'అధికారం శాశ్వతం కాదు, ప్రజలే తిరగబడతారు'
తిరుపతి : రాష్ట్రంలో రాక్షస పాలన సాగుతోందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అన్నారు. చంద్రబాబు నాయుడు నియంతలా వ్యవహరిస్తున్నారని ఆయన సోమవారమిక్కడ ధ్వజమెత్తారు. అక్రమ కేసులకు వ్యతిరేకంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు సోమవారం చంద్రగిరిలో ధర్నాకు దిగారు. కార్యకర్తల ధర్నాకు ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి మద్దతు తెలిపారు. కార్యకర్తలతో కలిసి రోడ్డుపై బైఠాయించిన ఆయన వెంటనే అక్రమ కేసులు ఎత్తివేయాలని డిమాండ్ చేశారు.
అధికారం శాశ్వతం కాదని, హిట్లర్ లాంటి నియంతలే కాలగర్భంలో కలిసిపోయారని చెవిరెడ్డి వ్యాఖ్యానించారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలపై తప్పుడు కేసులు పెడితే చూస్తూ ఊరుకోమని ఆయన హెచ్చరించారు. ప్రజలే తిరగబడే రోజులు దగ్గర్లోనే ఉన్నాయని చెవిరెడ్డి అన్నారు.