50 రోజుల్లో ‘సీమ’ ప్రాజెక్టులు నిండేలా ప్రణాళిక

CM YS Jagan Comments On Seema Projects in Assembly - Sakshi

కాల్వల సామర్థ్యం పెంచి సస్యశ్యామలం చేస్తాం 

నెల రోజుల్లో ప్రతిపాదనలు.. అనంతరం టెండర్ల ప్రక్రియ  

అసెంబ్లీలో సీఎం వైఎస్‌ జగన్‌

చంద్రబాబు ఐదేళ్ల పాలనలో సీమ ప్రాజెక్టులపై తీవ్ర నిర్లక్ష్యం 

అందుకే ఈ ఏడాది వర్షాలు వచ్చినా ప్రాజెక్టులు నిండలేదు

సాక్షి, అమరావతి: వరద వచ్చినప్పుడు 50 రోజుల్లోగా రాయలసీమలోని అన్ని డ్యాములను నింపేందుకు కార్యాచరణ చేపట్టబోతున్నామని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి స్పష్టం చేశారు. ఇంజినీర్లు, నిపుణులు కలిసి నివేదికలు తయారు చేస్తున్నారని, నెలరోజుల్లో ప్రతిపాదనలు పూర్తి చేసి టెండర్లు పిలుస్తామని చెప్పారు. అసెంబ్లీలో బుధవారం రాయలసీమ ప్రాజెక్టులపై టీడీపీ సభ్యులు అడిగిన ప్రశ్న చర్చకు దారితీసింది. దీనిపై ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ స్పందిస్తూ.. గత ఐదేళ్లలో చంద్రబాబు నిర్వాకం వల్లే ఇవాళ భారీగా వరద వచ్చినా ఒడిసి పట్టుకోలేక పోయామని ఆవేదన వ్యక్తం చేశారు. ఇకపై సమగ్ర ప్రణాళికతో దివంగత ముఖ్యమంత్రి, మహానేత వైఎస్‌ రాజశేఖరరెడ్డి కలలుగన్న రాయలసీమ ప్రాజెక్టులన్నీ నీళ్లతో కళకళలాడేలా చేస్తామన్నారు. ఈ విషయమై ప్రభుత్వ కార్యాచరణను ఇలా వివరించారు. 

చంద్రబాబు నిర్వాకం వల్లే..
‘మంచి వర్షాలు కురుస్తున్నాయి.. దేవుడు ఆశీర్వదించి ఇన్ని నీళ్లు ఇచ్చినా రాయలసీమలో ప్రాజెక్టులు నింపుకోలేకపోతున్నాం. ఇది మన ఖర్మ అని ఎన్నో సందర్భాల్లో చెప్పాను. నీటిపారుదల శాఖ సమీక్షా సమావేశాల సందర్భంగా కూడా మన ఖర్మ ఇలా ఉందని మొత్తుకుని చెప్పాను. మా ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 6 నెలలు మాత్రమే అయ్యింది. బాబు నిర్వాకం వల్ల ఇప్పుడు గోరకల్లు ప్రాజెక్టు 12.44 టీఎంసీల పూర్తి సామర్థ్యానికి గాను 8 టీఎంసీలు మాత్రమే నింపగలిగారు. గొల్లపల్లి రిజర్వాయర్‌లో 1.9 టీఎంసీలకు గాను కేవలం 1 టీఎంసీ మాత్రమే నింపారు. అనంతపురంలోని మిడ్‌పెన్నార్‌ సామర్థ్యం 5 టీఎంసీలకు గాను కేవలం 3.5 టీఎంసీలు మాత్రమే నింపాం.

పులివెందుల నియోజకవర్గంలో చిత్రావతి రిజర్వాయర్‌ ఉంది. నా నియోజకవర్గానికి సంబంధించినది కావడమే అది చేసుకున్న పాపమేమో అనిపిస్తోంది. ఇన్ని నీళ్లు వచ్చినా 10 టీఎంసీల సామర్థ్యానికి గాను 6.8 టీఎంసీలు మాత్రమే నిల్వ చేయగలిగాం. గండికోట రిజర్వాయర్‌లో 26.5 టీఎంసీలకు గాను కేవలం 12 టీఎంసీల నీళ్లు మాత్రమే నిల్వ చేయగలిగాం. ఒక్కోసారి చంద్రబాబును చూసినప్పుడు ఆయన మనిషేనా అనిపిస్తుంది. పెన్నా అహోబిలం బ్యాలెన్సింగ్‌ రిజర్వాయర్‌లో 11 టీఎంసీలకు గాను ఇవాళ్టికి 3.38 టీఎంసీలు మాత్రమే నింపగలిగాం. బ్రహ్మంసాగర్‌ రిజర్వాయర్‌లో 17.93 టీఎంసీలకు గాను కేవలం 6.28 టీఎంసీలు మాత్రమే నిల్వ చేయగలిగాం.  

ఆనాడు ఎంత మొత్తుకున్నా వినలేదు  
బ్రహ్మంసాగర్‌కు వెలుగోడు నుంచి నీళ్లు సరిపడా పోవడానికి కాల్వ సామర్థ్యం సరిపోవడం లేదని, 5 వేల క్యూసెక్కుల నీళ్లు పోవాల్సిన చోట 2 వేల క్యూసెక్కులు కూడా పోవడం లేదని, కెనాల్‌ మరమ్మతు చేయండని మా ఎమ్మెల్యే రఘురామిరెడ్డి సహా మేమంతా పలుమార్లు చెప్పాం. కానీ చంద్రబాబు ఆ ఐదేళ్లలో విన్న పాపాన పోలేదు. సర్వారాయసాగర్‌లో 3 టీఎంసీలకు 1 టీఎంసీ మాత్రమే నింపగలిగాం. నా నియోజకవర్గంలోని పైడిపాలెం రిజర్వాయర్‌ నింపడానికి గట్టి ప్రయత్నాలు చేయడంతో 6 టీఎంసీలకు గాను 5.44 టీఎంసీలు నిల్వ చేయగలిగాం. ఐదేళ్లలో చంద్రబాబు చేయాల్సిన పనులు చేయనందునే ఈ కష్టాలు. గండికోట ప్రాజెక్టుకు ఆర్‌ అండ్‌ ఆర్‌ కింద ఇవ్వాల్సిన రూ.980 కోట్లు ఇచ్చి ఉంటే.. ఇవాళ ఆ ప్రాజెక్టును పూర్తిగా నింపేవాళ్లం.

చంద్రబాబు ముఖ్యమంత్రి కాకముందు 2004 నుంచి 2014 వరకు జీఎన్‌ఎస్‌ఎస్‌కు రూ.5,036 కోట్లు ఖర్చు చేశారు. హంద్రీ–నీవాకు సంబంధించి రూ.6,593 కోట్లు ఖర్చు చేశారు. చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యాక గండికోట సహా ఇతర రాయలసీమ ప్రాజెక్టులకు చేసిన ఖర్చు కేవలం రూ.198 కోట్లే. ఎన్నికలు వస్తున్నాయని అప్పటికప్పుడు హడావిడిగా రూ.400 కోట్లు ఆర్‌ అండ్‌ ఆర్‌ కింద విడుదల చేసే కార్యక్రమాన్ని మొదలుపెట్టారు. అదే రూ.400 కోట్లుకు రూ.980 కోట్లు కలిపి సకాలంలో ఇచ్చి ఉంటే.. గండికోట పూర్తిగా నింపేవాళ్లం కాదా అని అడుగుతున్నా. వెలిగొండకు సంబంధించి ఆర్‌ అండ్‌ ఆర్‌ కింద ఇంకా రూ.వెయ్యి కోట్లు ఇవ్వాల్సి ఉంది. అది ఇస్తేనే వచ్చే జూన్‌ నాటికి నీళ్లు నింపే పరిస్థితి ఉంటుంది. వీటన్నిటిపై చంద్రబాబు కనీస ధ్యాస పెట్టి ఉంటే ప్రాజెక్టులన్నీ ఇవాళ నిండుకుండలా ఉండేవి.   

యుద్ధ ప్రాతిపదికన పనులు  
- మా ప్రభుత్వం అధికారంలోకి రాగానే కాల్వల మరమ్మతు పనులకు యుద్ధ ప్రాతిపదికన చర్యలు తీసుకుంది. ఆర్‌ అండ్‌ ఆర్‌ నిధులు ఇవ్వడానికి చర్యలు తీసుకున్నాం. అధికారులంతా దీనిపై దృష్టి పెట్టారు.  
గండికోట ప్రాజెక్టు ఆర్‌ అండ్‌ ఆర్‌కు సంబంధించి రూ.980 కోట్లు, వెలుగొండ ప్రాజెక్టుకు సంబంధించి రూ.1,000 కోట్లు ఇవ్వడానికి సిద్ధపడుతున్నాం.  
వరద వచ్చినప్పుడు 50 రోజుల్లోగా ఆ వరద నీటితో రాయలసీమలోని అన్ని డ్యాంలు నింపాలని కార్యాచరణ చేపట్టాం. ఇంజినీర్లు, నిపుణులు కలిసి నివేదికలు తయారు చేస్తున్నారు. ఈ పనులు నెల రోజుల్లోపు పూర్తి చేసి టెండర్లను పిలుస్తాం.  
- దేవుడు ఆశీర్వదించి మళ్లీ ఇలాంటి వర్షాలు పడితే 50 రోజుల్లోగా ప్రాజెక్టులను నింపడానికి పోతిరెడ్డిపాడు హెడ్‌ రెగ్యులేటర్‌ సామర్థ్యాన్ని 44 వేల క్యూసెక్కుల నుంచి 80 వేల క్యూసెక్కులకు పెంచేలా కార్యాచరణ చేపడతాం.  
- తెలుగు గంగ కెనాల్‌ స్థాయిని 11,500 క్యూసెక్కుల నుంచి 18 వేల క్యూసెక్కులకు పెంచే కార్యక్రమాన్ని చేస్తున్నాం. 
- ఎస్సార్‌బీసీ కెనాల్‌ సామర్థ్యాన్ని 21 వేల నుంచి 30 వేల క్యూసెక్కులకు పెంచుతున్నాం.  
- కేసీకెనాల్‌– నిప్పులవాగు ప్రాజెక్టు సామర్థ్యాన్ని 12,500 నుంచి 35 వేల క్యూసెక్కులకు పెంచుతున్నాం.  
- అవుకు టన్నెల్‌ కెపాసిటీ 20 వేల క్యూసెక్కులు. చంద్రబాబు ఐదేళ్ల పాలన తర్వాత కూడా ఇంకా 10 వేల క్యూసెక్కుల స్థాయి దాటలేదు. దీన్ని 30 వేల క్యూసెక్కులకు పెంచబోతున్నాం.  
గండికోట కెనాల్‌ కెపాసిటీ 20 వేల నుంచి 30 వేల క్యూసెక్కులకు పెంచబోతున్నాం.  
హెచ్‌ఎన్‌ఎస్‌ఎస్‌ కాల్వలో 2,100 క్యూసెక్కుల నీరు కూడా సరిగ్గా పోవడం లేదు. దీన్ని 6 వేల క్యూసెక్కులకు పెంచుతున్నాం. 
తెలుగుగంగ మెయిన్‌ కెనాల్‌ నుంచి వైఎస్సార్‌ కడప కాల్వ సామర్థ్యాన్ని 3,500 నుంచి 8 వేల క్యూసెక్కులకు పెంచుతున్నాం. 
గండికోట నుంచి సీబీఆర్‌ లిఫ్ట్‌ స్థాయిని 2 వేల నుంచి 4 వేల క్యూసెక్కులకు పెంచుతున్నాం.  
గండికోట నుంచి జీఎన్‌ఎస్‌ఎస్‌ మెయిన్‌ కెనాల్‌ సామర్థ్యాన్ని 4 వేల నుంచి 6 వేల క్యూసెక్కులకు పెంచే కార్యక్రమాన్ని చేస్తున్నాం.  

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top