సీఈసీతో సమావేశమైన చంద్రబాబు | Chandrababu met with the CEC | Sakshi
Sakshi News home page

సీఈసీతో సమావేశమైన చంద్రబాబు

Feb 2 2019 5:36 AM | Updated on Feb 2 2019 5:36 AM

Chandrababu met with the CEC - Sakshi

ఢిల్లీలో సీఈసీతో భేటీ అనంతరం ఎన్నికల సంఘం కార్యాలయం వద్ద చంద్రబాబు

సాక్షి, న్యూఢిల్లీ: కేంద్ర ఎన్నికల సంఘం ప్రధానాధికారి (సీఈసీ) సునిల్‌ ఆరోరాని ముఖ్యమంత్రి చంద్రబాబు శుక్రవారం ఢిల్లీలో ప్రత్యేకంగా కలిశారు. సాయంత్రం జరిగిన విపక్షాల సమావేశంలో ముందుగా చంద్రబాబు పాల్గొన్నారు. ఈ సమావేశంలో ఈవీఎంలపై ఉన్న అనుమానాలపై ఫిర్యాదు చేసేందుకు పలు విపక్ష పార్టీల నేతలు సోమవారం సాయంత్రం కేంద్ర ఎన్నికల సంఘాన్ని కలవాలని నిర్ణయించారు. అనంతరం జరిగిన మీడియా సమావేశంలో కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ ఇదే విషయాన్ని వెల్లడించారు. అయితే సీఎం చంద్రబాబు రాత్రి 8.35 గంటలకు కేంద్ర ఎన్నికల కమిషన్‌ కార్యాలయానికి వెళ్లి ఎన్నికల ప్రధానాధికారితో సుమారు అరగంటపాటు ప్రత్యేకంగా భేటీ అయ్యారు. సీఈసీతో భేటీ అనంతరం బాబు ఢిల్లీ సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌ను కలిశారు.

రాహుల్‌ కారులో ఆయన ఇంటి వరకు..
విపక్ష పార్టీల సమావేశంలో పాల్గొన్న అనంతరం రాహుల్, చంద్రబాబు ఒకే కాన్వాయ్‌లో బయలుదేరారు. ఈ సందర్భంగా పలు విషయాలపై ఇరువురు చర్చించుకున్నారు. అనంతరం రాహుల్‌ నివాసం వద్ద కారు దిగిన చంద్రబాబు అక్కడి నుంచి తన కాన్వాయ్‌లో ఏపీ భవన్‌కు చేరుకున్నారు. ఇక్కడ ఏర్పాటు చేసిన చేనేత వస్త్రాల ఎగ్జిబిషన్‌ను సందర్శించి మీడియాతో మాట్లాడారు. దేశంలో ఈవీఎంలను మ్యానిప్యులేట్‌ చేయవచ్చని అనుమానాలు వస్తున్నాయని, దీనిపై దృష్టిసారించాల్సిన అవసరం ఉందని చంద్రబాబు అన్నారు.  

Advertisement
 
Advertisement
Advertisement