ఫౌల్ట్రీ రంగానికి కేంద్ర బిందువుగా వర్ధిల్లుతున్న జిల్లాలో నేడు దయనీయ పరిస్థితులు నెలకొన్నాయి.
గజ్వేల్, న్యూస్లైన్: ఫౌల్ట్రీ రంగానికి కేంద్ర బిందువుగా వర్ధిల్లుతున్న జిల్లాలో నేడు దయనీయ పరిస్థితులు నెలకొన్నాయి. బ్రాయిలర్ కోళ్ల ఉత్పత్తిలో దేశంలోనే రాష్ట్రం మొదటి స్థానంలో ఉండగా, ఇందులో 50 శాతం ఉత్పత్తులు అందిస్తున్న మన జిల్లాలో పౌల్ట్రీ రైతులు కష్టాలు దయనీయంగా మారాయి. ఇంటిగ్రేటెడ్ సంస్థల భాగస్వామ్యంతో కోళ్లను ఉత్పత్తి చేస్తున్న రైతులకూ కలిసిరావడం లేదు. సొంతంగా పరిశ్రమను నిర్వహిస్తున్న వారి పరిస్థితి మరీ దారుణంగా ఉంది. మార్కెట్ మాయాజాలంలో ధర రాక లక్షల్లో నష్టాలు చవిచూస్తున్నారు. దీంతో అప్పుల బాధ తాళలేక పిల్లాపాపలతో సహా గ్రామాలను వదిలి వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడటం ఆందోళన కలిగిస్తోంది.
జిల్లాలో వ్యవసాయరంగం తర్వాత రెండో అతిపెద్ద పరిశ్రమగా ఫౌల్ట్రీ వెలుగొందుతోంది. దశాబ్దాలుగా ఈ పరిశ్రమతో రైతులకు అవినాభావ సంబంధం ఏర్పడింది. కాలం కలిసొస్తే స్వల్ప వ్యవధిలోనే స్థితిమంతులను చేయడం.. కాలం కలిసి రాకపోతే నష్టాల పాలు చేయడం ఈ పరిశ్రమ ప్రత్యేకత. ప్రస్తుతం రెండో రకమైన పరిస్థితి జిల్లాలో నెలకొంది. ఎగుమతులు నిలిచిపోవడం, కార్తీక మాసం కావడంతో కొంతకాలంగా చికెన్ ధరలు గణనీయంగా పడిపోయాయి.
మార్కెట్లో ధర స్థిరీకరణ లేకపోవడం, సరాసరి కిలో లైవ్ ధర రూ. 34 నుంచి రూ. 36 మాత్రమే పలకడం నష్టాల తీవ్రతను పెంచుతోంది. గజ్వేల్ నియోజకవర్గంలో ఇప్పటికే వేలాది మంది రైతులు సుగుణ, వెంకటేశ్వర, డైమండ్, జాహ్నవి, జానకీ, ఎస్ఆర్, స్నేహ తదితర ఇంటిగ్రేటెడ్ సంస్థల భాగస్వామ్యంతో పౌల్ట్రీ పరిశ్రమ నడుపుతున్నారు. ఈ సంస్థలతో పరిశ్రమను నడుపుకోవాలనుకుంటే రైతులు షెడ్, లేబర్, కరెంట్, నీరువంటి మౌలిక వసతులను కల్పించాల్సి ఉంటుంది. ఆ సంస్థల నుంచి చిక్స్ అందించి వాటికి 45 రోజుల వ్యవధి కోసం మందులు, దాణా అందుతుంది. ఒక్కో బర్డ్ సగటున రెండు కిలోలకు పైగా తూకం వస్తుంది. ఈ స్థాయికి వచ్చేవరకు సంస్థలు ఒక్కో కోడికి రూ.80 వరకు ఉత్పత్తి వ్యయం కింద ఖర్చుచేస్తున్నాయి. మార్కెట్లో చికెన్ ధరతో సంబంధం లేకుండా రైతులకు ఒక్కో కోడిపై కిలోకు రూ.4.85 చెల్లిస్తాయి. నిర్వహణ బాగుంటే మరో 25 పైసలు అదనంగా చెల్లిస్తారు. 5 శాతం కోళ్లకంటే ఎక్కువగా మృత్యువాత పడితే నష్టాలను రైతులే భరించాలి. విద్యుత్ చార్జీల రూపేణా 5 వేల కోడిపిల్లల సామర్థ్యం కలిగిన షెడ్కు 45 రోజులకు రూ.5 వేలపైనే బిల్లు చెల్లించాల్సి ఉంటుంది. వీటన్నింటినీ మినహాయిస్తే ఈ సంస్థల భాగస్వామ్యంతో కోళ్లను పెంచుతున్న రైతులకు మిగులుతోంది అంతంతమాత్రమే.
నష్టాలకు కారణాలెన్నో..
కొంతకాలంగా పౌల్ట్రీ పరిశ్రమను ప్రతికూల పరిస్థితులు చుట్టుముట్టాయి. ఒక్కో కోడి ఉత్పత్తి చేయడానికి అన్నీ కలుపుకుని రూ.95 వరకు ఖర్చవుతోంది. సుమారు రెండు కిలోలకుపైగా బరువుండే బర్డ్స్ చికెన్ ధర రూ.60 నుంచి 65 వరకు పలికితే నష్టాలు ఉండేవి కావు. కానీ కొంతకాలంగా చికెన్ ధర రూ.34 నుంచి 36 వరకే పలుకుతోంది. ఈ పరిస్థితి వల్ల ఇంటిగ్రేటెడ్ సంస్థలతో పరిశ్రమలను నిర్వహిస్తున్న రైతులను పక్కనబెడితే సొంతంగా కోళ్లను ఉత్పత్తి చేస్తున్న రైతులు అధోగతి పాలవుతున్నారు. ఏడాదిన్నర క్రితం ఇక్కడి నుంచి మహారాష్ట్ర, తమిళనాడు తదితర రాష్ట్రాలకు ఉత్పత్తులు ఎగుమతి అయ్యేవి. ఆయా రాష్ట్రాల్లో రైతులకు చిక్స్, దాణా, విద్యుత్ సరఫరాకు సంబంధించి ప్రభుత్వం 30 నుంచి 50 శాతం వరకు సబ్సిడీని ఇవ్వడం వల్ల ఉత్పత్తులు పెరిగిపోయి రాష్ట్రం నుంచి ఎగుమతులు ఆగిపోయాయి. ఇదిలావుంటే ఇంటిగ్రేటెడ్ సంస్థలు ఉత్పత్తులు విపరీతంగా పెరిగిపోవడం మాయాజాలాన్ని ప్రదర్శిస్తూ ధరలను విపరీతంగా తగ్గిస్తున్నాయి. లక్షల్లో నష్టాలను చవిచూసి అప్పులపాలైన రైతులు పిల్లాపాపలతో గ్రామాలను వదిలి వెళ్తున్నారు.
ఇలాంటి పరిస్థితి ఎప్పుడూ రాలేదు
1986లో నేను పౌల్ట్రీ రంగంలోకి వచ్చాను. ఇంటిగ్రేటెడ్ సంస్థలతో ప్రమేయం లేకుండా కోళ్లను ఉత్పత్తి చేస్తున్నాను. ప్రస్తుతం 10 వేల చిక్స్ సామర్ధ్యం గల ఫారం నిర్వహిస్తున్నాను. 2004-04లో కోళ్లకు బర్డ్ఫ్లూ వచ్చిన సమయ ంలో తీవ్రమైన నష్టాలను చవిచూడాల్సి వ చ్చింది. ప్రస్తుతం కూడా అదే రకమైన పరిస్థితి ని ఎదుర్కొంటున్నాం. ప్రభుత్వం ఇప్పటికైనా ఈ రంగాన్ని ఆదుకోవాలి. ఇతర రాష్ట్రాల్లో మా దిరిగా సబ్సిడీలను అందించి చేయూతని వ్వాలి.
- దశరథరెడ్డి, ఫౌల్ట్రీ ఫారం నిర్వాహకుడు, తిర్మలాపూర్, దౌల్తాబాద్ మండలం