
విశాఖలో భాగస్వామ్య సదస్సును ప్రారంభిస్తున్న అరుణ్జైట్లీ. వెంకయ్య,చంద్రబాబు
జాతీయ స్థాయి కంటే ఎక్కువ వృద్ధి రేటు సాధించే సామర్థ్యం ఉన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేకంగా ఆర్థిక సాయం అందిస్తామని కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ హామీ ఇచ్చారు.
• సీఐఐ భాగస్వామ్య సదస్సు ప్రారంభంలో అరుణ్ జైట్లీ
• ముందు చూపుతో వెళ్తున్నాం : ముఖ్యమంత్రి చంద్రబాబు
విశాఖపట్నం నుంచి సాక్షి ప్రతినిధి: జాతీయ స్థాయి కంటే ఎక్కువ వృద్ధి రేటు సాధించే సామర్థ్యం ఉన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేకంగా ఆర్థిక సాయం అందిస్తామని కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ హామీ ఇచ్చారు. దేశ జీడీపీ కంటే ఏటా మూడు నుంచి నాలుగు శాతం అధిక వృద్ధిరేటును నమోదు చేసే శక్తి సామర్థ్యాలు ఏపీకి ఉండటంతో అధిక నిధులను కేటాయిస్తున్నట్లు చెప్పారు. రాష్ట్ర విభజన సమయంలో కొంత నష్టం జరిగినప్పటికీ రెండున్నరేళ్లలో ఏపీ అభివృద్ధి దిశగా ముందుకు దూసుకుపోతోందన్నారు. రెండు రోజుల పాటు జరగనున్న 23వ సీఐఐ (కాన్ఫడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ) పార్ట్నర్ షిప్ సమ్మిట్ను శుక్రవారం ఆయన విశాఖపట్నంలో ప్రారంభించారు. ఈసందర్భంగా మాట్లాడుతూ రాష్ట్రంలో తయారీ, సేవల రంగాల్లో పెట్టుబడులకు అపార అవకాశాలున్నాయన్నారు.
రాజదాని నిర్మాణంతో పాటు, పోలవరం తదితర భారీ నీటిపారుదల ప్రాజెక్టులు, కోస్టల్ ఎకానమీ, టూరిజం వంటి రంగాల్లో పెట్టుబడులకు అవకాశాలు మెండుగా ఉన్నాయని చెప్పారు. భారతీయుల ఆలోచనా ధోరణి క్రమేపీ మారుతోందని, అభివృద్ధి కోసం సంస్కరణలను స్వాగతిస్తున్నారన్నారు. అందుకే జీఎస్టీ, పెద్ద నోట్ల రద్దు వంటి కీలక సంస్కరణలను ప్రజల మద్దతుతో ప్రవేశపెట్టగలిగామన్నారు. పెద నోట్ల రద్దుతో దేశ ఆర్థిక వ్యవస్థకు సమాంతరంగా నడుస్తున్న ఇతర ఆర్థిక వ్యవస్థలను అంతమొందించామని, డిజిటల్ బ్యాంకింగ్ ద్వారా బ్లాక్మనీ లావాదేవీలకు అడ్డుకట్ట పడుతుందన్నారు.
ఈ కీలక సంస్కరణలతో భవిష్యత్తులో కేంద్రానికి భారీగా ఆదాయం పెరగనుందన్నారు. కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి వెంకయ్యనాయుడు మాట్లాడుతూ ప్రపంచమంతా పెట్టుబడుల కోసం ఇండియా వైపు చూస్తుంటే ఇండియా మొత్తం ఆంధ్రప్రదేశ్ వైపు చూస్తోందన్నారు. కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ మాట్లాడుతూ రాష్ట్రంలోని వివిధ పథకాల కోసం కేంద్రం ఇప్పటికే రూ.1.43 లక్షల కోట్లు ఇచ్చిందని చెప్పారు. వీరితోపాటు కేంద్రమ ంత్రులు నిర్మలా సీతారామన్, అశోక్ గజపతిరాజు, సురేష్ ప్రభు కూడా మాట్లాడారు.
2050 నాటికి ట్రిలియన్ పెట్టుబడులే లక్ష్యం: ముఖ్యమంత్రి
వచ్చే ఏడాదికి రూ.లక్ష కోట్ల పెట్టుబడులను ఆకర్షించడమే తమ లక్ష్యమని ముఖ్యమంత్రి ఎన్ చంద్రబాబు నాయుడు తెలిపారు. 2050 నాటికి ఒక ట్రిలియన్ పెట్టుబడులు రాబట్టాలనే పట్టుదలతో ముందు చూపుతో వెళ్తున్నామని చెప్పారు. రాష్ట్ర వృద్ధి రేటు గత ఏడాది దేశంలోనే నెంబర్ వన్గా ఉందన్నారు. సీఐఐ సదస్సులో భాగంగా ‘సన్రైజ్ ఆంధ్రప్రదేశ్–రెడీ ఫర్ ద వరల్డ్, రెడీ ఫర్ ద ఫ్యూచర్’ అంశంపై ముఖ్యమంత్రి కీలకోపన్యాసం చేశారు. ప్రపంచంలోనే ఐదు అత్యుత్తమ నగరాల్లో ఒకటిగా రాజధాని ‘అమరావతి’ని నిర్మించనున్నట్లు తెలిపారు. గత ఏడాది కేంద్ర ప్రభుత్వం కేవలం 7.5 శాతం మాత్రమే వృద్ధి రేటు సాధించిందని, ఆంధ్రప్రదేశ్ మాత్రం 10.99 శాతం వృద్ధి రేటుతో ముందుందని తెలిపారు.
గతేడాది సీఐఐ భాగస్వామ్య సదస్సులో జరిగిన ఒప్పందాలతో పాటు మిగిలినవి కూడా కలుపుకుంటే మొత్తం 927 ప్రాజెక్టులు రాష్ట్రానికి వచ్చాయన్నారు. వీటి మొత్తం పెట్టుబడి విలువ రూ. 5,30,715 కోట్లు కాగా, 10,05,506 మందికి ఉద్యోగాలు లభించనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో జీఎంఆర్ గ్రూపు చైర్మన్ జి.ఎం.రావు, సుజ్లాన్ ఎనర్జీ చైర్మన్ తుల్సి తంతి, అపోలో హాస్పిటల్స్ ఎగ్జిక్యూటివ్ వైస్ చైర్మన్ శోభన కామినేని, సీఐఐ ప్రెసిడెంట్ నౌషధ్ ఫోరబ్స్, కేంద్ర మంత్రి వైఎస్ చౌదరి, రాష్ట్ర ముఖ్య కార్యదర్శి ఎస్పి టక్కర్, పరిశ్రమలశాఖ కార్యదర్శి సాల్మన్ అరోఖ్యారాజ్తో పాటు 50 దేశాలకు చెందిన అధికారులు, 2,500 మందికిపైగా పారిశ్రామిక ప్రతినిధులు పాల్గొన్నారు.
రూ.7,000 కోట్ల పెట్టుబడులు: బిర్లా
ఏపీతో బిర్లా గ్రూపునకు సుదీర్ఘ అనుబంధముందని ఆదిత్య బిర్లా గ్రూపు చైర్మన్ కుమార మంగళం బిర్లా పేర్కొన్నారు. ఇప్పటి వరకు సుమారు రూ.10,000 కోట్ల పెట్టుబడి పెట్టడం ద్వారా 11,000 మందికి ఉపాధి కల్పించామని చెప్పారు. రెండేళ్లలో మరో 7,000 కోట్ల పెట్టుబడులు పెట్టడానికి సిద్ధంగా ఉన్నామని ప్రకటించారు. తాడిపత్రిలో ఉన్న సిమెంట్ పరిశ్రమను రూ.3,000 కోట్లతో విస్తరించడంతో పాటు, అనంతపురం జిల్లాలో రూ.3,000 కోట్లతో గ్రీన్ఫీల్డ్ సిమెంట్ ఫ్యాక్టరీ ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. రూ.1,300 కోట్లతో ఐడియా 3జీ, 4జీకి సంబంధించి 2,500 సెల్సైట్స్ను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. భారత్ ఫోర్జ్ సీఎండీ బాబా కళ్యాణి మాట్లాడుతూ రూ.1,400 కోట్లతో నెల్లూరులో ఆటో కాంపోనెంట్ యూనిట్, అనంతపురంలో రూ.1,300 కోట్లతో డిఫెన్స్, ఏరోస్పేస్ టెక్నాలజీ యూనిట్ ఏర్పాటు చేయాలని గత ఏడాది సదస్సులో కుదుర్చుకున్న ఒప్పందాలను అమలు చేస్తామని తెలిపారు.