ఆగని ఏనుగుల దాడి
–రూ.5లక్షల విలువ చేసే పంట నష్టం
సాక్షి, గంగవరం: చిత్తూరు జిల్లా గంగవరం మండలం జరావారిపల్లె సమీపాన పంటపొలాలపై బుధవారం అర్థరాత్రి ఏనుగులు దాడిచేసి పంటలను నాశనం చేశాయి. ఏనుగులు గ్రామ సమీపాన ఉన్నవరి, చెరకు, కాలీఫ్లవర్ పంటలపై పడి నాశనంచేయగా మామిడి చెట్లను విరిచేశాయి. గ్రామానికి చెందిన శివన్న, సరసమ్మ, చంగల్రాయప్ప, భూలక్ష్మి, గురప్ప, ఆదినారాయణ, పురుషోత్తం రైతులకు చెందిన వరి, కాలీఫ్లవర్, చెరుకు పంటలను నాశనం చేశాయి. ఏనుగుల దాడిని గమనించిన రైతులు డప్పులతో శబ్దాలు చేస్తూ వాటిని పొలిమేర దాటించారు. ఏనుగుల దాడిలో పంటల నష్టం రూ.5లక్షల వరకు ఉంటోందని బాధిత రైతులు తెలిపారు. విషయాన్ని అటవీ,రెవెన్యూ శాఖ అధధికారులకు తెలియజేశారు.