రేషన్‌ డీలర్ల కమీషన్‌ రెండింతలు పెంపు | Telangana government sweet talk to ration dealers Telangana Ration Dealers Commission Increase | Sakshi
Sakshi News home page

రేషన్‌ డీలర్ల కమీషన్‌ రెండింతలు పెంపు

Oct 1 2023 3:43 AM | Updated on Oct 1 2023 3:43 AM

Telangana government sweet talk to ration dealers Telangana Ration Dealers Commission Increase - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: గతంలో ఇచ్చిన హామీ మేరకు రేషన్‌ డీలర్ల కమీషన్‌ను ప్రభుత్వం రెండింతలు చేసింది. టన్ను బియ్యంపై రూ. 700గా ఉన్న కమీషన్‌ను రూ. 1,400 రూపాయలకు పెంచుతూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ సందర్భంగా రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్‌ హైదరాబాద్‌లోని తన నివాసంలో రేషన్‌ డీలర్ల జేఏసీ ప్రతినిధులకు ప్రభుత్వ ఉత్తర్వుల ప్రతిని అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ పెంపు తక్షణమే అమల్లోకి రానున్నట్లు మంత్రి తెలిపారు. ఈ ఉత్తర్వుల ద్వారా ఏటా డీలర్ల కమిషన్‌ రూ. 303 కోట్లకు చేరనుందని, అందులో రూ. 245 కోట్లను రాష్ట్ర ప్రభుత్వమే సొంతంగా భరిస్తుందని వెల్లడించారు.

కరోనా వంటి సంక్షోభ సమయంలో రేషన్‌ డీలర్లు అందించిన సేవలకు గౌరవంగా సీఎం డీలర్ల కమీషన్‌ను రెండింతలు చేసినట్లు తెలిపారు. రాష్ట్రంలో ఏ ఒక్కరూ ఆకలితో అలమటించకూడదనే ఉద్దేశ్యంతో సీఎం కేసీఆర్‌ కేంద్రం అందించే కమీషన్‌కన్నా అదనంగా రూ.950 ఒక్కో టన్నుకు అందిస్తున్నారని తెలిపారు. అలాగే కేంద్రం జాతీయ ఆహార భద్రతా కార్డులు ఇవ్వని దాదాపు 90 లక్షల మంది పేదలకు రాష్ట్ర ప్రభుత్వమే రాష్ట్ర ఆహార భద్రత కింద పూర్తి రేషన్‌ను అదనంగా అందజేస్తుందని తెలిపారు.

కేంద్ర ప్రభుత్వం సరఫరా చేసే 5కిలోల బియ్యానికి అదనంగా మరో కిలోని చేర్చి ఎన్‌ఎఫ్‌ఎస్‌సీ కార్డులకు కూడా ఒక్కొక్కరికి 6 కిలోల బియ్యాన్ని అందచేస్తోందని తెలిపారు. ఇందుకోసం ఏటా రూ. 3వేల కోట్లను పేద ప్రజల సంక్షేమం కోసం రాష్ట్ర ప్రభుత్వం ఖర్చుచేస్తోందన్నారు. ఈ సందర్భంగా రేషన్‌ డీలర్ల ప్రతినిధులు మంత్రిని సన్మానించి తమ కృతజ్ఞతలు తెలియజేసారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌కు, మంత్రులు హరీశ్‌రావు, గంగుల కమలాకర్‌కు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement