
సాక్షి, వైఎస్సార్ జిల్లా: రాఫేల్ కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును స్వాగతిస్తూ రాష్ట్ర కాంగ్రెస్ శాఖ ప్రజలకు క్షమాపణలు చెప్పాలని బీజేపీ నాయకుడు, మాజీ మంత్రి పైడికొండల మాణిక్యాలరావు డిమాండ్ చేశారు. పార్టీ జిల్లా కార్యాలయంలో శుక్రవారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. రాఫేల్ విషయంలో కాంగ్రెస్ పార్టీ అధినేత రాహుల్గాంధీ ఉద్దేశపూర్వకంగా దుష్ప్రచారం చేశారని మండిపడ్డారు. చౌకీదార్ చోర్ హై అని రాహుల్గాంధీ అనడంపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసిందని గుర్తు చేశారు. రాఫేల్ తీర్పుపై శనివారం రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ ఆధ్వర్యంలో ర్యాలీలు చేయాలని నిర్ణయించామని తెలిపారు. మరోవైపు చంద్రబాబు ఇసుక దీక్షపై స్పందిస్తూ.. గతంలో ఉచిత ఇసుక పేరుతో టీడీపీ నేతలు లక్షల కోట్ల రూపాయల అవినీతికి పాల్పడ్డారని విమర్శించారు. చిత్తశుద్ధిలేని దీక్షలు చేస్తూ చంద్రబాబు ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని వ్యాఖ్యానించారు.