మన సింగరేణి మనకే.. | Check out our corrupt .. | Sakshi
Sakshi News home page

మన సింగరేణి మనకే..

Dec 17 2013 3:41 AM | Updated on Sep 2 2017 1:41 AM

సింగరేణి సంస్థపై 60 సంవత్సరాల నుంచి సాగిస్తున్న సీమాంధ్ర పెత్తందారీతనం ప్రత్యేక రాష్ట్రంతో పటాపంచలు కానుంది.

 =సీమాంధ్ర కుట్రలకు చెల్లు
 =ముసాయిదా బిల్లుతో తీరిన సందేహం

 
శ్రీరాంపూర్(ఆదిలాబాద్), న్యూస్‌లైన్ : సింగరేణి సంస్థపై 60 సంవత్సరాల నుంచి సాగిస్తున్న సీమాంధ్ర పెత్తందారీతనం ప్రత్యేక రాష్ట్రంతో పటాపంచలు కానుంది. కంపెనీలో ఎలాగైనా వాటా దక్కించుకునేందుకు.. వనరులను యథేచ్ఛగా దోచుకోవాడానికి ఆ ప్రాంత నేతలు చేసిన కుట్రలకు తెలంగాణ ముసాయిదా బిల్లులో చేర్చిన అంశంతో చెక్ పడింది. బొగ్గు గనుల్లో వాటా కావాలని సీమాంధ్ర పెట్టుబడిదారులు, ప్రజాప్రతినిధులు జీఓఎంపై తీవ్రంగా ఒత్తిడి తెస్తూ ఇంతకాలం లాబీయింగ్ చేసిన విషయం తెలిసిందే.

తెలంగాణకు కొంగు బంగారమైన సింగరేణిపై సీమాంధ్రులకు ఎలాంటి హక్కు లేదని.. అది పూర్తిగా తెలంగాణ రాష్ట్రానికే చెందుతుందని సోమవారం అసెంబ్లీలో ప్రవేశపెట్టిన టి-ముసాయిదా బిల్లులో తేల్చిచెప్పారు. దీంతో సింగరేణి అంతటా హర్షాతిరేకాలు వ్యక్తవుతున్నాయి. ముసాయిదా బిల్లు 12వ షెడ్యూల్‌లో బొగ్గు గనుల గురించి విశదీకరించారు. సంస్థలో ఇప్పటి వరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి 51 శాతం, భారత ప్రభుత్వానికి 49 శాతం వాటా కొనసాగుతూ వస్తోంది.

ఆంధ్రప్రదేశ్ వాటా 51 శాతం ఇక నుంచి తెలంగాణ రాష్ట్ర వాటాగా, మిగిలిన 49 శాతం కేంద్ర ప్రభుత్వ వాటాగా పేర్కొన్నారు. దీంతో సింగరేణి సంస్థ పూర్తిగా తెలంగాణ రాష్ట్రానిదేనని తేలిపోయింది. అంతే కాకుండా ప్రస్తుతం ఉన్న కోల్‌లింకేజీలు మున్ముందు అలాగే కొనసాగించడం జరుగుతుందని.. ఇందులో ఎలాంటి మార్పు ఉండదని పేర్కొన్నారు. కొత్త లింకేజీలుంటే కేంద్ర ప్రభుత్వ పాలసీలకు అనుగుణంగా నడుచుకోవాల్సి ఉంటుందని తేల్చి చెప్పారు.
 

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement