
హిందువుల ఆరాధ్యదైవం శ్రీరాముడిపై అనుచిత వాఖ్యలు చేసి, హిందువుల మనోభావాలను దెబ్బతీసిన..
సాక్షి, అనతపురం : హిందువుల ఆరాధ్యదైవం శ్రీరాముడిపై అనుచిత వాఖ్యలు చేసి, హిందువుల మనోభావాలను దెబ్బతీసిన సినీ విమర్శకుడు కత్తి మహేష్ను రెండు తెలుగు రాష్ట్రాల నుంచి బహిష్కరించాలని భజరంగదళ్ నాయకులు డిమాండ్ చేశారు. దీనిపై ఈ రోజు(మంగళవారం) రెవెన్యూ అధికారులకు వారు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. మత విద్వేషాలను రెచ్చగొట్టే ఉద్దేశంతో మాట్లాడుతున్న కత్తి మహేష్ హిందువుల మనోభావాలను కించపరుస్తున్నారన్నారు. సీతారాముల చరిత్రను కించపరిచే విధంగా మాట్లాడుతున్న కత్తిపై కేసు నమోదు చేయాలన్నారు.
హిందూ ధర్మగ్రహ యాత్రకు తెలంగాణలో అవకాశం కల్పించి, పరిపూర్ణానంద స్వామీజీకి రక్షణ కల్పించాలని డిమాండ్ చేశారు. చర్చావేదికలు పెట్టి మత విశ్వాసాలపై డిబెట్ పెడుతున్న టీవీ9 చానల్ను సైతం మూసివేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో భజరంగదళ్ జిల్లా ప్రధాన కార్యదర్శి కసాపురం రవి, సోమశేఖర్, రమేష్, ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు. కత్తి మహేశ్పై హైదరాబాద్ పోలీసులు నగర బహిష్కరణ వేటు వేసిన విషయం తెలిసిందే.
వినతిపత్రం అందజేస్తున్న భజరంగదళ్ నాయకులు