రాష్ట్రానికి ప్రత్యేక హోదా విషయమై కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు అసంబద్ద వ్యాఖ్యలు చేస్తుంటే కాంగ్రెస్కు పట్టిన గతే బీజేపీకి పడుతుందని ఆంధ్రప్రదేశ్ రెవెన్యూ సర్వీసెస్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు బొప్పరాజు వెంకటేశ్వర్లు హెచ్చరించారు.
ఒంగోలు టౌన్: రాష్ట్రానికి ప్రత్యేక హోదా విషయమై కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు అసంబద్ద వ్యాఖ్యలు చేస్తుంటే కాంగ్రెస్కు పట్టిన గతే బీజేపీకి పడుతుందని ఆంధ్రప్రదేశ్ రెవెన్యూ సర్వీసెస్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు బొప్పరాజు వెంకటేశ్వర్లు హెచ్చరించారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా విషయమై ప్రతిపక్షంలో ఒకవిధంగా, అధికారంలోకి వచ్చిన తరువాత మరోవిధంగా మాట్లాడటాన్ని ప్రజలు గమనిస్తూనే ఉన్నారన్నారు.
సోమవారం ఒంగోలు వచ్చిన సందర్భంగా స్థానిక రెవెన్యూ భవన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్రానికి ప్రత్యేక హోదాపై ఏవిధంగా అర్హత లేదనడం ఒక ఉద్యమకారులుగా ఉద్యోగులే కాదు ప్రజలను కూడా తీవ్రంగా బాధిస్తోందన్నారు. కర్ణాటక రాష్ట్రం నుంచి రాజ్యసభకు ఎన్నికైనప్పటికీ ఆంధ్రప్రదేశ్కు చెందిన ఒక బాధ్యతగల వ్యక్తిగా ఇక్కడి ప్రజలు గుర్తిస్తారన్న విషయాన్ని వెంకయ్యనాయుడు గమనించాలన్నారు. భవిష్యత్ తరాలను దృష్టిలో ఉంచుకొని రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధించుకునేందుకు ఎలాంటి ఉద్యమానికైనా తాము సిద్ధంగా ఉన్నామని బొప్పరాజు స్పష్టం చేశారు.