీ టిక్కెట్ ఇచ్చింది.. రెండు చోట్ల ఎమ్మెల్యేగా పోటీ చేసే అవకాశం ఇచ్చింది.. మోదీ నాయకత్వంలో గెలిచాక కూడా నా ఇమేజ్తో గెలిచాను అనడం ఏ రాజకీయ నైతికత’ అని ఫ్లెక్సీలో ప్రశ్నించారు. ‘బీజేపీ నాయకులు ఎదుగుతుంటే అసహనం ఎందుకు? ఇందూరు బిడ్డ ఎంపీ అర్వింద్కు వస్తున్న ఆదరణ చూసి కడుపు మంట ఎందుకు? అని నిలదీశారు. గుర్తు తెలియని వ్యక్తులు శనివారం రాత్రి ఈ ఫ్లెక్సీని ఏర్పాటు చేసినట్టు భావిస్తున్నారు. దీంతో, బీజేపీలో నేతల మధ్య ఉన్న విభేదాలు ఉన్నట్టు మరోసారి బహిర్గతమైంది.


