సీమ రైతుల ఊపిరి తీసిన చంద్రకిరణం

Chandrababu Closed Oil wool factory in Chittoor - Sakshi

నిరాశ నింపిన శ్రీకృష్ణదేవరాయ నూనెవిత్తుల కర్మాగారం

2003లో బాబు జమానాలో మూత

2014 కిరణ్‌ హయాంలో యంత్రాల విక్రయం

360 రైతు సొసైటీల ఏర్పాటు శిథిలావస్థలో భవనాలు

తాత్కాలికంగా గురుకులం, ప్రభుత్వ ఐటీఐ నిర్వహణ

తీవ్ర కరువు కాటకాలతో అల్లాడే రాయలసీమ జిల్లాల్లోని వేరుశనగ రైతుల జీవితాల్లో వెలుగునింపాలన్న ఉన్నతాశయంతో ఎన్టీరామారావు ప్రభుత్వ హయాంలో పరిశ్రమను ఏర్పాటు చేస్తే  చంద్రబాబు హయాంలో క్లోజ్‌ చేయడంతో అటు రైతులు, ఇటు కార్మికులు తీవ్రంగానష్టపోతున్నారు. పీలేరు పట్టణ శివార్లలో రూ.40 కోట్ల వ్యయంతో 63.84 ఎకరాల్లో నిర్మించినశ్రీకృష్ణదేవరాయ నూనె విత్తుల కర్మాగారం మూతపడడం రాయలసీమ రైతుల్లో నిరాశ నింపింది.వేరుశనగ పంటకు గిట్టుబాటు ధర కల్పించడం, ఉపాధి అవకాశాలను మెరుగు పర్చాలన్నసంకల్పానికి తూట్లు పడింది. సీఎం హోదాలో పీలేరు నుంచే ప్రాతినిధ్యం వహించిన కిరణ్‌కుమార్‌రెడ్డి హయాంలో ఏకంగా పరిశ్రమలోని యంత్రాలను అమ్మేశారు. నాలుగు జిల్లాల్లో సుమారు ఆరు లక్షల హెక్టార్లలో వేరుశనగ సాగు చేస్తున్నారు. ఏటా తీవ్ర వర్షాభావ పరిస్థితులు నెలకుంటుండడంతోసర్వత్రా రైతులు నష్టాల ఊబిలో కూరుకు పోతున్నారు.

చిత్తూరు: కరువుతో సతమతమయ్యే రాయలసీమ జిల్లాల్లో వేరుశనగ రైతుల జీవితాల్లో వెలుగు నింపాలన్న ఉన్నతమైన ఆశయంతో 1989లో అప్పటి ముఖ్యమంత్రి ఎన్‌టీ రామారావు   పీలేరులో శ్రీకృష్ణదేవరాయ నూనెవిత్తుల కర్మాగారం నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. పట్టణ శివారు ప్రాంతం బళ్లారి–తిరుపతి జాతీయ రహదారి పక్కనే 63.84 ఎకరాల్లో పరిశ్రమ నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. సీమలోని చిత్తూరు, కడప, అనంతపురంతోపాటు నెల్లూరు జిల్లా రైతులు పండించే వేరుశనగ పంటకు గిట్టుబాటు ధర కల్పించడం, ఉపాధి అవకాశాలను మెరుగు పర్చాలని సంకల్పించారు. ఆశయం ఉన్నతం కావడంతో పరి శ్రమ నిర్మాణం నిర్ణీత గడువులోపు పూర్తి చేసుకోవడంతో 1991లో అప్పటి రాష్ట్ర ముఖ్యమంత్రి కోట్ల విజయభాస్కర్‌రెడ్డి పరిశ్రమను ప్రారంభించారు. 1995 నాటికి పరిశ్రమ పనితీరు ఉచ్ఛస్థితికి చేరుకుంది. వేరుశనగ సేకరణ కోసం నాలుగు జిల్లాల పరిధిలో 360  సొసైటీలను ఏర్పాటు చేశారు. ఒక్కో సొసైటీలో 100 మంది రైతులు సభ్యులుగా ఉండే వారు. వీరి నుంచి వేరుశనగ, పొద్దుతిరుగుడు సేకరించే వారు. ఇక్కడే వేరుశనగ, పొద్దుతిరుగుడు నుంచి ప్యూరిఫైడ్‌ వేరుశనగ, సన్‌ప్లవర్‌ ఆయిల్‌ తయారు చేసేవారు. రోజుకు 200 లోడ్ల వేరుశనగ సేకరించి నూనె తీసేవారు. పాలకుల నిర్లక్ష్యానికి పర్యవేక్షకుల స్వార్థం జతకావడంతో లాభాల్లో పయనించిన పరిశ్రమకు బాలారిష్టాలు మొదలయ్యాయి. 1996 తరువాత నూనెవిత్తుల కర్మాగారం పనితీరు తిరోగమనంలోకి వెళ్లింది. పరిశ్రమ నిర్వహణ కోసం ఎన్‌డీడీబీ నుంచి తీసుకున్నరూ.40 కోట్లు రుణం తిరిగి చెల్లించలేక పోయారు.

