విజయనగరం: కొత్త చరిత్ర

AP Peoples Beliefs YS Jaganmohan Reddy - Sakshi

తొమ్మిది అసెంబ్లీ, మూడు పార్లమెంట్‌ స్థానాల్లో విజయం

చరిత్రను తిరగరాసిన వైఎస్‌ జగన్‌ ప్రభంజనం

కలిసొచ్చిన గెలుపుగుర్రాలు, బొత్స వ్యూహం

సాక్షి, విజయనగరం: వైఎస్సార్‌సీపీ జిల్లాలో సునామీ సృష్టించింది. అన్ని స్థానాలనూ క్లీన్‌స్వీప్‌ చేసి చరిత్రను తిరగరాసింది. జిల్లా అవిర్భావం తర్వాత ఒకే పార్టీ అన్ని స్థానాలు గెలవడం ఇది రెండోసారి. 1994 సాధారణ ఎన్నికల్లో జిల్లాలో అప్పటికి ఉన్న 12 అసెంబ్లీ స్థానాలు, విజయనగరం, పార్వతీపురం పార్లమెంట్‌ స్థానాలను ఎన్టీఆర్‌ కైవసం చేసుకున్నారు. ఆ రికార్డును ఇప్పుడు బద్దలుకొట్టి జిల్లాలో ఉన్న తొమ్మిది అసెంబ్లీ, మూడు పార్లమెంట్‌ స్థానాల్లో వైఎస్సార్‌సీపీ జెండా ఎగురవేసింది.

పార్టీ అధినేత జగన్‌మోహన్‌రెడ్డిపై ప్రజలకు ఉన్న నమ్మకం వల్లే అన్ని స్థానాల్లోనూ విజయకేతనం ఎగురవేశారు. 2014 తర్వాత ఆయనపై జిల్లా వాసులు నమ్మకం పెంచుకున్నారు. విశ్వసనీయతతో కూడిన రాజకీయాలు చేయడం.. అధికారంలోకి వస్తే ప్రజలకు సేవ చేస్తానని పదేపదే చెప్పడం.. ప్రత్యేక హోదా కోసం అలుపెరగని పోరాటం చేయడంతో  జిల్లాలో అన్ని వర్గాల ప్రజలు ఆయనను నమ్మారు.

దీనికితోడు గతేడాది ఆగస్టు నుంచి నవంబరు నెల వరకు జిల్లాలో ఉన్న తొమ్మిది నియోజకవర్గాల్లో ఆయన పాదయాత్ర చేసి ప్రజలకు మరింత దగ్గరయ్యారు. అదే సమయంలో సాలూరు నియోజకవర్గం నుంచి విశాఖ వెళ్లిన జగన్‌పై హత్యాయత్నం జరిగింది. ఆ కుట్ర నుంచి బయటపడి తిరిగి జిల్లాలో అదే చిరునవ్వుతో పాదయాత్ర చేసిన జగన్‌ మోహన్‌రెడ్డితో ప్రజలు ఎమోషనల్‌గా కనెక్ట్‌ అయ్యారు. చంద్రబాబునాయుడు ఎన్నికల ముందు ప్రజలను మభ్యపెట్టేందుకు మహిళా సంఘాలకు పసుపు కుంకుమ, వృద్ధ్యాప్య, వికలాంగు, వితంతు పింఛన్లు పెంపు, అన్నదాత సుఖీభవ వంటి పథకాలను అమలు చేశారు.

అంతకుముందు నిరుద్యోగ భృతితో యువతను ఆకట్టుకునే ప్రయత్నం చేశారు. కాని ఇవేవీ జగన్‌ మోహన్‌రెడ్డి ప్రభంజనాన్ని అడ్డుకోలేకపోయాయి. ఆయన విశ్వసనీయతను అర్థం చేసుకున్న ఓటర్లు ‘జగన్‌కు ఒక్క అవకాశం ఇద్దాం’ అన్న భావనతో పోలింగ కేంద్రానికి వెళ్లడం ఇంతటి భారీ విజయం ఆ పార్టీని వరించేందుకు కారణమైందనేది రాజకీయ విశ్లేషకుల మాట. 

అభ్యర్థుల ఎంపిక, పోల్‌ మేనేజ్‌మెంట్‌తో మంచి ఫలితాలు
ఈ ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ అధినేత జగన్‌మోహన్‌రెడ్డి మేనియాతో పాటు ఆయన వ్యూహాత్మకంగా ముందుకెళ్లడం ఆ పార్టీకి అద్భుత ఫలితాలు తెచ్చి పెట్టింది. అభ్యర్థుల ఎంపికలో ఆద్యంతం జాగ్రత్తలు తీసుకుని గెలుపు గుర్రాలకు పోటీ చేసే అవకాశం కల్పించారు. రెండు, మూడు చోట్ల పార్టీ సమన్వయకర్తలను మార్పు చేసి కూడా విజయతీరాలకు చేరే వారిని ఎంపిక చేసుకున్నారు. వారికే టికెట్లు కేటాయించి ఎన్నికల బరిలో దించడంతో సఫలీకృతులయ్యారు.

మరోవైపు పోలింగ్‌కు రెండు రోజుల ముందు ప్రత్య«ర్థి తెలుగుదేశంపార్టీ నాయకులకు కూడా ఊహకందని విధంగా పోల్‌మేనేజ్‌మెంట్‌ చేశారు. అవతల పక్షం అభ్యర్థులకు సైతం గాలం వేసి ఓట్లు సంపాదించారు. వీటితో పాటు ఎన్నికలకు రెండేళ్లు ముందు బొత్స సత్యనారాయణ వంటి కీలక నాయకుడు వైఎస్సార్‌సీపీలో చేరడం ఆ పార్టీకి అదనపు బలంగా మారింది. బొత్స సత్యనారాయణ తనకు మాత్రమే సాధ్యమైన రాజకీయ ఎత్తుగడలతో తన మేనల్లుడు, జిల్లా పార్టీ రాజకీయ వ్యవహారాల సమన్వయకర్త మజ్జి శ్రీనివాసరావు సమన్వయ పటిమతో కొన్ని నియోజకవర్గాల్లో పార్టీని గెలిపించారంటే అతిశయోక్తి కాదు. 
 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top