రివ్యూ పిటిషన్ వేయనున్న ఏపీపీఎస్సీ! | Sakshi
Sakshi News home page

రివ్యూ పిటిషన్ వేయనున్న ఏపీపీఎస్సీ!

Published Wed, Oct 9 2013 4:21 AM

APPSC will be produced review petition by Supreme court orders

సాక్షి, హైదరాబాద్: గ్రూప్-1 ప్రిలిమ్స్‌లో వివాదాస్పద 6 ప్రశ్నలు తొలగించి మళ్లీ మెరిట్ జాబితా రూపొందించి మెయిన్స్ పరీక్షలు నిర్వహించాలన్న సుప్రీంకోర్టు ఉత్తర్వులపై రివ్యూ పిటిషన్ వేయాలని ఏపీపీఎస్సీ యోచిస్తోంది. అయితే అంతకంటే ముందు, సుప్రీంకోర్టు ఇచ్చిన  తీర్పు కాపీ అందాక న్యాయ సలహా తీసుకోవాలనే నిర్ణయానికి వచ్చింది. ఆ తరువాత తదుపరి చర్యలు చేపడతామని ఏపీపీఎస్సీ చైర్మన్ చిత్తరంజన్ బిస్వాల్ పేర్కొన్నారు. మరోవైపు ఇప్పటికే ఇంటర్వ్యూలు పూర్తయిన 606 మందిలో పలువురు అభ్యర్థులు కోర్టు తీర్పుపై ఆందోళన చెందుతూ మంగళవారం ఏపీపీఎస్సీకి వచ్చారు. చైర్మన్‌ను కలిసి  గోడు వెళ్లబోసుకున్నారు.
 
  మెయిన్స్ నిర్వహించకముందే ఆ ప్రశ్నలను తొలగిస్తే ఇబ్బంది ఉండేది కాదని, తామంతా మెయిన్స్ కోసం నెలల తరబడి వ్యయ ప్రయాసలకు ఓర్చుకొని ప్రత్యేక శిక్షణ తీసుకొని సిద్ధం అయ్యామని తెలిపారు. ఫలితాలు మాత్రమే వెల్లడించాల్సిన సమయంలో మళ్లీ మెయిన్స్, ఇంటర్వ్యూలు నిర్వహించాలన్న   కోర్టు తీర్పు నేపథ్యంలో ప్రత్యామ్నాయాలపై దృష్టి సారించాలని కోరారు.అలాగే కోర్టు తీర్పు ప్రకారం ఆ ఆరు ప్రశ్నలను తొలగించి రూపొందించే మెరిట్ జాబితాలో అదనంగా వచ్చిన వారికి మెయిన్స్ రాత పరీక్షలు, ఇంటర్వ్యూలు నిర్వహించాలని వారు కోరారు.

Advertisement
Advertisement