చారిత్రక మలుపు కోసమే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భవించిందని ఆ పార్టీ రాష్ట్ర హైపవర్ కమిటీ సభ్యుడు తమ్మినేని సీతారాం అన్నారు.
ఆమదాలవలస : చారిత్రక మలుపు కోసమే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భవించిందని ఆ పార్టీ రాష్ట్ర హైపవర్ కమిటీ సభ్యుడు తమ్మినేని సీతారాం అన్నారు. శనివారం ఆమదాలవలస పట్టణంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్రెడ్డి చిత్రపటానికి పూలమాల వేసి అంజలి ఘటించారు.
పార్టీ జెండాను ఆవిష్కరించారు. అనంతరం తమ్మినేని మాట్లాడుతూ వైఎస్ రాజశేఖరరెడ్డి ఫీజు రీయింబర్స్మెంటు, ఆరోగ్యశ్రీ అమలు చేసి పేదలకు ఉన్నత విద్య, కార్పొరేట్ వైద్యం చేరువ చేశారని చెప్పారు. రుణమాఫీ, ఉచిత విద్యుత్తో అన్నదాతను ఆదుకున్నారని గుర్తు చేశారు. తండ్రి ఆశయాన్ని నెరవేర్చేందుకు జగన్మోహన్ రెడ్డి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని స్థాపించారని చెప్పారు. రాజధాని పేరుతో చంద్రబాబు చేస్తున్న అవినీతి వెలకట్టలేదని ఆరోపించారు. చంద్రబాబుకు చిత్తశుద్ధి ఉంటే రాజధాని భూములపై సీబీఐ దర్యాప్తునకు సిద్ధం కావాలని సవాల్ విసిరారు.