ఆరోగ్యశాఖపై నేడు సీఎం సమీక్ష | CM YS Jagan Mohan Reddy Review On Health Department | Sakshi
Sakshi News home page

 ఆరోగ్యశాఖపై నేడు సీఎం సమీక్ష

Oct 18 2019 5:15 AM | Updated on Oct 18 2019 5:15 AM

CM YS Jagan Mohan Reddy  Review On Health Department - Sakshi

సాక్షి, అమరావతి:ఆరోగ్యశాఖపై ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి శుక్రవారం ఉన్నతాధికారులతో సమీక్ష చేయనున్నారు. ఈ సమీక్షలో పలు అంశాలు చర్చకు రానున్నాయి. ప్రధానంగా వెయ్యి రూపాయలు బిల్లు దాటితో ఆరోగ్యశ్రీ పరిధిలోకి తేవడం, వైద్యకళాశాలల్లో అభివృద్ధి పనులు, మౌలిక వసతుల కల్పన, జాతీయ ఆరోగ్యమిషన్‌ నిధుల వినియోగం వంటి వాటిపై సమీక్షిస్తారని అధికార వర్గాలు వెల్లడించాయి. దీంతో పాటు ఆస్పత్రి నాడు–నేడు (అంటే ప్రస్తుత ఆస్పత్రుల పరిస్థితిని ఫొటోలు తీయడం, రెండేళ్ల తర్వాత తిరిగి ఫొటోలతో చూపించడం) పైనా చర్చిస్తారని తెలిసింది.

ప్రజాసంకల్ప యాత్రలో ఇచ్చిన హామీల  అమలుపై కసరత్తు చేస్తారు. ఇప్పటికే డయాలసిస్‌ పేషెంట్లకు రూ.10వేల పెన్షన్, ఆశా వర్కర్లకు రూ.3 వేల నుంచి రూ.10 వేలకు వేతనం పెంపు వంటివి అమలు చేసిన విషయం తెలిసిందే. ఇదిలా ఉండగా ముఖ్యమంత్రి సమీక్ష కోసం ఇప్పటికే అధికారులు పూర్తి నివేదికలు సిద్ధం చేసుకున్నారు. దీనికోసం అన్ని బోధనాసుపత్రుల సూపరింటెండెంట్‌లు, ప్రిన్సిపాళ్లు, వివిధ విభాగాల అధికారులతో వైద్య ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి జవహర్‌రెడ్డి, ముఖ్యమంత్రి కార్యాలయ కార్యదర్శి డా.పీవీ రమేష్‌ విడివిడిగా సమీక్షలు చేశారు.

Advertisement
 
Advertisement
Advertisement