పేదలపై కోర్టుకెళ్లే ప్రతిపక్షాలను ఇక్కడే చూస్తున్నా | CM YS Jagan Speech On Rythu Bharosa Scheme Inauguration | Sakshi
Sakshi News home page

లంచాల మాట లేని ప్రభుత్వ పాలన: సీఎం జగన్‌

May 30 2020 2:04 PM | Updated on May 30 2020 2:42 PM

CM YS Jagan Speech On Rythu Bharosa Scheme Inauguration - Sakshi

సాక్షి, అమరావతి : ఇళ్లులేని పేదలకు భూ పట్టాల పంపిణీ చేస్తుంటే కోర్టుకెళ్లి అడ్డుకునే ప్రతిపక్షాన్ని తాను ఇక్కడే చూస్తున్నా అని ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజా సంక్షేమం కోసం సంకల్పించిన పథకాలను అమలు కాకుండా అడ్డుకునేందుకు కుట్రపన్నుతున్నారని మండిపడ్డారు. ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టి ఏడాది కాలం పూర్తయిన సందర్భంగా శనివారం ‘వైఎస్సార్‌ రైతు భరోసా’ కేంద్రాలను వైఎస్‌ జగన్‌ ప్రారంభించారు. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో ఈ పథకానికి శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా సీఎం వైఎస్‌ జగన్‌ మాట్లాడుతూ.. లంచం, అధికార పార్టీ సిఫార్సు లేనిదే గత ప్రభుత్వంలో పేదవాడికి పని జరిగేది కాదని గుర్తుచేశారు. తమ ప్రభుత్వంలో లంచాలనే మాట లేకుండా నేరుగా ప్రజల ఖాతాలోనే డబ్బును జమ చేస్తున్నామని తెలిపారు. (అతనొక్కడే...)

ఆస్పత్రుల్లో  ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రమాణాలు
దరఖాస్తు నుంచి లబ్ధిదారుల జాబితా వరకు అన్ని జాబితాలను గ్రామ సచివాలయాల్లో పెడుతున్నామని సీఎం జగన్‌ వివరించారు. ‘ప్రతినెలా 1వ తేదీన అర్హలందరికీ ఠంచన్‌గా పింఛన్‌ ఇస్తున్నాం. నాడు-నేడు ద్వారా స్కూళ్లను ఆధునీకరిస్తున్నాం. పిల్లలకు పౌష్టికాహారం ఉండేలా రోజుకో మెనూ రూపొందించాం. ఉన్నత విద్య, ప్రాథమిక విద్యకు రెండు నియంత్రణ కమిటీలు వేశాం. గత ప్రభుత్వం మిగిల్చిన బకాయిలను నెట్‌వర్క్‌ ఆస్పత్రులకు చెల్లించాం. రూ.2వేల జబ్బులను ఆరోగ్యశ్రీ పరిధిలోకి తెచ్చాం. హైదరాబాద్‌, బెంగళూరు, చెన్నై నగరాలకు ఆరోగ్యశ్రీని వర్తింపజేశాం. కొత్త 104, 108 అంబులెన్స్‌లను ప్రారంభించబోతున్నాం. నాడు-నేడు ద్వారా ప్రభుత్వాస్పత్రుల రూపురేఖలను మార్చబోతున్నాం. ప్రభుత్వాస్పత్రుల్లో మందుల సంఖ్యను 230 నుంచి 500లకు పెంచాం. ప్రభుత్వాస్పత్రుల్లో  ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రమాణాలతో కూడిన మందులు ఇస్తున్నాం. (వాళ్ల కష్టాలు విన్నా.. చూశా: సీఎం జగన్‌)

29లక్షల మందికి ఇళ్ల పట్టాలు
రూ. 2వేల కోట్లతో సున్నా వడ్డీ పథకాన్ని తీసుకొస్తున్నాం. కౌలు రైతులకు సైతం రైతు భరోసా సొమ్ము ఇస్తున్నాం. గత ప్రభుత్వంలో గుడి, బడి దగ్గర బెల్ట్‌ షాపులు కనిపించేవి. మా ప్రభుత్వం వచ్చాక 43వేల బెల్ట్‌ షాపులను రద్దు చేశాం. గతంలో పోలిస్తే ఇప్పుడు 33శాతం షాపులు తగ్గాయి. గ్రామ సచివాలయాల్లో లక్షా 30వేల ఉద్యోగాలు ఇచ్చాం. నామినేటెడ్‌ పదవులు, పనుల్లో 50శాతం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకే కేటాయించాం. శాశ్వత బీసీ కమిషన్‌ తీసుకొచ్చాం. ఎస్సీ, ఎస్టీలకు ప్రత్యేక కమిషన్లు ఏర్పాటు చేశాం. అర్హులైన 29లక్షల మందికి ఇళ్ల పట్టాలు ఇవ్వబోతున్నాం. మగ్గం ఉన్న ప్రతి చేనేతకు రూ.24వేలు ఇస్తున్నాం. మత్స్యకారులకు వేట నిషేధ సమయంలో రూ.10వేలు సాయం అందిస్తున్నాం. రివర్స్‌ టెండరింగ్‌ ద్వారా రూ.2వేల కోట్లకుపైగా ఆదా చేశాం’ అని సీఎం వైఎస్‌ జగన్‌ తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement