‘పనిచేయండి.. మంచిపేరు తీసుకురండి’

Botsa Satyanarayana Appreciates CM YS Jagan Over AP Gram Ward Sachivalayam - Sakshi

మంత్రులు బొత్స సత్యనారాయణ, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి

సాక్షి, విజయవాడ : జాతిపిత గాంధీజీ కలలుగన్న గ్రామస్వరాజ్యం స్థాపనలో భాగంగానే ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి గ్రామ సచివాలయ వ్యవస్థను ఏర్పాటు చేశారని మున్సిపల్, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. ప్రజాసంకల్పయాత్రలో ప్రజలకు ఇచ్చిన హామీలన్నిటినీ నెరవేరుస్తున్నారని పేర్కొన్నారు. గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగాలకు ఎంపికైన వారికి సీఎం జగన్‌ సోమవారం నియామక పత్రాలు అందజేశారు. ఏప్లస్ కన్వెన్షన్‌ సెంటర్‌లో జరిగిన ఈ కార్యక్రమానికి మంత్రి బొత్స హాజరయ్యారు. ఈ సందర్భంగా ఉద్యోగాలకు ఎంపికైన వారిని ఉద్దేశించి ఆయన మాట్లాడారు. ప్రతిపక్షం ఎన్ని విమర్శలు చేసినా.. ప్రజలకు మేలు చేసే దిశగా తాము నిర్ధేశించుకున్న లక్ష్యాన్ని చేరుకునేలా ప్రభుత్వ విధానాలను ముందుకు తీసుకువెళ్తున్నామని తెలిపారు. ‘వ్యవస్థ మారాలంటే కొత్త పాలన రావాలని సీఎం జగన్‌ ఆకాంక్షించారు. ప్రస్తుతం ప్రభుత్వ కార్యక్రమాల్లో మీ అందరినీ భాగస్వామ్యం చేశాం. కొత్తగా ఉద్యోగాలు పొందిన వారంతా పూర్తి నిబద్ధతతో పనిచేయాలి’ అని బొత్స పేర్కొన్నారు. 

ఆ ఘనత సీఎం జగన్‌దే..
గ్రామ సచివాలయ వ్యవస్థ ఏర్పాటు చేసిన ఘనత సీఎం జగన్‌కే దక్కుతుందని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్నారు. అర్హులైన అందరికీ సంక్షేమ పథకాలు అందించాలన్నదే తమ ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు. సచివాలయ ఉద్యోగాల నియామకాలు పారదర్శకంగా జరిగాయని తెలిపారు. సీఎం జగన్‌ ఎంతో నమ్మకంతో ఏర్పాటు చేసిన వ్యవస్థలో.. ఉద్యోగులంతా ప్రభుత్వానికి మంచిపేరు తీసుకువచ్చేలా పనిచేయాలని పేర్కొన్నారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top