సాక్షి, అమరావతి: పవిత్ర రంజాన్ మాసం ఈద్ ఉల్ ఫితర్గా ముగిసిన శుభవేళ ముస్లిం సోదరులకు గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు రాజ్భవన్ ఆదివారం ఒక ప్రకటన విడుదల చేసింది. క్రమశిక్షణ, దాతృత్వం, ధార్మిక చింతనల కలయికగా విశ్వ వ్యాప్తంగా రంజాన్ మాసం పవిత్రతను ఆపాదించుకుందన్న గవర్నర్, పవిత్ర ఖురాన్ బోధనలు యుగయుగాలుగా మానవాళిని ప్రభావితం చేస్తున్నాయన్నారు.
రంజాన్ మాస పవిత్రతతో ప్రతి వ్యక్తి మానసిక పరివర్తన చెంది ప్రేమమూర్తిగా మార్పు చెందుతారని, ఈ మాసంలో ఆధ్యాత్మిక ఆరాధనతో అనుబంధం మరింత బలపడుతుందని పేర్కొన్నారు. క్రమశిక్షణను అనుసరిస్తూ శాంతి, సౌభ్రాతృత్వాన్ని లోకానికి చాటడంలో ఈ మాసం ప్రత్యేకతగా నిలిచిందని, కఠోర ఉపవాస వ్రతం సహనాన్ని పెంచుతుందని వివరించారు. సర్వ మానవాళి సమానత్వాన్ని చాటుతూ, దాతృత్వాన్ని అలవరచే రంజాన్ పండుగ వేళ ఇస్లాంను గౌరవించే ప్రతి ఒక్కరి కుటుంబంలో ఆనందం వెల్లి విరియాలని గవర్నర్ ఆకాంక్షించారు.


