ఎంసెట్ కౌన్సెలింగ్ ప్రారంభం | EAMCET counseling start | Sakshi
Sakshi News home page

ఎంసెట్ కౌన్సెలింగ్ ప్రారంభం

Aug 8 2014 3:58 AM | Updated on Sep 2 2017 11:32 AM

ఎన్నో అవాంతరాలు, అటంకాల అనంతరం గురువారం ప్రారంభమైన ఎంసెట్ కౌన్సెలింగ్‌కు స్పందన అంతంతమాత్రమే లభించింది.

యూనివర్సిటీ క్యాంపస్ : ఎన్నో అవాంతరాలు, అటంకాల అనంతరం గురువారం ప్రారంభమైన ఎంసెట్ కౌన్సెలింగ్‌కు స్పందన అంతంతమాత్రమే లభించింది. రాష్ట్ర విభజన నేపథ్యంలో ఫీజు రీయింబర్స్‌మెంట్ అంశం తేలక కౌన్సెలింగ్ ప్రక్రియ ఆలస్యమైంది. ఈనెల 31లోపు అడ్మిషన్ల షెడ్యూల్ పూర్తి చేయాలని సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుతో ప్రభుత్వం కౌన్సెలింగ్‌కు శ్రీకారం చుట్టింది. తొలిరోజైన గురువారం ఒకటి నుంచి ఐదువేల ర్యాంకులు పొందిన విద్యార్థుల ధ్రుపత్రాల పరిశీలన జరిగింది.

జిల్లాలో మూడు హెల్ప్‌లైన్ సెంటర్లలో ఈప్రక్రియను ప్రారంభించారు. చిత్తూరులోని పీవీకేఎన్ డిగ్రీ కళాశాల, తిరుపతిలోని ఎస్వీ ఆర్ట్స్ కళాశాల, ఎస్వీ పాలిటెక్నిక్ కళాశాలల్లో హెల్ప్‌లైన్ సెంటర్లు ఏర్పాటు చేశారు. ఎస్వీ ఆర్ట్స్ కళాశాలలో 15 మంది, ఎస్వీ పాలిటెక్నిక్ కళాశాలలో అయిదుగురు, చిత్తూరు పీవీకేఎన్ డిగ్రీ కళాశాలలో ఏడుగురు మాత్ర మే హాజరయ్యారు. హాజరైన విద్యార్థులకు ధ్రువపత్రాలను పరిశీలించి స్క్రాచ్‌కార్డులు అందజేశారు. వీరు ఆన్‌లైన్‌లో లాగిన్ అయి వెబ్ ఆప్షన్స్ ఇచ్చుకోవాల్సి ఉంది.

తొలి ఐదు వేల ర్యాంకులు సాధించినవారిలో చాలామంది ఐఐటిలు, విట్, నిట్ లాంటి ప్రతిష్టాత్మక సంస్థల్లో చేరి ఉంటారని అందువల్ల కౌన్సెలింగ్‌కు ఎక్కువ మంది రాలేదని ఎస్వీ ఆర్ట్స్ కళాశాలలోని హెల్ప్‌లైన్ సెంటర్ కో-ఆర్డినేటర్ ఎల్‌ఆర్ మోహన్‌కుమార్‌రెడ్డి తెలిపారు. శుక్రవారం 5001 నుంచి 10వేల లోపు ర్యాంకుల వారికి కౌన్సెలింగ్ ఉంటుంది.
 

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement