ప్లాస్టిక్ నిషేదం; ఫొటో పంపితే రూ.100 పారితోషికం..!
సాక్షి, విజయవాడ : జిల్లా యంత్రాంగం ప్లాస్టిక్ రహిత సమాజం కోసం నడుం బిగించింది. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రహ్మణ్యం ఆధ్వర్యంలో కృష్ణలంకలోని గీతానగర్లో అధికారులు మొక్కలు నాటి జ్యూట్ బ్యాగులను పంపిణీ చేశారు. ఆయన మాట్లాడుతూ... ‘మన విజయవాడ అనే నినాదంతో ప్లాస్టిక్ను తరిమేయాలన్నదే లక్ష్యం. భూసారం తగ్గిపోవడానికి, డ్రైనేజీ సమస్యలకి, పర్యావరణం దెబ్బతినడానికి ప్లాస్టిక్ వ్యర్థాలే కారణం. విజయవాడలో అందరూ చైతన్య వంతులై ప్లాస్టిక్ వాడకాన్ని నిషేధించాలి. ప్రభుత్వ కార్యాలయాల్లో ఎవరైనా ప్లాస్టిక్ వాడితే చర్యలు తప్పవు. ఆ విషయాన్ని ఫొటో తీసి పంపితే వంద రూపాయలు పారితోషికం ఇస్తా’అన్నారు. నగరంలో ఎవరైనా ప్లాస్టిక్ క్యారీబ్యాగ్స్ అమ్మినా, వాడినా జరిమానా విధిస్తున్నామని కలెక్టర్ ఇంతియాజ్ వెల్లడించారు. అక్టోబర్ 2 నుంచి ప్లాస్టిక్పై పూర్తి నిషేదం అమలవుతుందని చెప్పారు. కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ ప్రసన్న వెంకటేష్, ఇతర అధికారులు పాల్గొన్నారు.