కోర్టు ఆదేశిస్తేనే ఎఫ్‌ఐఆర్ నమోదా..? | Court slams police for negligence | Sakshi
Sakshi News home page

కోర్టు ఆదేశిస్తేనే ఎఫ్‌ఐఆర్ నమోదా..?

Jan 14 2014 5:40 AM | Updated on Aug 21 2018 7:26 PM

తీవ్రమైన (కాగ్నిజబుల్) నేరాల్లోనూ బాధితుల ఫిర్యాదుతో ప్రాథమిక సమాచార నివేదిక (ఎఫ్‌ఐఆర్) నమోదులో పోలీసులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది.

 పోలీసులపై హైకోర్టు ఆగ్రహం  ఎస్సైకు రూ. 15 వేలు జరిమానా
 సాక్షి, హైదరాబాద్: తీవ్రమైన (కాగ్నిజబుల్) నేరాల్లోనూ బాధితుల ఫిర్యాదుతో ప్రాథమిక సమాచార నివేదిక (ఎఫ్‌ఐఆర్) నమోదులో పోలీసులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. న్యాయస్థానాలు జోక్యం చేసుకుంటే తప్ప ఎఫ్‌ఐఆర్ నమోదు చేయట్లేదని మండిపడింది. ఫిర్యాదు అందిన వెంటనే ఎఫ్‌ఐఆర్ నమోదు చేసేలా తగిన చర్యలు చేపట్టాలని అనేక పర్యాయాలు డీజీపీకి స్పష్టమైన ఆదేశాలిచ్చినా సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరించడం సరికాదని అసహనం వ్యక్తం చేసింది.
 
 పోలీసుల తీరు అసహ్యం కలిగిస్తోందని తీవ్ర వ్యాఖ్యలు చేసింది. ఫిర్యాదు చేసినా 30 రోజులపాటు ఎఫ్‌ఐఆర్ నమోదు చేయకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించిన హైదరాబాద్‌లోని నారాయణగూడ పీఎస్ ఎస్సై తీరును తప్పుబట్టింది. ఇందుకుగాను ఆ ఎస్సై రోజుకు రూ. 500 చొప్పున మొత్తం రూ. 15 వేలు సొంత డబ్బు బాధితునికి చెల్లించాలని ఆదేశిస్తూ న్యాయమూర్తి జస్టిస్ సీవీ నాగార్జునరెడ్డి తీర్పునిచ్చారు. డెల్టా క్యాబ్‌కు చెందిన సాజిద్ హుస్సేన్ తనను మోసం చేశాడని ఏవీ సంతోష్‌కుమార్ 2013, నవంబర్ 11న నారాయణగూడ పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయినా పోలీసులు ఎఫ్‌ఐఆర్ నమోదు చేయకపోవడంతో అదే నెల 16న మరోసారి పోస్టు ద్వారా ఫిర్యాదు పంపారు. దీనిపైనా పోలీసులు ఎటువంటి చర్యలు చేపట్టలేదు. దీంతో సంతోష్‌కుమార్ హైకోర్టును ఆశ్రయించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement