పొగాకు రైతులకు మంచిరోజులు | demand increased to low grade tobacco | Sakshi
Sakshi News home page

పొగాకు రైతులకు మంచిరోజులు

May 25 2014 2:10 AM | Updated on Sep 2 2017 7:48 AM

వేలం కేంద్రాల్లో లోగ్రేడ్ రకం పొగాకుకు డిమాండ్ రావడంతో రైతులు కొంత ఊరట చెందుతున్నారు.

 ఒంగోలు టూటౌన్, న్యూస్‌లైన్:  వేలం కేంద్రాల్లో లోగ్రేడ్ రకం పొగాకుకు డిమాండ్ రావడంతో రైతులు కొంత ఊరట చెందుతున్నారు. నాణ్యమైన పొగాకును వెనక్కు నెట్టి లోగ్రేడ్‌ను కొనేందుకు వ్యాపారులు ముందుకు వస్తుండటం రైతులకు కలిసొచ్చింది. విదేశీ ఆర్డర్లతో ఎగుమతిదారులు లోగ్రేడ్‌లో కాస్తంత మంచి పొగాకు కొనుగోలుకు ఆసక్తి చూపుతున్నారు. దీంతో లోగ్రేడ్ నిల్వల్లో కదలిక వచ్చింది.

కొన్నాళ్లుగా పొగాకు రైతులకు సరైన గిట్టుబాటు ధర రాక, వేలం కేంద్రాలకు తెచ్చిన బేళ్లను సైతం వెనక్కు తీసుకెళ్లాల్సిన పరిస్థితి వచ్చింది. అయితే  రెండు రోజులుగా మార్కెట్‌లో ఊహించని మార్పుల వలన మేలు రకం పొగాకుతో సమానంగా లోగ్రేడ్ పొగాకుపై బయ్యర్లు ఆసక్తి చూపిస్తున్నారు. దీనితో పాటు మీడియం గ్రేడ్‌లకు కూడా మంచి ధర పలుకుతుండటంతో పొగాకు రైతుల్లో ఆనందం వెల్లివిరుస్తోంది.


ఒంగోలు రీజియన్ పరిధిలో ఒంగోలు రెండు, టంగుటూరు పరిధిలో రెండు, కొండపి, కందుకూరు పరిధిలో రెండు, గుంటూరు పరిధిలో వెల్లంపల్లి 1, 2, కేంద్రాలు, పొదిలిలో 1, 2 కేంద్రాలు, కలిగిరి, డీసీపల్లిల్లో పొగాకు వేలం కేంద్రాలున్నాయి.

ఆంధ్రప్రదేశ్‌లో 47,146 మంది పొగాకు పండించే రైతులున్నారు. కర్ణాటకలో 42,204 మంది రైతులు పొగాకు పండిస్తున్నారు. పొగాకు కేంద్రాలు ప్రారంభమై దాదాపు 70 రోజులు కావస్తోంది. ప్రారంభం నుంచి ఏనాడూ రైతుకు గిట్టుబాటు ధర దక్కని పరిస్థితి ఉంది.
 

 ప్రస్తుతం నాణ్యమైన, మేలిమి రకం పొగాకుకు రూ.127 నుంచి రూ.130 పలుకుతోంది. ఆ ధర కూడా కొద్ది బేళ్లకు మాత్రమే పలుకుతోంది. అత్యధిక బేళ్లకు కిలో రూ.115 నుంచి రూ.120 ఉంటుందని అంచనా. మీడియం గ్రేడ్‌లో కూడా కిలో రూ.105 నుంచి రూ.115 వరకు కొనుగోలు చేస్తున్నారు. వీటితో పాటు లోగ్రేడ్ పొగాకును కొంటున్నారు. దీనికి కూడా కిలో రూ.105 నుంచి రూ.115 వరకు ధర పలుకుతోంది.

దీంతో నాలుగే ళ్లుగా వ్యాపారుల వద్ద నిల్వలకు కదలిక వచ్చింది. వేలం కేంద్రాల్లో లోగ్రేడ్ పొగాకుకు మంచి ధర వచ్చిందని ఇటీవల ఒంగోలు వచ్చిన టుబాకో బోర్డు చైర్మన్ గోపాల్ విలేకర్ల సమావేశంలో తెలిపారు. పలు కంపెనీల నుంచి విదేశీ వ్యాపారులు లోగ్రేడ్ రకాన్ని కొనుగోలు చేస్తున్నారు. ఇతర దేశాల్లో లోగ్రేడ్ రకానికి ధరలు ఎక్కువగా ఉండటంతో మన లోగ్రేడ్ రకం కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు.

రాష్ర్టంలో  2013-14లో 172 మిలియన్ల పొగాకు పంట పండించేందుకు పొగాకు బోర్డు నిర్దేశిస్తే రైతులు దాదాపు 185 మిలియన్ల కిలోల పొగాకు పంట పండించారు. దీనిలో ఇప్పటి వరకు 85 నుంచి 90 మిలియన్ కిలోల వరకు అమ్మకాలు పూర్తయ్యాయి. ఇప్పటి వరకు ఆరు వేల కోట్ల పొగాకు ఉత్పత్తులు ఎగుమతి అయినట్లు టుబాకో బోర్డు చైర్మన్ ఇటీవల తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement