బలప్రదర్శనలో పోటాపోటీ! | election tension in ditrict congress | Sakshi
Sakshi News home page

బలప్రదర్శనలో పోటాపోటీ!

Jan 19 2014 11:51 PM | Updated on Mar 18 2019 7:55 PM

కాంగ్రెస్ పార్టీలో అప్పుడే ఎన్నికల హడావుడి మొదలైంది. అభ్యర్థుల ఎంపిక ప్రక్రియలో భాగంగా ఏఐసీసీ నుంచి వచ్చిన పరిశీలకుడి ముందు ఆశావహులు బలప్రదర్శనలో పోటీ పడుతున్నారు.

 సాక్షి, రంగారెడ్డి జిల్లా: కాంగ్రెస్ పార్టీలో అప్పుడే ఎన్నికల హడావుడి మొదలైంది. అభ్యర్థుల ఎంపిక ప్రక్రియలో భాగంగా ఏఐసీసీ నుంచి వచ్చిన పరిశీలకుడి ముందు ఆశావహులు బలప్రదర్శనలో పోటీ పడుతున్నారు. తమ వర్గానికే టిక్కెట్ ఇవ్వాలంటూ అనుచరగణంతో చెప్పకనే చెప్పిస్తున్న ఆశావహులు.. వైరివర్గాన్ని తూర్పారపట్టే ఎత్తుగడతో వ్యూహా త్మకంగా సాగుతున్నారు.

 ఇప్పటికే మల్కాజిగిరి పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో అభ్యర్థుల ఎంపిక ప్రక్రియపై అభిప్రాయ సేకరణ పూర్తయిన విషయం తెలిసిందే. తాజాగా ఆదివారం చేవెళ్ల పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని వికారాబాద్, తాండూరు, శేరిలింగంపల్లి అసెం బ్లీ స్థానాల అభ్యర్థుల ఎంపికపై పరిశీలకుడు కె.బి.కోలివాడ్ అభిప్రాయ సేకరణ జరిపారు. ఇందులో భాగంగా పరిశీలకుడి ముందు బలప్రదర్శన చేపట్టిన ఆశావహులు.. అనుచరగణంతో కార్యాలయంలో హడావుడి సృష్టిం చారు. తమ నేతకే టికెట్ ఇవ్వాలంటూ కార్యకర్తలు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు.

 హాట్ హాట్‌గా వికారాబాద్..
 వికారాబాద్ నియోజకవర్గం ఈ సారి ఆసక్తికర పోటీకి కేంద్రబిందువు కానుంది. నిన్నటివరకు టీఆర్‌ఎస్‌లో కీలక భూమిక పోషించిన ఎ.చంద్రశేఖర్ ప్రస్తుతం కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. ఇప్పటికే ఈ నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న మంత్రి జి.ప్రసాద్‌కుమార్ కూడా బరిలో ఉండటంతో టికెట్ ఎవరికి దక్కుతుందోననే ఉత్కంఠ నెలకొంది. ఈ నేపథ్యంలో ఆదివారం కాంగ్రెస్ జిల్లా కార్యాలయం లో ఏఐసీసీ పరిశీలకుడి ముందు వేరువేరుగా తమ వాదాన్ని వినిపించారు. కాంగ్రెస్ పార్టీ తెలంగాణపై స్పష్టత ప్రకటించడంతో రాష్ట్ర ఏర్పాటుకు మార్గం సుగమమైందని, దీంతో తాను కాంగ్రెస్‌లో చేరినట్లు చంద్రశేఖర్ పేర్కొ ంటూ నివేదిక సమర్పించారు.

చేవెళ్ల పార్లమెంట్ టికెట్ కార్తిక్‌రెడ్డికి ఇస్తే బాగుం టుందని సూచించారు. చంద్రశేఖర్ వెంట జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ హఫీజ్ ఉన్నారు. ఇదిలా ఉంటే.. మంత్రి ప్రసాద్‌కుమార్ భారీ అనుచరగణంతో డీసీసీ కార్యాలయానికి వచ్చారు. అనుచరులు మంత్రి ప్రసాద్‌కుమార్, కేంద్ర మంత్రి జైపాల్‌రెడ్డి, సోనియా, రాహుల్‌కు మద్దతుగా పెద్దఎత్తున నినాదాలు చేస్తూ హల్‌చల్ చేశారు. మంత్రి ప్రసాద్‌కుమార్ పరిశీలకుడు కోలివాడ్‌ను కలిసి నివేదికను సమర్పించారు. నియోజకవర్గంలో తా ను చేసిన అభివృద్ధి కార్యక్రమాలను వివరిస్తూ ఈ దఫా కూడా టికెట్ తనకే ఇవ్వాలని కోరారు. ఎంపీగా జైపాల్‌రెడ్డికి మద్దతు పలికారు. పలువురు కాంగ్రెస్ నేతలు కూడా ప్రసాద్‌కు వంతపాడారు.

 తాండూరు.. జోరు..
 తాండూరు నియోజకవర్గం నుంచి ఆశావహుల సంఖ్య హెచ్చుగానే ఉంది. మహరాజ్ కుటుం బం నుంచి తండ్రికొడుకులు నారాయణరావు, రమేష్ ఇరువురు టికెట్ ఆశిస్తున్నారు. మరోవైపు పారిశ్రామికవేత్త ప్రసాద్‌రెడ్డి, మున్సిపల్ మాజీ చైర్మన్ విశ్వనాథగౌడ్ కూడా రేసులో ఉన్నారు. ఈ నేపథ్యంలో ఎవరికివారు తమ అనుచరులను వెంటబెట్టుకుని ఆదివారం డీసీసీ కార్యాలయంలో ఏఐసీసీ పరిశీలకుడు కోలివాడ్‌ను వేర్వేరుగా కలిసి వినతిపత్రాలు సమర్పించారు. నారాయణరావు, రమేష్‌లు జైపాల్‌రెడ్డికి ఎంపీ టికెట్ ఇవ్వాలని, లేని సందర్భంలో కార్తిక్‌రెడ్డికి టికెట్ ఇస్తే బాగుంటుందని సూచించారు. కాగా ప్రసాద్‌రెడ్డి మాత్రం కార్తిక్‌రెడ్డికి మద్దతు పలికారు.

 శేరిలింగంపల్లిలో..
 శేరిలింగంపల్లిలో భిక్షపతియాదవ్  పోటీలో ఉండగా.. స్థానిక నేత రాగం నాగేందర్‌యాదవ్ కూడా రేసులో ఉన్నారు. మరోవైపు మైనార్టీ నాయకురాలు షహీదాబేగం కూడా టికెట్ ఆశిస్తున్నారు. పరిశీలకుడు కోలివాడ్‌ను వేర్వేరుగా కలిసి తమ ఆకాంక్షను వ్యక్తం చేశారు. అయితే భిక్షపతి యాదవ్ ఒక్కరే పరిశీలకుడితో భేటీ కాగా, మిగిలిన వారంతా అనుచరులతో వెళ్లి కలిశారు. రాగం నాగేందర్ యాదవ్ తనకు ఎమ్మెల్యే టికెట్, తన సతీమణి సుజాతకు మహిళల కోటాలో ఎంపీ టికెట్ ఇవ్వాలని పరిశీలకుడిని కోరారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement