దోస్త్‌లో కొత్త కోర్సులు.. | New courses in degree are introduced in Dost | Sakshi
Sakshi News home page

దోస్త్‌లో కొత్త కోర్సులు..

Jun 11 2026 3:50 AM | Updated on Jun 11 2026 3:51 AM

New courses in degree are introduced in Dost

సీఎం చొరవతోముగిసిన పంచాయితీ 

డిగ్రీలో భారీగా ఆప్షన్లు ఇస్తున్న విద్యార్థులు 

మూడో దశ కౌన్సెలింగ్‌లో 16వ తేదీ వరకు ఆప్షన్లు ఇచ్చే అవకాశం  

సాక్షి, హైదరాబాద్‌: డిగ్రీలో కొత్త కోర్సులను దోస్త్‌లోకి తేవడంలో ఎట్టకేలకు ఉన్నత విద్యామండలి విజయం సాధించింది. మూడోదశ కౌన్సెలింగ్‌లోకి వీటిని చేర్చారు. రాష్ట్ర వ్యాప్తంగా 11 యూనివర్సిటీల పరిధిలోని డిగ్రీ కాలేజీల్లో ఈ కొత్త కోర్సులు అందుబాటులోకి రానున్నాయి. ఉపాధి అవకాశాలు ఎక్కువగా ఉండటంతో భారీ సంఖ్యలో విద్యార్థులు ఈ కోర్సులకు ఆప్షన్లు ఇస్తున్నారు. ఇప్పటికే 67 కాలేజీలు డిమాండ్‌ లేని కోర్సుల్లో సీట్లు తగ్గించుకొని, కొత్త కోర్సుల నిర్వహణకు ఆమోదం తెలిపాయి. 

చదువుతోపాటు పారిశ్రామిక అవసరాలకు అనుగుణంగా శిక్షణ ఉండేలా ఉన్న కాలేజీలకు అనుమతించాలని ఉన్నత విద్యామండలి ఆదేశించింది. కొత్తగా ప్రవేశపెడుతున్న కోర్సులు కావడంతో ప్రత్యేక పర్యవేక్షణ చేపట్టాలని మండలి చైర్మన్‌ బాలకిష్టారెడ్డి భావిస్తున్నారు. ఇందుకోసం ఒక బృందాన్ని కూడా రూపొందించే ప్రక్రియలో ఉన్నారు.  

మండలిదే పైచేయి... 
ఏడాది పాటు కసరత్తు చేసిన పలు కొత్త కోర్సులను విద్యాశాఖ ఉన్నతాధికారులు, సాంకేతిక విద్యామండలి అధికారులు అడ్డుకోవడం వివాదాస్పదమైంది. దాదాపు రూ.25 లక్షలు వెచ్చించి నిపుణుల చేత సిలబస్‌ కూడా రూపొందించారు. కోర్సులను ప్రవేశపెట్టేందుకు అన్ని యూనివర్సిటీలూ తొలుత ఆమోదం తెలిపాయి. ఇంజనీరింగ్‌కు సమాంతరంగా ఉన్న కోర్సులు కావడంతో ప్రైవేట్‌ కాలేజీలు విద్యాశాఖ ఉన్నతాధికారుల వద్ద లాబీయింగ్‌ చేశాయి. దీంతో వర్సిటీలు బోర్డ్‌ ఆఫ్‌ స్టడీస్‌ (బీఓఎస్‌) ఇవ్వకుండా నిలిపివేశాయి. 

ఈ కారణంతో సాంకేతిక విద్యామండలి దోస్త్‌లోకి కొత్త కోర్సులను రానివ్వకుండా అడ్డుకుంది. దోస్త్‌ రెండు దశల కౌన్సెలింగ్‌లోనూ ఆప్షన్లలో ఇవి రాకుండా చేశారు. ఈ విషయాన్ని మండలి చైర్మన్‌ ప్రొఫెసర్‌ బాలకిష్టారెడ్డి ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. సమస్యను సీఎం దృష్టికి తీసుకెళ్లగలిగారు. విద్యాశాఖ ఉన్నతాధికారుల తీరుపై సీఎం అసహనం వ్యక్తం చేసినట్టు తెలిసింది. మూడోదశ కౌన్సెలింగ్‌లోకి కొత్త కోర్సులను చేర్చాలని సీఎంఓ ఆదేశించడంతో సమస్య పరిష్కారమైంది. 