నష్టాలను సాకుగా చూపుతూ 2003లో అప్ప టి సీఎం నారా చంద్రబాబునాయుడు ప్రభుత్వ హయాంలో పరిశ్రను మూసివేశారు. పరిశ్రమ మూత పడే నాటికి ఇక్కడ 139 మంది రెగ్యులర్‌ ఉద్యోగులతోపాటు 200 మంది కాంట్రాక్ట్‌ సిబ్బం ది పనిచేసేవారు. వీరంతా ఉపాధి కోల్పోయి రోడ్డున పడ్డారు. పరిశ్రమ మూత పడ్డప్పటి నుంచి పరిశ్రమకు కాపలాగా సెక్యూరిటీ గార్డులను నియమించారు. కొంతకాలం కేవీపల్లె మండలం తిమ్మాపురానికి చెందిన రఘురామిరెడ్డి నూనెవిత్తుల కర్మాగారం చైర్మన్‌గా పనిచేశారు. అనంతరం పరిశ్రమ పర్యవేక్షణ బాధ్యతలు ఐఏఎస్‌ల చేతుల్లోకి వెళ్లింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ చివరి ముఖ్యమంత్రి, పీలేరు నుంచి ప్రాతినిధ్యం వహించిన నల్లారి కిరణ్‌కుమార్‌రెడ్డి  పరిశ్రమను తెరిపించక పోగా.. మూతపడ్డ పరిశ్రమలో యంత్రాలు తుప్పుపడుతున్నాయంటూ మరో అడుగు ముందుకేశారు. రూ.2,15 కోట్లకు యం త్రాలను టెండర్‌ ద్వారా విక్రయించి చేతులు దులుపుకున్నారు. జిల్లాకే చెందిన చంద్రబాబు,   కిరణ్‌ కుమార్‌రెడ్డి నూనెవిత్తుల కర్మాగారం తెరిపిం చాలని ఒక్కరోజు కూడా తలచక పోవడంతో రైతులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తమ స్వార్థం కోసం పరిశ్రమ ఉనికిని దెబ్బతీశారని రైతులు మండిపడుతున్నారు. మూతవే యవద్దని కార్మికులు, రైతులు చేసిన ప్రయ త్నాలపై చంద్రబాబు ఆరోజు నీళ్లు చల్లారని  పేర్కొంటున్నారు. రైతులపై వీరికున్న శ్రద్ధ ఏపాటిదో ఇదే నిదర్శనమంటున్నారు. ప్రస్తుతం శిథిలావస్థకు చేరుకున్న శ్రీకృష్ణదేవరాయ నూనెవిత్తుల కర్మాగారంలో ఏపీ బాలికల గురుకులం, ప్రభుత్వ ఐటీఐలను నిర్వహిస్తున్నారు.

శంకుస్థాపన: 1989లో అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు  శ్రీకృష్ణదేవరాయ నూనెవిత్తుల కర్మాగారానికి శంకుస్థాపన చేశారు.
ప్రారంభం: 1991లో అప్పటి రాష్ట్ర ముఖ్య మంత్రి కోట్ల విజయభాస్కర్‌రెడ్డి కర్మాగా రాన్ని ప్రారంభించి రాయలసీమ, నెల్లూ రు జిల్లాల రైతులకు అంకితం చేశారు.
నిర్మాణ వ్యయం: రూ.40 కోట్లు. ప్రస్తుత విలువ రూ.100 కోట్ల పైమాటే.
పరిధి: చిత్తూరు, కడప, అనంతపురం, నెల్లూరు జిల్లాలు.
సొసైటీలు: నాలుగు జిల్లాల పరిధిలో 360 రైతు సొసైటీలను ఏర్పాటు చేశారు. ఒక్కో సొసైటీలో 100 మంది రైతులు సభ్యులుగా ఉండేవారు.
పరిశ్రమ ప్రాంతం:  పీలేరు మండలం, గూడరేవుపల్లె పంచాయతీ పరిధిలో పీలేరు–తిరుపతి మార్గంలో(పీలేరు పట్టణ శివారు ప్రాంతం).
విస్తీర్ణం: 63.84 ఎకరాలు
పరిశ్రమ మూత: నష్టాలను సాకుగా    చూపి 2003లో అప్పటి  ముఖ్యమంత్రి చంద్రబాబు జమానాలో పరిశ్రమను మూసివేయడంతో బాలారిష్టాలు మొదలయ్యాయి.
యంత్రాల విక్రయం: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ చివరి సీఎం నల్లారి కిరణ్‌కుమార్‌రెడ్డి హయాంలో 2014లో నూనెవిత్తుల కర్మాగారంలోని యంత్రాలు, ఆయిల్‌ ట్యాంకర్లను రూ.2.5 కోట్లకు అమ్మేయడంతో పరిశ్రమలోని భవనాలు శిథిలావస్థకు చేరుకున్నాయి.
పరిశ్రమ మూత నాటికి: నూనెవిత్తుల కర్మాగారం మూతపడ్డ నాటికి ఇక్కడ 139 మంది రెగ్యులర్‌ ఉద్యోగులు, 200 మంది కాంట్రాక్ట్‌ కార్మికులు పనిచేసేవారు. వీరంతా వీధిన పడ్డారు.

బాబు హయాంలోపరిశ్రమలకు మనుగడ ఉండదు
చంద్రబాబు  హయాంలో ప్రభుత్వ పరిశ్రమలకు మనుగడ ఉండదు. ఉన్న పరిశ్రమలను మూ సివేయడమే బాబు దక్షత. సీమ రైతుల కోసం ఉన్నతమైన ఆశయంతో నిర్మించిన నూనెవిత్తుల కర్మాగారం మూయించడం బాబుకే చెల్లు.–చింతల రమేష్‌రెడ్డి, రైతు, కలికిరి

రైతులను ఇబ్బందులకు గురిచేయడమే
కరువుతో అల్లాడుతున్న సీమ రైతులకు అండగా ఉండాలన్న సంకల్పంతో ఎన్‌టీఆర్‌ హయాంలో నూనెవిత్తుల కర్మాగారం ఏర్పాటు చేశారు. చంద్రబాబు అధికారంలోకి వచ్చాక వేరుశనగ రైతుల ఇక్కట్లు గుర్తించకుండా మూయించారు.–తిమ్మయ్య, రైతుతలపుల గ్రామం

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top