నలభై ఏళ్ల అనుభవం.. నిలువునా నిస్తేజం..!
బాబుని వెంటాడుతున్న ఓటమి బాధ
ఏం మాట్లాడుతున్నారో గమనించుకోలేని పరిస్థితి
తట్టుకోలేక నోటికొచ్చినట్టు వ్యాఖ్యలు
రెండు రోజుల సిక్కోలు పర్యటనలో అంతకుమించి కనిపించని ప్రగతి
ఘోర పరాభవం ముందు నలభై ఏళ్ల అనుభవం ఎందుకూ కొరగాకుండా పోయింది. జనం నుంచి ఎదురైన తిరస్కారం రాజకీయ దురంధరునిగా పేరు పొందిన చంద్రబాబును తీవ్రంగా కుంగదీసింది. సిక్కోలు సమీక్షలో ఆయన వ్యవహార శైలి దీన్ని తేటతెల్లం చేసింది. పదును లేని ప్రసంగాలు, అర్థం లేని విమర్శలు, ఆధారం లేని ఆరోపణలతో ఆయన పర్యటన చప్పగా సాగింది. తన మాటలతో కార్యకర్తల్లో నూతన ఉత్తేజాన్ని నింపాల్సిన పార్టీ అధ్యక్షుడు ఉన్న నిస్తేజాన్ని మరికాస్త పెంచారని ఆ పార్టీ నేతల్లోనే గుసగుసలు వినిపించాయి.
సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం: నలభై ఏళ్ల రాజకీయ అనుభవం.. పద్నాలుగేళ్ల పాలనా నుభవం.. కానీ ఇవేవీ చంద్రబాబు అసహనాన్ని దాచలేకపోయాయి. ఘోర ఓటమిని చవి చూసిన చంద్రబాబునాయుడు పూర్తిగా ఫ్రస్ట్రేషన్లోకి వెళ్లిపోయారు. ఆయన్ని ఓటమి కుంగదీయడంతో ఏం చేస్తున్నారో, ఏం మాట్లాడుతున్నారో తెలీని పరిస్థితుల్లో ఉన్నారు. ఘోర పరాజయాన్ని తట్టుకోలేక నోరు జారిపోతున్నారు. జిల్లాలో రెండు రోజుల పర్యటనలో ఆయన వ్యవహార శైలి చూస్తే ఎవరికైనా పై అభిప్రాయం కలగక మానదు. ఎన్నికల పరాజయం తర్వాత తొలిసారి జిల్లాకు చంద్రబాబు ఘనంగా స్వాగతం పలికేందుకు ఆ పార్టీ నేతలు పడరాని పాట్లు పడ్డారు. జిల్లా నలుమూలల నుంచి వాహనాలను పెట్టి జనాలను తీసుకొచ్చారు.
అయినప్పటికీ పార్టీ కార్యాలయం ప్రాంగణంలో నిర్వహించిన విస్తృత స్థాయి కార్యవర్గం సమావేశం కూడా కిటకిటలాడని పరిస్థితి. జనాలనైతే తీసుకొచ్చారు కానీ చంద్రబాబు సుదీర్ఘ ప్రసంగం వినలేక ఒక్కొక్కరిగా జారిపోయారు. మధ్యాహ్నం మాంసాహార భోజనాలు పెడుతున్నారని తెలిసినా కూడా ఆగలేదు. వచ్చిన వెంటనే చాలావరకు తిరుగు ముఖం పట్టారు. చివరికి ముఖ్య కార్యకర్తలు, నాయకులతోనే సమీక్షలు జరిగాయి. తొలి రోజు పలాస, ఇచ్ఛాపురం, టెక్కలి, పాతపట్నం, పాలకొండ నియోజకవర్గాల సమీక్ష జరగ్గా, రెండో రోజు శ్రీకాకుళం, ఎచ్చెర్ల, రాజాం, ఆమదాలవలస, నరసన్నపేట నియోజకవర్గాల సమీక్షలు జరిగాయి. రెండు రోజులు మొక్కుబడిగానే సమీక్షలు జరిగాయి. కేసులు...కేసులు... బిల్లులు చెల్లింపులు ఆగిపోయాయంటూ గగ్గోలు తప్ప మరొకటి సమీక్షల్లో కనిపించలేదు.
అంతటా అసహనం..
ఇక విస్తృత స్థాయి సమావేశంలోనూ, సమీక్షలో, చివరికి మీడియా సమావేశంలోనూ ఫ్రస్ట్రేషన్తో కూడిన వ్యాఖ్యలు తప్ప మరేమి కనిపించలేదు. ఘోర ఓటమిని జీర్ణించుకోలే ని పరిస్థితుల్లో ఉన్నట్టుగా,ఎందుకు ఓడిపో యామంటూ భవిష్యత్ భయంతో మాట్లాడు తున్నట్టుగా స్పష్టంగా కన్పించింది. చెప్పాలంటే వైఎస్సార్సీపీ 151 సీట్లు రావడాన్ని జీ ర్ణించుకోలేకపోతున్నట్టుగా ఆయన హావభావా లు తెలియజేస్తున్నాయి. భవిష్యత్ ఉందో లేదో నన్న భయంతో బ్యాలన్స్ తప్పి నోటికొచ్చినట్టుగా మాట్లాడుతున్నారు. ముఖ్యంగా సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి పైన, ఆ పార్టీ నేతలు పైన అనుచిత వ్యాఖ్యలు చేశారు. వైఎస్సార్ సీపీ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను చూసి ఓర్వలేక అసహనంతో విమర్శలు గుప్పించారు.
తానెప్పుడు హుందాగా ఉంటానని, నోరుజారనని, క్రమశిక్షణతో కూడిన రాజకీయాలు చేస్తానని చెప్పుకునే చంద్రబాబు రెండు రోజుల పర్యటనలో ఆద్యంతం అందు కు భిన్నమైన వ్యాఖ్యలు చేస్తూ తన స్థాయిని మరింత దిగజార్చుకున్నారు. రెండో రోజు సమీక్షలకు ముందు మాజీ ఎమ్మెల్యే కూన రవికుమార్ ఇంటిలో బ్రేక్ ఫాస్ట్ చేసి వారితో కాసేపు మమేకమై తాను అండగా ఉంటానంటూ భరోసా ఇచ్చారు. నియోజకవర్గ సమీక్షల్లో ఎమ్మెల్యేలు, ఆ పార్టీ ఇన్చార్జ్లు, వివిధ కమిటీల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.