నగదు రహిత సేవలు భలే! | Digital Transactions In India | Sakshi
Sakshi News home page

నగదు రహిత సేవలు భలే!

Jul 22 2018 12:01 PM | Updated on Sep 28 2018 3:31 PM

Digital Transactions In India  - Sakshi

నెహ్రూనగర్‌(గుంటూరు): డిజిటల్‌ లావాదేవీలపై యువతను ఆకర్షించేందుకు వివిధ సంస్థలు, యాప్‌లు రకరకాల ఆఫర్లు, అవార్డులు, రివార్డులు ప్రకటిస్తున్నాయి. భీమ్, పేటీఎం, ఫ్రీచార్జి, మొబిక్విక్, ఫోన్‌పే, తేజ్‌ సహా అన్ని బ్యాంకులకు సొంత యాప్‌లు ఉన్నాయి. ఆయా సంస్థలు ఆఫర్లతో వినియోగదారులను ఆకర్షిస్తుండటంతో పట్టణాలతో పాటు గ్రామీణ ప్రాంత వాసులు నగదు రహిత లావాదేవీలపై మొగ్గు చూపుతున్నారు.

వర్చువల్‌ ఐడీ ఉంటే చాలు :
యూపీఐ(యునిఫైడ్‌ పేమెంట్‌ ఇంటర్‌ ఫేస్‌) విధానం ద్వారా షాపింగ్‌ మాల్స్‌లో బిల్లులు, ట్యాక్సీ చెల్లింపులు, రైలు, సినిమా టికెట్లు, ఆన్‌లైన్‌ షాపింగ్‌ బిల్లులు, మొబైల్‌ రీచార్జ్‌లు, గ్యాస్, కరెంట్‌ బిల్లులు ఇలా అన్ని రకాల చెల్లింపులకు డెబిట్‌/క్రెడిట్‌ కార్డులు లేకుండానే ఆన్‌లైన్‌ ద్వారా చెల్లించవచ్చు. ఏదైనా దుకాణంలో బిల్లు చెల్లించాలనుకుంటే మీ బ్యాంకు ఖాతాకు అనుసంధానించిన మీ వర్చువల్‌ ఐడీని చూపితే చాలు. దుకాణాదారులు వర్చువల్‌ ఐడీని ఎంటర్‌ చేయగానే ఫోన్‌కు మెసేజ్‌ వస్తుంది. మనం పాస్‌వార్డ్‌ను నమోదు చేయగానే, క్షణాల్లో దుకాణాదారుడి ఖాతాలో నగదు జమ అవుతుంది. ఆన్‌లైన్‌లో కొనుగోలు చేసి క్యాష్‌ ఆన్‌లైన్‌ ఎంపిక చేసుకున్నా సందర్భంలో, వస్తువు డెలివరీ తీసుకుంటున్న సమయంలో నగదుకు బదులుగా యూపీఐ యాప్‌లో ఆ సంస్థ వర్చువల్‌ ఐడీ ద్వారా ఆ మొత్తాన్ని చెల్లించవచ్చు.

క్యాష్‌ బ్యాక్‌ ఆఫర్స్‌
కొనుగోలుదారులను ఆకర్షించేందుకు వివిధ బ్యాంకులు, సంస్థలు తమ యాప్‌ల ద్వారా క్యాష్‌ బ్యాక్‌ ఆఫర్లు అందిస్తున్నాయి. వస్తువులు కొనుగోలు చేసినా, బిల్లులు చెల్లించినా 10 నుంచి 20 శాతం వరకు క్యాష్‌ బ్యాక్‌ ఇస్తున్నాయి. బయట ఎమ్మార్మీ ధరలకు కొనుగోలు చేసే బదులు ఆన్‌లైన్‌ యాప్‌ల ద్వారా కొనుగోలు చేస్తే 20శాతం వరకు వినియోగదారులకు లాభం కలుగుతుంది. దీంతో భవిష్యత్తు అంతా డిజిటల్‌ లావాదేవీలదేననే అభిప్రాయం వ్యక్తమవుతుంది. 

రివార్డు పాయింట్లు
ఫోన్‌పే, ఫ్రీచార్జ్, అమెజాన్, ఫ్లిప్‌కార్ట్‌ తదితర యాప్‌లు తమ కొనగోలుదారులకు రివార్డు పాయింట్లను కేటాయిస్తున్నాయి. నిర్ణీత సంఖ్యకు చేరగానే కొంత నగదు వెనక్కి రావడం లేదా కొద్ది మొత్తం ఉచితంగా కొనుగోలు చేయడం వంటి అవకాశాలు కల్పిస్తున్నాయి. ముఖ్యంగా రీచార్జీకి సంబంధించిన లావాదేవీలకు ఈ రివార్డు పాయింట్ల ద్వారా జరుగుతున్నాయి. సెంటర్‌ ఫర్‌ డిజిటల్‌ ఫైనాన్షియల్‌ అధ్యయనం ప్రకారం బ్యాంకు ఖాతా ఉన్న 68 శాతం మంది నగదు రహితానికే మొగ్గు చూపుతున్నారని అని తెలియజేస్తుంది. ఇందులో స్మార్ట్‌ ఫోన్‌ ఉండి, ఆన్‌లైన్‌ వినియోగిస్తున్న వారు 52 శాతంగా ఉన్నారు.

 స్మార్ట్‌ఫోన్‌లో ఇంటర్నెట్‌ కనెక్షన్‌ ఉన్న వారు అత్యధికంగా 81శాతం మంది నగదు రహిత లావాదేవీలపై మొగ్గుచూపుతున్నారు. కొన్ని ఫోన్లలో కల్పించే సౌకర్యాలతో కార్డులను తీసుకెళ్లాల్సిన అవసరం లేదు. ముందుగా మన ఫోన్‌లో బ్యాంకు ఏటీఎం కార్డు వివరాలు నమోదు చేస్తే, కొనుగోలు చేసే దగ్గర ఉండే పీవోఎస్‌ యంత్రం దగ్గర దాన్ని చూపిస్తే సరిపోతుంది. మనం నిర్దేశించే పాస్‌వార్డు లేదా వేలిముద్రలు తప్పనిసరి కావడంతో ఇతరులు దుర్వినియోగం చేసే అవకాశం ఉండదు. దీంతో భారత్‌ క్యూఆర్‌ కోడ్‌ సాయంతో వివిధ బ్యాంకులు అందిస్తున్న యూపీఐ, భీమ్‌ యాప్‌ ద్వారా కూడా నగదు చెల్లించవచ్చు. ఏ విధమైన రుసుం లేకుండా తక్షణ నగదు బదిలీ సేవలు అందించే పీవోఎస్‌ యంత్రాల అవసరం లేకపోవడంతో వ్యాపారులకు ఉపయోగపడుతుంది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement