‘బ్లాక్’లో ‘బ్లూ' కిరోసిన్ | 'Blaklo' blue 'kerosene | Sakshi
Sakshi News home page

‘బ్లాక్’లో ‘బ్లూ' కిరోసిన్

Oct 30 2014 3:12 AM | Updated on Sep 2 2017 3:34 PM

‘బ్లాక్’లో ‘బ్లూ' కిరోసిన్

‘బ్లాక్’లో ‘బ్లూ' కిరోసిన్

{పజాపంపిణీ వ్యవస్థ ద్వారా లబ్ధిదారులకు అందాల్సిన రేషన్‌సరుకులు పక్కదారి పడుతున్నాయి. రేషన్ డీలర్ల అత్యాశ....

{పజాపంపిణీ వ్యవస్థ ద్వారా లబ్ధిదారులకు అందాల్సిన రేషన్‌సరుకులు పక్కదారి పడుతున్నాయి. రేషన్ డీలర్ల అత్యాశ, పలువురు అధికారుల అవినీతి కారణంగా సరుకులు యథేచ్ఛగా నల్లబజారుకు తరలిపోతున్నాయి. ప్రధానంగా కిరోసిన్‌ను అక్రమ మార్గంలో సొమ్ము చేసుకుంటున్నారు. అక్రమ తరలింపు సమాచారం అధికారులకు వచ్చినా సక్రమంగా స్పందించకపోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ క్రమంలోనే బుధవారం బుచ్చిరెడ్డిపాళెంలో పోలీసులు 500 లీటర్ల నీలికిరోసిన్, 350 లీటర్ల పామాయిల్, వందకు పైగా అమ్మహస్తం చక్కెర ప్యాకెట్లు పట్టుకున్నారు. రేషన్ సరుకుల అక్రమ తరలింపును అధికారులు పట్టించుకోకపోవడంతోనే పోలీసులు రంగంలోకి దిగినట్లు తెలిసింది.
 
 
 సాక్షి ప్రతినిధి, నెల్లూరు: జిల్లాలో 1872 రేషన్ దుకాణాలున్నాయి. వీటి  ద్వారా 8,18,766 మంది లబ్ధిదారులకు బియ్యం, చక్కెర, కిరోసిన్, పామాయిల్, గోధుమలు తదితర నిత్యావసర సరుకులు పంపిణీ చేస్తారు. కేవలం కిరోసిన్ సరఫరా చేసేందుకు అదనంగా మరో 100 దుకాణాలు ఉన్నాయి. జిల్లాలోని లబ్ధిదారులకు నెలకు 14వేల కిలో లీటర్ల కిరోసిన్ వస్తుంది. ఈ కిరోసిన్‌ను 17మంది డీలర్లు దిగుమతి చేసుకుని జిల్లాలోని రేషన్ దుకాణాలకు సరఫరా చేస్తుంటారు. గ్రామీణ ప్రాంతాల్లో 40శాతం మంది, పట్టణ ప్రాంతాల్లో 20శాతం మంది మాత్రమే కిరోసిన్ వినియోగిస్తున్నారు. అయితే వీరికి సైతం కిరోసిన్ అందడం లేదనే విమర్శలున్నాయి. ప్రధాన డీలర్లు, రేషన్‌డీలర్లు చెరిసగం పంచుకుంటున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి.

 పక్కదారి పడుతోందిలా....
 కిరోసిన్ సరఫరా చేసే డీలర్లు కొందరు దిగుమతైన ట్యాంకర్లను హైజాక్ చేస్తుంటారు. ఆట్యాంకర్లను గుట్టుచప్పుడు కాకుండా రహస్య ప్రదేశాలకు తరలిస్తారు. జిల్లాలో అటు వంటి రహస్య ప్రదేశాలు నెల్లూరురూరల్, కోవూరు, బుచ్చిరెడ్డిపాళెం, కావలి, నాయుడుపేట తదితర ప్రాంతాల్లో ఉన్నాయి. ఊరు చివరో.. పాతభవనాలనో అక్రమార్కులు అద్దె కు తీసుకుంటున్నట్లు సమాచారం. అదే విధం గా కొన్ని ప్రాంతాల్లో గోదాములు, రేకుల షెడ్లు ఏర్పాటు చేసుకున్నట్లు తెలిసింది.

ఆ రహస్య ప్రదేశాల నుంచి కిరోసిన్ విక్రయాలు సాగిస్తారు. లబ్ధిదారుల కోసం లీటరు రూ.18 వంతున ప్రభుత్వం సరఫరా చేస్తుంటే రూ.40 నుంచి రూ.50 చొప్పున బ్లాక్ మార్కెట్‌లో విక్రయించి సొమ్ముచేసుకుంటున్నారు. కిరోసిన్‌ను నిల్వచేసే రహస్యప్రదేశాలను రెండు నెలలకొకసారి మార్చేస్తున్నట్లు సమాచారం.

 అక్రమ సొమ్ములో అందరికీ భాగమే...
 జిల్లా ప్రజల అవసరాల కోసం ప్రభుత్వం సరఫరా చేస్తున్న నీలి కిరోసిన్‌ను కొందరు అధికారులు, డీలర్లు పంచుకున్నట్లు తెలిసింది. ప్రభుత్వానికి చెల్లించాల్సిన మొత్తాన్ని చెల్లించి బ్లాక్ మార్కెట్ ద్వారా వచ్చిన ఆదాయాన్ని కొందరు తహశీల్దార్లు, ఆర్‌ఐ, డీటీ, వీఆర్వో, సీఎస్ డీటీలు పంచుకుంటున్నట్లు బుచ్చిరెడ్డిపాళెంలో పట్టుబడిన ఓ వ్యక్తి వెల్లడించారు.

రూట్ ఆఫీసర్‌ను నియమించి కిరోసిన్ సక్రమంగా సరఫరా అవుతుందా? లేదా? అనేది పరిశీలించాల్సి ఉంది. అదే విధంగా ప్రతి ట్యాంకర్‌కు జీపీఎస్ సిస్టం ఉండాలి. అయితే ఏ ట్యాంకరుకు ఈ సిస్టం లేదని అధికారులే చెబుతున్నారు.

 సమాచారమిచ్చినా పట్టని అధికారులు
 బుచ్చిరెడ్డిపాళెం: ఇటీవల బుచ్చిరెడ్డిపాళెం ప్రాంతంలోని వివిధ రేషన్‌షాపుల నుంచి సేకరించిన 420 లీటర్ల కిరోసిన్‌ను 12 క్యాన్లలో నింపి ఓ ఆటోలో తరలిస్తుండగా బీజేపీ దళిత మోర్చా నాయకుడు తుళ్లూరు ఆనంద్ అడ్డుకున్నాడు. వెంటనే తహశీల్దార్ రామలింగేశ్వరరావుకు ఫోన్‌లో సంప్రదించగా ఊహించని సమాధానం ఎదురైంది.

లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేస్తేనే స్పందిస్తామనడంతో పాటు ‘నువ్వొక్కడివేనా..నేను వందల మందికి సమాధానం చెప్పాలి’ అని నిర్లక్ష్యంగా మాట్లాడారని ఆనం ద్ వాపోయాడు. ఇదే క్రమంలో ప్రతి నెలా రేషన్‌సరుకులు నల్లబజారుకు తరలిపోతున్నాయని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇప్పటికైనా అధికారులు ప్రత్యేక దృష్టిపెట్టి సరుకులు నల్లబజారుకు తరలకుండా చూడాలి.
 
 సకాలంలో
 స్పందించకపోవడం నిజమే:

 కిరోసిన్ పట్టుకున్నప్పుడు స్పందించడంలో ఆలస్యం జరిగిన మాట వాస్తవమే. ఇలాంటి ది పునరావృతం కాకుండా చూస్తాం. రేషన్‌షాపుల్లో నోస్టాక్ బోర్డుపెట్టి సరుకులను బ్లాక్‌మార్కెట్‌కు తరలిస్తే చర్యలు తప్పవు. తరచూ రేషన్‌షాపులను తనిఖీ చేస్తాం.    
 - రామలింగేశ్వరరావు, తహశీల్దార్

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement