ఆర్టీసీ కార్గోలో దోపిడీ!

APSRTC Cargo Wing Irregularities - Sakshi

వినియోగదారుల నుంచి భారీగా వసూళ్లు

అధికార పార్టీ ఎమ్మెల్యే సంస్థ ఇష్టారాజ్యం

ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నా పట్టించుకోని యాజమాన్యం

సాక్షి, అమరావతి: ఏపీఎస్‌ ఆర్టీసీ కార్గోలో వినియోగదారుల నుంచి ప్రైవేటు సిబ్బంది ఇష్టారాజ్యంగా డబ్బులు వసూలు చేస్తున్నారు. ఆర్టీసీ ద్వారా పార్శిల్‌ సేవలు బుక్‌ చేస్తున్న వారికి చుక్కలు చూపిస్తున్నారు. కార్గో వ్యాపారాన్ని రెండేళ్ల క్రితం ప్రైవేటు సంస్థకు యాజమాన్యం అప్పగించింది. టీడీపీ ఎమ్మెల్యేకు చెందిన ఈ ప్రైవేటు సంస్థకు కార్గో వ్యాపారం మొత్తం కట్టబెట్టారు. కార్గో వ్యాపారం ఏడాదికి రూ.కోటి జరిగితే, ఒప్పందం ప్రకారం 4.95 శాతం కమీషన్‌ చొప్పున ప్రైవేటు సంస్థకు రూ.4.95 లక్షలు చెల్లించాలి. (ఆర్టీసీని వాడేద్దాం!)

గత 25 ఏళ్ల నుంచి ఆర్టీసీ బస్సుల్లో పార్శిల్‌ వ్యాపారం ఏఎన్‌ఎల్‌ సంస్థ నిర్వహించింది. ఆ సంస్థ ఏడాదికి ఆర్టీసీకి రూ.9 కోట్ల వరకు చెల్లించేది. 2017 ఆగస్టులో ఏఎన్‌ఎల్‌ నుంచి కార్గో వ్యాపారం మొత్తం ఆర్టీసీ స్వాధీనం చేసుకుంది. పార్శిల్‌ వ్యాపారాన్ని వోల్వో బస్సుల్లో ప్రయోగాత్మకంగా ప్రవేశపెట్టింది. ఒక్క నెలలోనే రూ.13 కోట్ల ఆదాయం వచ్చింది. ఆర్టీసీలో 10,700 బస్సుల్లోనూ పార్శిల్‌ సేవలను ఆరంభించడంతో ఆదాయం రూ.30 కోట్లకు చేరింది. (యాత్రల పేరిట ఆర్టీసీపై మరో పిడుగు..)

పత్తాలేని పర్యవేక్షణ
కార్గో వ్యాపారాన్ని ప్రైవేటు సంస్థకు అప్పగించినా ఆర్టీసీ అధికారులే స్వయంగా పర్యవేక్షించాలి. కానీ ప్రైవేటు సంస్థ అధికార పార్టీ ఎమ్మెల్యేకు చెందినది కావడంతో ఆర్టీసీ అధికారులు అటువైపు కన్నెత్తి కూడా చూడడం లేదు. దీంతో వినియోగదారుల నుంచి భారీగా వసూలు చేస్తున్నారన్న ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. పార్శిల్‌ సేవలకు నిర్ణీత రుసుం కంటే అధికంగా వసూలు చేస్తున్నా పట్టించుకునే వారే లేకపోవడం గమనార్హం. ఆర్టీసీ ద్వారా బుక్‌ చేసుకునే ప్రతి పార్శిల్‌కు బీమా సౌకర్యం కల్పిస్తామని అధికారులు ఆర్భాటంగా ప్రకటించారు. అయితే, అది ఎక్కడా అమలు కావడం లేదు. 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top