భారీగా ఆప్షన్లు 
ప్రస్తుతం దోస్త్‌ మూడో దశ కౌన్సెలింగ్‌ నడుస్తోంది. ఈ నెల 16వ తేదీ వరకూ ఆప్షన్లు ఇచ్చేందుకు గడువు ఉంది. అవసరమైతే ఈ గడువును పొడిగించాలని అధికారులు భావిస్తున్నారు. ఇప్పటికే కొత్త కోర్సుల వైపు విద్యార్థులు భారీగా దృష్టి పెట్టారు. ఇప్పటికే సీట్లు వచ్చిన విద్యార్థులు కూడా ఆప్షన్లు ఇచ్చే ఆలోచనలో ఉన్నారు.

అవసరమైతే కాలేజీల్లో అంతర్గత స్లైడింగ్‌ ద్వారా కొత్త కోర్సులను ఎంచుకునే ఆలోచనలో ఉన్నారు. గ్రామీణ ప్రాంత విద్యార్థులు కంప్యూటర్‌ సంబంధిత కోర్సులపై ఎక్కువ ఆసక్తి చూపుతున్నారు. ఆఖరి దశ కౌన్సెలింగ్‌లోకి వీటిని చేర్చడంతో ఆప్షన్ల గడువు పెంచాలని విద్యార్థులు ఉన్నత విద్యామండలి చైర్మన్‌ను స్వయంగా కలిసి, కొంతమంది ఫోన్ల ద్వారా విజ్ఞప్తి చేస్తున్నారు.

ఇవీ కొత్త కోర్సులు.. 
ఉస్మానియా వర్సిటీలో 
బీకామ్‌–ఫైనాన్స్‌ టెక్నాలజీ 
బీకామ్‌– ఇంటర్నేషనల్‌ బ్యాంకింగ్‌ ఫైనాన్స్‌ అండ్‌ అకౌంట్స్‌ 
బీకామ్‌– ఈ కామర్స్‌ ఎంకామర్స్‌అండ్‌ డిజిటల్‌ మార్కెటింగ్‌ 

కాకతీయ వర్సిటీలో 
బీఏ–సైబర్‌ సెక్యూరిటీ అండ్‌ సైబర్‌ గవర్నెన్స్‌ 
బీఏ – డిఫెన్స్‌ అండ్‌ సెక్యూరిటీ స్టడీస్‌ 

పాలమూరు వర్సిటీలో 
బీఏ–డిఫెన్స్‌ అండ్‌ సెక్యూరిటీ స్టడీస్‌ 
బీకామ్‌– ఈకామర్స్, ఎంకామర్స్‌ అండ్‌ డిజిటల్‌ మార్కెటింగ్‌ 
బీకామ్‌– ఫైనాన్స్‌ టెక్నాలజీ 

శాతవాహన వర్సిటీలో 
బీఏ – డిఫెన్స్‌ అండ్‌ సెక్యూరిటీ స్టడీస్‌ 
బీకామ్‌– ఈ కామర్స్, ఎం కామర్స్‌ అండ్‌ డిజిటల్‌ మార్కెటింగ్‌ 
బీఎస్సీ – డిజిటల్‌ ఫోరెన్సిక్స్‌ సైన్స్‌
అండ్‌ సైబర్‌ సెక్యూరిటీ 

తెలంగాణ వర్సిటీలో 
బీఏ– డిఫెన్స్‌ అండ్‌ సెక్యూరిటీ స్టడీస్‌ 
బీకామ్‌ – ఈ కామర్స్, ఎం కామర్స్‌ అండ్‌ డిజిటల్‌ మార్కెటింగ్‌ 
బీఎస్సీ – డిజిటల్‌ ఫోరెన్సిక్స్‌ సైన్స్‌అండ్‌ సైబర్‌ సెక్యూరిటీ  

Advertisement
 
Advertisement
Advertisement