టీడీపీ, బీజేపీలు తెలంగాణను అడ్డుకోవచ్చు!


అప్రమత్తంగా ఉండాలి: తెలంగాణ కాంగ్రెస్ ఎంపీలు

 సాక్షి, న్యూఢిల్లీ: బీజేపీ, టీడీపీలు కలిసి తెలంగాణను అడ్డుకునే అవకాశం ఉందని తెలంగాణ కాంగ్రెస్ ఎంపీలు అనుమానం వ్యక్తం చేశారు. ఈ విషయంలో ఆ పార్టీల తెలంగాణ నేతలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. టీడీపీ, బీజేపీల స్నేహహస్తం గురువారం లోక్‌సభలో సీమాంధ్ర ఎంపీల సస్పెన్షన్ సమయంలో స్పష్టంగా బయటపడిందన్నారు. తెలంగాణ ప్రాంతానికి చెందిన కాంగ్రెస్ ఎంపీలు గుత్తా సుఖేందర్‌రెడ్డి, కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి, పొన్నం ప్రభాకర్, రాజయ్యలు గురువారం ఇక్కడ విలేకరులతో మాట్లాడారు.


 


తెలంగాణకు అనకూలమని లేఖ ఇచ్చిన టీడీపీ అధినేత చంద్రబాబు సొంత పార్టీ ఎంపీలతో సమైక్యాంధ్ర కోసం ఢిల్లీలో నాటకాలాడిస్తున్నారని దుయ్యబట్టారు.చంద్రబాబు చేయనున్న ఆత్మగౌరవ యాత్రకు ఆత్మవంచన యాత్రగా నామకరణం చేసుకుంటే బాగుటుందని సూచించారు. తెలంగాణ కోసం నిరసనకు దిగిన తమను సస్పెన్షన్ చేస్తే మౌనం దాల్చిన బీజేపీ, ఇప్పుడు సమైక్యాంధ్ర కోసం నిరసన తెలిపినవారి సస్పెన్షన్ అడ్డుకోవడం ఎంతవరకు సబబని ప్రశ్నించారు.

 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top