
4న జిల్లాకు చంద్రబాబు
ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు మరోసారి జిల్లాకు రానున్నారు. వచ్చేనెల రెండు నుంచి రాష్ట్రంలో ప్రారంభిస్తున్న ‘జన్మభూమి-మన ఊరు’ కార్యక్రమాన్ని జిల్లాకు సంబంధించి
అనపర్తి : ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు మరోసారి జిల్లాకు రానున్నారు. వచ్చేనెల రెండు నుంచి రాష్ట్రంలో ప్రారంభిస్తున్న ‘జన్మభూమి-మన ఊరు’ కార్యక్రమాన్ని జిల్లాకు సంబంధించి అనపర్తిలో నాలుగో తేదీన ఆయన శ్రీకారం చుట్టనున్నారు. సీఎం అయ్యాక చంద్రబాబు జిల్లాకు మొదటిసారి నగరం గ్యాస్ విస్ఫోటం బాధితుల్ని పరామర్శించేందు, రెండోసారి రాజమండ్రిలో జన-ధన కార్యక్రమం ప్రారంభానికి వచ్చారు. పింఛన్ల పంపిణీతో పాటు వైద్య ఆరోగ్య శిబిరాలు, పేదరికంపై గెలుపు, పొలం పిలుస్తోంది, బడి పిలుస్తోంది, నీరు-చెట్టు, పరిశుభ్రత-ఆరోగ్యం తదితర అంశాలపై గ్రామీణులకు అవగాహన కల్పించే లక్ష్యంతో ప్రభుత్వం ‘జన్మభూమి-మన ఊరు’ కార్యక్రమాన్ని ప్రారంభిస్తోంది. కాగా అనపర్తి నియోజకవర్గంలో పర్యటించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్టు ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి ఆదివారం విలేకరులకు తెలిపారు. ముఖ్యమంత్రి పర్యటన ఖరారైనా ఆ రోజు ఎక్కడ, ఏ కార్యక్రమాలు నిర్వహించాలనే దానిపై త్వరలో జిల్లా నేతలతో సంప్రదించి ఒక నిర్ణయానికి రానున్నామని చెప్పారు. నియోజకవర్గ అభివృద్ధికి సంబంధించి పలు ప్రతిపాదనలను ముఖ్యమంత్రికి అందజేస్తామన్నారు.